నిజామాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ఆర్మూర్ : నాలుగు నెలల క్రితం కలెక్టరేట్ ప్రాంగణంలోని అక్షర భవన్లో ఉన్న వైద్యారోగ్య శాఖలో పరిపాలనా అధికారి(ఏవో) లం చం తీసుకుంటూ రెడ్హ్యాండెడ్గా ఏసీబీకి చిక్కాడు. దీంతో కలెక్టరేట్లో ఒక్కసారిగా అక్రమార్కుల్లో గుబులు రేపింది. ఈ ఘటనతో కలెక్టర్ స్పందించి ఆయా శాఖల్లో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తీరు మార్చుకోవాలని హితవు పలికారు. సీన్ కట్ చేస్తే అదే అక్షర భవన్లో ఉన్న జిల్లా సంక్షేమ శాఖలో చీడ పురుగు అడ్డంగా ఏసీబీకి పట్టుబడింది. ఈసారి ఏకంగా జిల్లా సంక్షేమాధికారిణి ఝాన్సీలక్ష్మితో పాటుగా ఆర్మూర్ సీడీపీవోలో పని చేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ కూడా ఉండడం కలకలం రేపుతున్నది. నిత్యం జిల్లా అధికారిణికి సేవలు అందించే సామాన్య ప్రైవేటు డ్రైవర్ నుంచి డబ్బులు ఆశించి వేధింపులకు గురి చేయడంతో చేసేది లేక బాధితుడు అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించాడు. తన కాయకష్టానికి ప్రభుత్వం మంజూరు చేసిన అద్దె కారు కిరాయి డబ్బులు మంజూరు చేయడానికి ఝాన్సీలక్ష్మి హింస పెడుతుండడంతో డీడబ్ల్యూవో బండారాన్ని బట్టబయలు చేశాడు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్చార్జి ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్, సీఐ నగేశ్ చాకచక్యంగా వ్యవహరించి అవినీతి అధికారిణితో పాటు కంప్యూటర్ ఆపరేటర్ అర్చనను అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టిన అనంతరం జైలుకు తరలించే అవకాశాలున్నాయి.
కారు కిరాయిలో కక్కుర్తి…
ఝాన్సీలక్ష్మి వాస్తవానికి సంక్షేమ శాఖలో సీడీపీవోగా పని చేస్తున్నారు. ఆర్మూర్ ప్రాజెక్టు ఆఫీసర్గా ఉన్న ఈమెకు నిజామాబాద్ జిల్లా సంక్షేమాధికారిణిగా ఇన్చార్జి బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. రెండు సంవత్సరాలుగా ఈ పోస్టులో కొనసాగుతుండడంతో ఏకఛత్రాధిపత్యంగా వ్యవహరిస్తూ వస్తున్నది. జిల్లా అధికారిణిగా ఇన్చార్జి బాధ్యతల్లో ఉండడంతో ఈమెకు అద్దె ప్రాతిపదికన ప్రభుత్వం తరపున వాహనం సమకూరింది. 2021 ఆగస్టు నుంచి 2022 మార్చి వరకు అద్దె కారుకు సంబంధించిన కిరాయి డబ్బులను ప్రభు త్వం మంజూరు చేసి డీడబ్ల్యూవో అకౌంట్లో జమ చేసింది. చెక్కు రూపంలో డ్రైవర్ మహేందర్కు రూ.2.64లక్షలు ఇవ్వాల్సి ఉండగా కక్కుర్తి పడి డబ్బులు డిమాండ్ చేసింది. ఒక నెలకు ప్రభుత్వం అద్దె కారుకు రూ.33వేలు అందిస్తోంది. 8 నెలలకు రూ.2.64లక్షల చెక్కుపై సంతకం పెట్టడానికి నెలకు రూ.3వేలు చొప్పున ఝాన్సీలక్ష్మి లంచం డిమాండ్ చేసింది. 8నెలలకు మొత్తం రూ.24వేలు అడగడంతో అద్దె కారు ఓనర్ కమ్ డ్రైవర్ మహేందర్ చెల్లించడం ఇ బ్బందిగా ఉందని భావించి కొద్ది రోజులుగా సతమత మయ్యాడు. ఇదే విషయాన్ని శాఖలోని కొంత మంది ఉద్యోగులతోనూ తన బా ధను వెల్లగక్కాడు. లంచం ఇవ్వలేని స్థితిలో ఉన్నానంటూ బాధితుడు ఎంతగా మొ ర పెట్టుకున్నప్పటికీ ఝాన్సీలక్ష్మి మాత్రం చెక్కును రిలీజ్ చేయకపోవడంతో చేసేది లేక ఏసీబీని ఆశ్రయించాడు.
