వైద్య రంగంలో నవ శకం ఆరంభమైంది. కామారెడ్డి జిల్లా కేంద్రంగా చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. స్థానిక ప్రజల దశాబ్దాల కల అయిన వైద్య కళాశాల కార్యరూపం దాల్చింది. రెండేండ్ల క్రితం ఇచ్చిన మాట ప్రకారం కామారెడ్డి వైద్య కళాశాలను సీఎం కేసీఆర్ శుక్రవారం హైదరాబాద్ నుంచి లాంఛనంగా ప్రారంభించారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్యేలు హన్మంత్ షిండే, జాజాల సురేందర్, జిల్లా ప్రజాప్రతినిధులు మెడికల్ కళాశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. వైద్యవిద్య సీట్లు దక్కించుకున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ సందర్భంగా భావోద్వేగానికి గురయ్యారు. కేసీఆర్ ప్రభుత్వంతోనే మెడిసిన్ చదువుకునే అవకాశం లభించిందని వారు హర్షం వ్యక్తంచేశారు. ప్రారంభోత్సవం అనంతరం నిర్వహించిన భారీ ర్యాలీకి జిల్లావ్యాప్తంగా ప్రజలు, బీఆర్ఎస్ కార్యకర్తలు తరలివచ్చారు. అడుగడుగునా గులాబీ పూల వర్షం కురిపిస్తూ నృత్యాలు చేస్తూ హుషారుగా కదిలారు. మెడికల్ కాలేజీ నుంచి దేవునిపల్లి, నిజాంసాగర్ చౌరస్తా, సిరిసిల్ల రోడ్డు మీదుగా జేపీఎన్ మార్గం వరకు ర్యాలీ కొనసాగింది. అక్కడ నిర్వహించిన సభలో పజాప్రతినిధులు.. వైద్య కళాశాల మంజూరుచేసిన సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు.
– నిజామాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/కామారెడ్డి
కామారెడ్డి జిల్లా కేంద్రంగా చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. దశాబ్దాలుగా ఈ ప్రాంత వాసులంతా ఎదురుచూస్తున్న మెడికల్ కళాశాల ప్రారంభోత్సవం శుక్రవారం అట్టహాసంగా కొనసాగింది. రెండేండ్ల క్రితం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం 2023-24 విద్యా సంవత్సరం నుంచి వైద్య విద్యను అందించేందుకు కాలేజీ శాశ్వత భవనంలో కొలువుదీరింది. 100 సీట్లతో మొదటి ఏడాది ప్రారంభమైన మెడికల్ కాలేజీని వర్చువల్ విధానంలో సీఎం కేసీఆర్ ప్రారంభించారు. కార్యక్రమంలో మెడికల్ కాలేజీ నుంచి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్యేలు హన్మంత్ షిండే, జాజాల సురేందర్, డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబుద్దీన్, జడ్పీ చైర్పర్సన్ దఫేదార్ శోభ పాల్గొన్నారు. వర్చువల్ విధానంలో మెడికల్ కాలేజీల ప్రారంభోత్సవం మొదలవ్వగానే సీఎం కేసీఆర్ మొదటగా కామారెడ్డి గురించే మాట్లాడారు. స్పీకర్ పోచారం, ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, జాజాల సురేందర్ పేర్లను ప్రత్యేకంగా ప్రస్తావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవం జరిగిన వెంటనే కామారెడ్డి పట్టణంలో సంబురాలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు.
