ఉమ్మడి జిల్లా వరప్రదాయిని నిజాంసాగర్ ప్రాజెక్టుకు కాళేశ్వర గంగ జీవధారగా మారింది. ఆయకట్టు రైతుల కన్నీటి కష్టాలను తీర్చి.. రెండు పంటల సాగుకు కొండంత భరోసానిచ్చింది. ఎక్కడో ఉన్న మేడిగడ్డ నుంచి ఎగిసివస్తున్న కాళేశ్వరం జలాలు ఉమ్మడి జిల్లాలోని వేలాది ఎకరాల భూములకు ప్రాణాధారగా మారాయి. రైతులకు ధాన్యం సిరులు కురిపించనున్నాయి. మంజీరా నదిపై కట్టిన నిజాంసాగర్ను సమైక్య పాలకులు ఏనాడూ పట్టించుకోలేదు. అదే సమయంలో కాలం కనికరించక ఆయకట్టు బీడుగా మారేది. పొట్ట చేత పట్టుకుని రైతాంగం వలసపోయేది. అయితే స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ తన ఇంజినీరింగ్ ప్రతిభతో అద్భుతాలు సృష్టించారు. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి అట్టడుగున ఉన్న గంగమ్మను ఆకాశమంత ఎత్తుకు తరలించి లక్షలాది ఎకరాలకు భరోసా కల్పించారు. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లోని రైతులకూ లబ్ధి కలిగేలా చేశారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో నిజాంసాగర్ బోసిపోయింది. అయితే, ఆయకట్టు కింద పంటల సాగుకోసం కాళేశ్వరం జలాలతో సాగర్ను నింపేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించారు. మేడిగడ్డ నుంచి సుందిళ్ల, శ్రీపాద ఎల్లంపల్లి, మిడ్మానేరు మీదుగా మల్లన్నసాగర్కు, అక్కడి నుంచి కొండ పోచమ్మసాగర్కు నీటిని లిఫ్ట్ చేసి హల్దీ వాగు ద్వారా నిజాంసాగర్కు చేర్చనున్నారు.
కామారెడ్డి, జూలై 8 (నమస్తే తెలంగాణ): ఒకనాడు వానల్లేక, వరద రాక మంజీర బోసిపోయేది. నిజాంసాగర్ ఎండిపోయి, ఆయకట్టు కళ తప్పేది. పంటలు పండక, పని దొరకక రైతాంగం వలస పోయేది. కానీ వట్టిపోయిన నిజాంసాగర్కు కాళేశ్వరం గంగ ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నది. ఆయకట్టు కింద రెండు పంటల సాగుకు భరోసా కల్పిస్తున్నది. వానకాలం పంటల సాగుకు సరిపడా నీళ్లు ఇవ్వాలని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సీఎం కేసీఆర్కు విజ్ఞప్తి చేయగా, ఆయన అంగీకరించారు. త్వరలోనే మల్లన్నసాగర్ నుంచి ఐదు టీఎంసీల నీటిని నిజాంసాగర్కు విడుదల చేయనున్నారు.
వానకాలం ప్రారంభమై నెల రోజులవుతున్నా, జూలై మొదటి వారం గడిచినా సరైన వానలు కురవలేదు. చెప్పుకోదగ్గ వర్షాలు లేకపోవడంతో రైతన్నలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. అయితే, నిజాంసాగర్ ఆయకట్టు కింద ఉన్న రైతులు మాత్రం దర్జాగా పంటలు సాగు చేసుకుంటున్నారు. ఇందుకు ప్రధాన కారణం కాళేశ్వరం జలాలు. నీటి విడుదలకు సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం ఇచ్చిన భరోసాతో రెట్టించిన ఉత్సాహంతో రైతులు ముందుకు ‘సాగు’తున్నారు. జోరుగా వరి నాట్లు వేస్తున్నారు.
32.8 మిల్లీ మీటర్ల వర్షం లోటు
జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. గత జూన్ నెలలో 144.8 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 61.5 మిల్లీమీటర్ల వర్షమే కురిసింది. 57 మిల్లీ మీటర్ల లోటు వర్షపాతం నమోదైంది. జూలై మొదటి వారంలో సాధారణ వర్షపాతం కన్నా ఎక్కువగా కురిసినా, మొత్తంగా చూస్తే 32.8 మిల్లీ మీటర్ల లోటు వర్షపాతమే ఉంది. అతి తక్కువ వర్షపాతం నమోదైన మండలాల్లో పెద్దకొడప్గల్, నిజాంసాగర్, లింగంపేట, గాంధారి, సదాశివనగర్, తాడ్వాయి, కామారెడ్డి, రామారెడ్డి, మాచారెడ్డి, పాల్వంచ మండలాలు ఉన్నాయి. నిజాంసాగర్ పరీవాహక ప్రాంతాల్లోనూ వర్షపాతం తక్కువగా నమోదైంది. దీంతో నిజాంసాగర్లో 10 నుంచి 50క్యూసెక్కుల లోపు మాత్రమే ఇన్ఫ్లో ఉంది.
నిజాంసాగర్లో తగ్గుతున్న నీరు..
