బాన్సువాడ టౌన్, జూలై13 : రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ మేరకు బుధవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. రెండు రోజుల నుంచి నియోజకవర్గ పరిధిలోని పలు మండలాల అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులతో అత్యవసర సమావేశం నిర్వహించామన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాల్సిన అవసరం ప్రజాప్రతినిధులుగా మన ప్రధాన బాధ్యత అని తెలిపారు. అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రావొద్దని కోరారు. అంతేకాకుండా నియోజకవర్గం పరిధిలోని అన్ని చెరువులు, కాలువలు, కుంటలు నిండి ప్రమాదస్థాయిలో ఉన్నందున ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అదే విధంగా అలుగు ద్వారా నీరు బయటకు విడుదల చేస్తూ చెరువులు ప్రమాదాలకు గురికాకుండా చూసుకోవాలని సూచించారు. విద్యుత్ ప్రమాదాలను నివారించేందుకు తగిన జాగ్రత్తలు వహించాలని సూచించారు.