వైద్యరంగంలో అద్భుత మార్పు : స్పీకర్ పోచారం
ఒకప్పుడు తెలంగాణ ప్రాంతంలో కేవలం 5 మెడికల్ కాలేజీలు, 2850 సీట్లు మాత్రమే మన బిడ్డలకు అందాయని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గుర్తుచేశారు. కానీ ఇప్పుడు సీఎం కేసీఆర్ జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయడంతో వైద్యవిద్య ప్రతి పేద కుటుంబానికీ చేరువైందన్నారు. జిల్లాకో మెడికల్ కళాశాల ఏర్పాటుచేయడం చారిత్రాత్మకమైన నిర్ణయంగా అభివర్ణించారు. కాలేజీలో వైద్యవిద్యతోపాటు 330 పడకలతో పెద్ద దవాఖాన కూడా అందుబాటులోకి రాబోతున్నదని స్పష్టం చేశారు. పైసా ఖర్చు లేకుండా ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్న సంకల్పంతోనే ఈ ఏర్పాట్లు చేశారన్నారు. దవాఖానలో అధునాతన వసతులు కల్పించడంతో కార్పొరేట్ హాస్పిటాళ్లను తలదన్నేలా సర్కారు వైద్య సేవలు అందుతున్నాయని వివరించారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ దార్శనికతతోనే ఇంతటి ఘనమైన మార్పులు సంభవిస్తున్నాయని పోచారం చెప్పుకొచ్చారు. రాష్ట్రం ఏర్పడిన నాటికి రాష్ట్రంలో 14వేల పడకలు అందుబాటులో ఉంటే, ఇప్పుడు 53వేల పడకలకు చేరిందని తెలిపారు. దేశంలో వైద్య విద్యకు తెలంగాణ కేరాఫ్గా నిలిచిందని, జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటుతోనే ఇది సాధ్యమైందన్నారు. కుల మతాలు, పార్టీలకు అతీతంగా రాష్ట్ర ప్రజలకు సేవలు అందుతున్నాయని స్పీకర్ పోచారం అన్నారు.
తెలంగాణలో తెల్లకోటు విప్లవం
తెలంగాణలో 2014కు మునుపు 5 మెడికల్ కాలేజీలుంటే వచ్చే విద్యా సంవత్సరానికి 34 కళాశాలలను ఏర్పాటు చేసిన ఘనతను సీఎం కేసీఆర్ దక్కించుకోబోతున్నారు. తెలంగాణలో తెల్లకోటు విప్లవం వచ్చింది. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే కామారెడ్డిని జిల్లా కేంద్రంగా మార్చడం, మెడికల్ కాలేజీని ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నా. ఇంతగా అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్కు పాదాభివందనం. మెడికల్ కాలేజీ అనగానే వైద్య విద్యకే పరిమితం కాదు. దీంతోపాటుగా 330 పడకల దవాఖాన కూడా ఏర్పాటవుతుంది. త్వరలోనే 500 పడకలకు దవాఖాన సామర్థ్యం పెరుగుతుంది. కాలేజీ పరిసరాలు త్వరలో మరో పట్టణంగా మారడం తథ్యం. గతంలో సంపన్నులకే పరిమితమైన వైద్యవిద్య.. కేసీఆర్ పాలనలో పేద కుటుంబానికీ చేరువయ్యింది. ధాన్యం ఉత్పత్తిలో నంబర్ వన్ అయినట్లే, వైద్యరంగంలోనూ తెలంగాణ అగ్రస్థానం సాధిస్తుంది.
-గంప గోవర్ధన్, ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే
కనీవినీ ఎరుగని అద్భుత ఘట్టం..
రాష్ట్రంలో ఒక్కసారే తొమ్మిది మెడికల్ కళాశాలలను ప్రారంభించడం గతంలో కనీవీనీ ఎరుగని అద్భుత ఘట్టం. పెద్ద సంఖ్యలో మెడికల్ సీట్లను అందుబాటులోకి తెచ్చి రాష్ట్ర ప్రజల కలను సీఎం కేసీఆర్ సాకారం చేశారు. యావత్ తెలంగాణ తరఫున ముఖ్యమంత్రికి ధన్యవాదాలు. పేద విద్యార్థులకు వైద్య విద్యను చేరువ చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్.
-హన్మంత్ షిండే, జుక్కల్ ఎమ్మెల్యే
ఉద్యమాలకు పురిటిగడ్డ కామారెడ్డి
తెలంగాణ ఉద్యమాలకు పురిటిగడ్డ కామారెడ్డి. ఎన్నో పోరాటాలు, ఒడిదొడుకులను ఎదుర్కొని తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నాం. ఉద్యమ నాయకుడు కేసీఆర్ పిలుపుతో యావత్ తెలంగాణ కదిలి వచ్చి ఆయన వెంట నడిచింది. స్వరాష్ట్రంతోనే కొత్త జిల్లాలు, ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసుకొని ప్రజలకు పాలనను చేరువ చేసుకున్నాం. ఈ విజయం కార్యకర్తలదే.