నిజాంసాగర్ ఆయకట్టు కింది రైతులు ముందస్తు పంటల సాగుకు సిద్ధమై, నారుమళ్లు పోసుకున్నారు. జూన్లో సరైన వర్షాలు లేకపోవడంతో స్పీకర్ పోచారం స్పందించి, రైతుల కోసం నిజాంసాగర్ నుంచి నీటిని విడుదల చేయించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్తో మాట్లాడారు. సీఎం ఆదేశాల మేరకు గత నెల 21 నుంచి నీటి విడుదల ప్రారంభించారు. నిత్యం వెయ్యి క్యూసెక్కుల నీటిని ప్రధాన కాలువ ద్వారా ఆయకట్టు పొలాలకు విడుదల చేస్తున్నారు. సాగర్లో 5 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, ప్రస్తుతం 2 టీఎంసీల నీరు విడుదల చేశారు. ఇంకా 3 టీఎంసీల నీరు మాత్రమే మిగిలి ఉంది. అయితే, కాళేశ్వరం జలాలు రానుండడంతో నిజాంసాగర్, బాన్సువాడ, బీర్కూర్, వర్ని, నస్రుల్లాబాద్, కోటగిరి, చందూర్ మండలాల్లోని రైతులు నిర్భయంగా పంటలను సాగు చేసుకొంటున్నారు.
కాళేశ్వరం నుంచి 5 టీఎంసీలు
నిజాంసాగర్లో ఇప్పుడున్న 3 టీఎంసీల నీరు మూడు తడులకు సరిపోతుంది. అయితే ఒకవేళ వర్షాభావ పరిస్థితులు ఏర్పడిన పక్షంలో పంటల సాగుకు ఇబ్బంది ఏర్పడుతుంది. దీంతో ముందస్తు జాగ్రత్తగా స్పీకర్ పోచారం సీఎం కేసీఆర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొండ పోచమ్మసాగర్ను నింపి అక్కడి నుంచి 5 టీఎంసీల నీటిని నిజాంసాగర్కు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. కొండపోచమ్మసాగర్లో ప్రస్తుతం 9 టీఎంసీల నీరు ఉంది. ప్రస్తుతం కాళేశ్వరం పంపుల ద్వారా నీటిని నింపే కార్యక్రమం కొనసాగుతున్నది. దీంతో కొండపోచమ్మ సాగర్లో నీటిమట్టం పెరగ్గానే నిజాంసాగర్ను నింపేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో సాగర్ ఆయకట్టు రైతులు నిర్భయంగా పంటల సాగులో నిమగ్నమయ్యారు.
నిజాంసాగర్లోకి కాళేశ్వరం జలాలు..
నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు నీటి విడుదల కొనసాగుతున్నది. ప్రాజెక్టులో ప్రస్తుతం 3 టీఎంసీల నీరు ఉంది. ఒకవేళ వర్షాభావ పరిస్థితులు ఏర్పడినా నిజాంసాగర్కు ఢోకా లేదు. కాళేశ్వరం నుంచి మల్లన్నసాగర్ ద్వారా కొండపోచమ్మ సాగర్కు, అక్కడి నుంచి నిజాంసాగర్కు విడుదల చేయనున్నారు. 5 టీఎంసీల నీరు నిజాంసాగర్లోకి రానున్నది. అందుకే రైతులు నిర్భయంగా పంటలను సాగు చేసుకోవచ్చు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
– శ్రీనివాస్, చీఫ్ ఇంజినీర్, నీటిపారుదల శాఖ
కాళేశ్వరంతో మేం బేఫికర్..
వానకాలంతో మాకు సంబంధం లేదు. నిజాంసాగర్కు కాళేశ్వరం నుంచి కూడా నీళ్లు తెప్పిస్తామంటున్నారు. అందుకే బేఫికర్గా పంటలను సాగు చేసుకొంటున్నాం. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంటలను సాగు చేస్తాం. వానకాలం సీజన్కు ఢోకా లేదు.
– పోగు పాండు, యువరైతు, బీర్కూర్
నిర్భయంగా పంటలను సాగుచేసుకోవచ్చు..
వానకాలం సీజన్లో ఇప్పటికే నాట్లు వేసుకున్నాం. నీటికి ఎలాంటి ఢోకా లేదు. ఇప్పటికే నిజాంసాగర్ నీరు మాకు వస్తున్నది. పంటలకు సరిపడా నీళ్లు వస్తాయని మాకు భరోసా ఉన్నది. కాళేశ్వరం జలాలు నిజాంసాగర్కు వస్తాయి. అక్కడి నుంచి మాకు సరఫరా చేస్తారు. అందుకే పంటలను సాగు చేసుకుంటున్నాం.
– మోహన్, సంభాపూర్, బీర్కూర్
గతంలో మస్తు తిప్పలు పడ్డం..
సమైక్యాంధ్రలో నిజాంసాగర్ ఆయకట్టు కింద పంటలను సాగు చేయడం ఎంతో ఇబ్బందిగా ఉండేది. నిజాంసాగర్లో నీళ్లు లేకుంటే సింగూరు నుంచి నీటిని విడుదల చేయాలంటే ఆందోళనలు, ధర్నాలు చేసేటోళ్లం. ఎన్ని ఆందోళనలు చేసినా ప్రభుత్వం స్పందించేది కాదు. కానీ నేడు తెలంగాణలో పరిస్థితులు మారాయి. కాళేశ్వరం నుంచి నిజాంసాగర్లోకి నీళ్లు వచ్చేలా ఏర్పాట్లు చేసిండ్రు. స్పీకర్ పోచారం సారు రైతుల పక్షపాతి. ఆయన ఎప్పుడంటే అప్పుడు నీటిని విడుదల చేయించేందుకు సిద్ధంగా ఉన్నారు. అందుకే కాలమైతదో కాదోననే భయం లేకుండా పంటలను సాగు చేసుకుంటున్నం.
– సురేశ్, రైతు, బీర్కూర్