రూ.12వేలకు బేరం…
అద్దె కారు కిరాయికి రూ.2.60లక్షల బిల్లు మంజూరుకు రూ.24వేలు డబ్బులు డిమాండ్ చేసిన జిల్లా సంక్షేమాధికారిణి ఝాన్సీలక్ష్మి చివరకు రూ.12వేలకు బేరం కుదుర్చుకుంది. డ్రైవర్ను నానా తంటా లు పెట్టిన ఆమె చివరికి రూ.12వేలను ఆర్మూర్ సీడీపీవోలో పని చేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ అర్చనకు ఇవ్వాలంటూ సూచించింది. డీడబ్ల్యూవో ఝాన్సీలక్ష్మి చెప్పినట్లుగానే అర్చనకు పన్నెండు వేల రూపాయల నగదును ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కాయకష్టాన్ని నమ్ముకుని బతుకీడ్చుకుంటున్న ఓ సామాన్య డ్రైవర్ను డబ్బుల కోసం వేధిస్తూ ఏసీబీకి చిక్కిన ఝాన్సిలక్ష్మిపై సంక్షేమ శాఖలో అనేక ఆరోపణలు ఉన్నాయి. అంగన్వాడీ కేంద్రాల నుంచి నెల వారీగా మధ్యవర్తుల ద్వారా డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లుగా తెలిసింది. అంతేకాకుండా గుడ్ల సరఫరాలో కాంట్రాక్టర్లను గతంలో బెదిరింపులకు గురి చేసినట్లు సమాచారం. శాఖలోనూ ఉద్యోగులపై కసురుకోవడం, నోటికొచ్చినట్లు మాట్లాడడం, కొంత మందిపై దుర్భషలాడిన సంఘటనలు సైతం ఉన్నాయి. ప్రభుత్వ సహాయం కోసం సంక్షేమ శాఖకు వచ్చే దివ్యాంగులపైనా అమానవీయంగా వ్యవహరించిన ఘటనల్లోనూ కలెక్టర్కు ఫిర్యాదులు సైతం వెళ్లాయి. గతంలో ఉన్నతాధికారులు తీవ్ర స్థాయిలో మందలించినప్పటికీ తీరులో మార్పు లేకపోగా చివరికి ఏసీబీకి చిక్కడం విశేషం.
కలెక్టరేట్లోనూ తనిఖీలు…
ఆర్మూర్లోని చైల్డ్ ప్రొటెక్షన్ ప్రాజెక్టు ఆఫీసర్గా పని చేస్తున్న ఝాన్సీలక్ష్మి ఉదంతంతో ఒక్కసారిగా సంక్షేమ శాఖలో కలకలం రేపింది. ఏసీబీ అధికారులు లంచం తీసుకున్న అర్చనతో పాటుగా డీడబ్ల్యూవోను అదుపులోకి తీసుకుని విచారించారు. మరో బృందం నిజామాబాద్ కలెక్టరేట్లోని అక్షరభవన్కు వచ్చి తనిఖీలు చేపట్టారు. జిల్లా సంక్షేమాధికారిణి కార్యాలయంలో సోదాలు నిర్వహించడంతో పాటు స్థానిక ఉద్యోగుల వద్ద వివరాలు ఆరా తీశారు. ప్రైవేటు డ్రైవర్ వద్ద డబ్బులు డి మాండ్ చేసిన ఝాన్సీలక్ష్మి ఇతరత్రా కాంట్రాక్టుల్లో, ఉద్యోగుల వ్యవహారాల్లో అవినీతి, అక్రమాలకు సంబంధించిన వివరాలను ఆరా తీశారు. కలెక్టరేట్లో, ఆర్మూర్లో ఏకకాలంలో జరిగిన తనిఖీలతో ఉద్యోగులు బెంబేలెత్తిపోయారు.