– జాజాల సురేందర్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే
చాలా ఆనందంగా ఉంది
మొదటి అటెమ్ట్లోనే ఎంబీబీఎస్ సీటు వచ్చింది. మాది రాజస్థాన్. అక్కడ సీటు లభించకపోవడంతో చాలా నిరాశ చెందాను. కానీ తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో తొమ్మిది మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేయడంతో నాకు సులువుగా సీటు లభించింది. దీంతో కామారెడ్డి పట్టణంలో మెడికల్ కళాశాలను ఎంచుకున్నాను. నాకు ఇక్కడ ఎంబీబీఎస్ సీటు లభించడం చాలా ఆనందంగా ఉన్నది.
– ఎ.అక్షత్, రాజస్థాన్
మా బాబుకు సీటు వస్తదని అనుకోలేదు..
మాది రాజస్థాన్ కావడంతో అక్కడి నుంచి ఎక్కడ ఎంబీబీఎస్ చదవాలో తెలియక చాలా తికమకపడ్డాం. తెలంగాణ ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రారంభించి మాలాంటి వారికి ఇక్కడ సీటు వచ్చేలా చేసింది. మా బాబు అక్షత్కు సీటు వస్తదని అనుకోలేదు. దూరమైనా ఇక్కడ సీటు లభించడం సంతోషం. ఎలాంటి కష్టం లేకుండా కామారెడ్డి మెడికల్ కళాశాలలో మా బాబుకు సీటు లభించింది.
– విష్ణు, (బి.అక్షత్ తండ్రి) రాజస్థాన్
సీఎం కృషితోనే మా కల సాకారం..
మాది పేద కుటుంబం. గతంలో ఎంత టాలెంట్ ఉన్నా డబ్బులు ఉంటేనే సీటు లభించేది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ మాలాంటి పేదవారికి కూడా ఎంబీబీఎస్ సీట్లు దక్కాలనే ఉద్దేశంతో జిల్లాకో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేశారు. ఇంటర్మీడియెట్ పూర్తయిన తర్వాత ఎంసెట్లో ర్యాంకు సాధించడంతో కౌన్సెలింగ్లో కామారెడ్డిలో సీటు వచ్చింది. వెబ్ ఆప్షన్లో మంచిర్యాలకు వెళ్తున్నాను. కానీ నాకు ఎంబీబీఎస్ సీటు వస్తదని అనుకోలేదు.
– సి.శ్రావణి, నిర్మల్
ఎంబీబీఎస్ చదివిస్తానని అనుకోలేదు..
నేను వ్యవసాయం చేస్తా. నా కూతురు శ్రావణిని డాక్టర్ చేసే భాగ్యం కల్పించింది సీఎం కేసీఆర్. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాం. తెలంగాణ ప్రభుత్వం మాలాంటి వారికి ఎంతో మేలు చేస్తున్నది. మెడికల్ కళాశాలలు ఇన్ని లేకపోతే నా కూతురు ఎంబీబీఎస్ చదువుకునేది కాదు.
– నరేందర్, (శ్రావణి తండ్రి) నిర్మల్
మొదటి ప్రయత్నంలోనే సీటు లభించింది..
గతంలో ఎన్నిసార్లు ఎంసెట్ రాసినా ఎంబీబీఎస్ సీటు లభించేది కాదు. అప్పుడు కళాశాలలు, సీట్లు తక్కువగా ఉండేవి. తెలంగాణ ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ఎక్కువగా ఏర్పాటు చేయడంతో ఎంబీబీఎస్ సీటు సులువుగా లభించింది. కామారెడ్డిలో సీటు లభించినప్పటికీ ైస్లెడింగ్లో కొత్తగూడెంలోని మెడికల్ కళాశాలలో చేరేందుకు అవకాశం లభించింది.
– ఇ.హరిణి, ఖమ్మం
తెలంగాణ ప్రభుత్వానికి రుణపడి ఉంటా..
మహారాష్ట్రలో నాకు సీటు రావడం కష్టంగా ఉన్న తరుణంలో తెలంగాణలో అనేక మెడికల్ కళాశాలలు ఉండడంతో సులభంగా ఎంబీబీఎస్ సీటు వచ్చింది. మొదటగా కామారెడ్డిలో వచ్చినప్పటికీ ైస్లెడింగ్లో సిద్దిపేటలోని మెడికల్ కళాశాలలో సీటు లభించింది. ఎంబీబీఎస్ సీటు రావడానికి కృషి చేసిన తెలంగాణ ప్రభుత్వానికి రుణపడి ఉంటాను.
