రామారెడ్డి డిసెంబర్ 5 : రామారెడ్డి మండలం ఇసన్నపల్లి (రామారెడ్డి) గ్రామాల్లో వెలసిన శ్రీ కాలభైరవస్వామి జన్మదిన వేడుకల్లో భాగంగా నాల్గో రోజైన మంగళవారం స్వామి వారి పుట్టిన రోజు (అష్టమి తిథి) సందర్భంగా సంతతధారాభిషేకం నిర్వహించారు. ఆలయ ఆవరణలో ఉన్న కోనేరు నుంచి గంగాజలం తెచ్చి స్వామి వారికి పూజలు చేశారు. ధ్వజారోహణం, మహాపూజలు కొనసాగాయి. అనంతరం భక్తులు సమర్పించిన విరాళాలతో ఏర్పాటు చేసిన స్వామి వారి బంగారు విగ్రహాన్ని కార్యాలయం నుంచి భాజాభజంత్రీలతో ఎదుర్కొని వెండి తొట్లెలో ఉంచి ఊయల సేవ నిర్వహించారు.
అనంతరం ఆలయం చుట్టూ ఎండ్లబండ్లు (పప్పు ఫలహారబండ్లు) ప్రదర్శన నిర్వహించారు. ఆలయ అర్చకులు స్వామి వారికి సిందూర పూజలు చేసి స్వామి వారికి ఇష్టమైన వడల హారంతో అలంకరించారు. కామారెడ్డి అసిస్టెంట్ కలెక్టర్ చంద్రమోహన్ దంపతులు స్వామి వారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ఈవో ప్రభురాంచంద్రం,సీనియర్ అసిస్టెంట్ సురేందర్, శైవులు జంగం ప్రభాకర్స్వామి, కోటయ్య, భక్తులు పాల్గొన్నారు.