-హెచ్.జయసింగ్, మహారాష్ట్ర
సంతోషంగా ఉంది..
దోమకొండ: కామారెడ్డి మెడికల్ కళాశాలలో సీటు రావడం సంతోషంగా ఉంది. వైద్యవిద్య పరంగా సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారు. గతంలో ఎంబీబీఎస్ సీటు రావాలంటే చాలా కష్టంగా ఉండేది. కొందరు ఇతర దేశాలకు వెళ్లి చదువుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ప్రతి జిల్లాకు మెడికల్ కళాశాల ఏర్పాటు చేయడం అభినందనీయం.
-శ్రావణి, సంగారెడ్డి
సీటు వస్తుందనుకోలేదు..
కామారెడ్డి మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు వస్తుందని అనుకోలేదు. గతంలో చాలా మంచి ర్యాంకు వస్తేనే సీటు వచ్చేది. జిల్లాలో మెడికల్ కళాశాల ఏర్పాటుతో చాలా మంది విద్యార్థులకు వైద్యవిద్య అందుబాటులోకి వచ్చింది. సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం.
-చందన, బాన్సువాడ
సొంతూరులోనే సీటు వచ్చింది..
మాది కామారెడ్డి. నేనూ దగ్గరలోని డీగ్రీ కళాశాలలో ఫ్రొఫెసర్గా పనిచేస్తున్నా. మా కుమారుడికి ఇక్కడి మెడికల్ కళాశాలలోనే సీటు రావడంతో ఆనందం కలిగింది. లేదంటే ఇతర దేశాలు, రాష్ర్టాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు మా కండ్లముందే మా పాప చదువుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం.
-రామస్వామి, అసిస్టెంట్ ప్రొఫెసర్,( విద్యార్థి తండ్రి) కామారెడ్డి
హ్యాట్సాఫ్.. సీఎం కేసీఆర్
కామారెడ్డి మెడికల్ కళాశాలలో ఫ్యాకల్టీ బాగుంది. అనుభవం ఉన్నవారి దగ్గర పిల్లలు ఉత్తమ వైద్యులుగా మారుతారని అశిస్తున్నాం. అనుకున్న సమయానికి మెడికల్ కళాశాలలను నిర్మించి, ప్రారంభించడం అభినందనీయం. హ్యాట్సాఫ్.. సీఎం కేసీఆర్.
– గౌతమ్,(విద్యార్థి తండ్రి) హైదరాబాద్
దూరప్రాంతాలకు వెళ్లకుండా..
వైద్యవిద్య కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా సొంత జిల్లాలోనే మెడికల్ కళాశాల ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. ప్రజల కోసం పనిచేస్తున్న సీఎం కేసీఆర్ నాయకత్వం రాష్ర్టానికి అవసరం. కామారెడ్డిలో మెడికల్ కళాశాల ఏర్పాటుతో ఎంతో మంది విద్యార్థులకు లబ్ధిచేకూరుతుంది.
-కరుణ, (విద్యార్థి తల్లి) కామారెడ్డి
గ్రామీణ ప్రాంత విద్యార్థులకు వరం
గ్రామీణ ప్రాంతవిద్యార్థులకు వైద్య కళాశాల వరంలా మారింది. కాలేజీలో ఎక్కువ మంది స్థానికులే ఉన్నారు. అదంతా సీఎం కేసీఆర్ చొరవే. పట్టుదలతో ఎంబీబీఎస్ పూర్తిచేసి పేదలకు సేవ చేయాలనేదే నా లక్ష్యం. ఈ అవకాశం కల్పిస్తున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు.
-అక్షిత్, వరంగల్
పేద విద్యార్థులూ వైద్యులయ్యే అవకాశం..
కోట్ల రూపాయలు పెట్టి సీట్లు కొనుక్కోలేని పేదింటి విద్యార్థులు కూడా వైద్యులయ్యే అవకాశం కల్పించిన గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ కావాలనే కల.. కలగానే మిగిలిపోయేది. ఇప్పుడు తెలంగాణలో జిల్లాకో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసి అటు ప్రజలకు, ఇటు విద్యార్థులకు మేలు చేశారు. సీఎం కేసీఆర్కు జిల్లా ప్రజలు, విద్యార్థుల తరఫున కృతజ్ఞతలు.
-ముజీబుద్దీన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు