మాక్లూర్/ధర్పల్లి/జక్రాన్పల్లి/ పొతంగల్/శక్కర్నగర్/మెండోరా/ డొంకేశ్వర్/ ఆలూర్, ఫిబ్రవరి 8 : మాక్లూర్ మండలంలోని చిన్నాపూర్ గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు పాల్గొని పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ ప్రతిఒక్కరూ ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న కండ్ల అద్దాలు, మందులను వేసుకుని ఆరోగ్యంగా ఉండాలన్నారు. అనంతరం మహిళా మండలి భవన నిర్మాణాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ మాస్త ప్రభాకర్, ఎంపీడీవో క్రాంతి, ఎంపీవో శ్రీనివాస్, మెడికల్ ఆఫీసర్ ప్రకాశ్, సర్పంచ్ లక్ష్మీ గంగారెడ్డి, ఎంపీటీసీలు సత్యనారాయణ, ఒడ్డెన్న, ఏపీఎం అనిల్, బీఆర్ఎస్ నాయకులు సుక్కి సుధాకర్, శేఖర్రావు, గంగారెడ్డి, సుమన్, మహిళా మండలి అధ్యక్షురాలు సుమలత గ్రామస్తులు పాల్గొన్నారు.
ధర్పల్లి మండలకేంద్రంలోని వీడీసీ ధర్మశాలలో కంటివెలుగు శిబిరాన్ని బుధవారం నిర్వహించారు. కంటి వెలుగు శిబిరాలు ప్రారంభం నుంచి మండలకేంద్రంలోని ఎన్టీఆర్ కాలనీ, బీసీ బాలుర వసతిగృహంలో కొనసాగగా.. కార్యక్రమం పూర్తికావడంతో మండల కేంద్రంలోని వీడీసీ ధర్మశాలలో చేపట్టారు. దీన్ని గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని మండల వైద్యాధికారి రఘువీర్గౌడ్ సూచించారు.
జక్రాన్పల్లి మండల కేంద్రంలో కొనసాగుతున్న కంటివెలుగు శిబిరాన్ని ఎంపీడీవో లక్ష్మణ్ బుధవారం పరిశీలించారు. మునిపల్లి, రామడుగు గ్రామాల్లో కూడా శిబిరాలు కొనసాగుతున్నాయని, సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
పొతంగల్ మండలకేంద్రంలోని రైతువేదికలో కొనసాగుతున్న కంటి వెలుగు శిబిరాన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ కరణ్, హెల్త్ సూపర్వైజర్ కృష్ణవేణి పరిశీలించారు. ఇప్పటివరకు ఎంతమంది కంటి పరీక్షలు చేయించుకున్నారని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
బోధన్ పట్టణం శక్కర్నగర్లోని కంటివెలుగు కేంద్రాన్ని స్థానిక వార్డు కౌన్సిలర్లు కొత్తపల్లి రాధాకృష్ణ, డేగావత్ ధూప్సింగ్ నాయక్ పరిశీలించారు. వార్డు ప్రజలకు కంటి పరీక్షలు చేయించారు.
మెండోరా మండలంలోని పోచంపాడ్ గ్రామంలో కొనసాగుతున్న కంటివెలుగు శిబిరాన్ని ఎంపీడీవో శ్రీనివాస్ పరిశీలించారు. డొంకేశ్వర్, ఆలూర్ మండల కేంద్రాల్లో కంటి వెలుగు శిబిరాలు కొనసాగుతునాయి.
రెండు లక్షలు
@ కంటి పరీక్షలు
కామారెడ్డి/ఖలీల్వాడి, ఫిబ్రవరి 8: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కంటి వెలుగు కార్యక్రమం కొనసాగుతున్నది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో బుధవారం నిర్వహించిన శిబిరాల్లో కంటి వైద్యులు పరీక్షలు నిర్వహించి అవసరం ఉన్న వారికి కంటి అద్దాలు, మందులను పంపిణీ చేశారు. కామారెడ్డి జిల్లావ్యాప్తంగా 44 బృందాలతో 5,739 మందికి పరీక్షలు చేసి 775 మందికి కంటి అద్దాలను పంపిణీ చేసినట్లు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ లక్ష్మణ్ సింగ్ తెలిపారు. జిల్లాలో బుధవారం వరకు మొత్తం 71,213 మందికి పరీక్షలు నిర్వహించి 13,283 మందికి అద్దాలను అందజేశామని చెప్పారు.
నిజామాబాద్ జిల్లాలో 9,455 మందికి పరీక్షలు నిర్వహించి 1,345 మందికి కంటి అద్దాలను పంపిణీ చేసినట్లు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి సుదర్శనం తెలిపారు. జిల్లావ్యాప్తంగా బుధవారం వరకు 1,23,616 మందికి పరీక్షలు చేసి 46,574 మందికి కంటి అద్దాలను అందజేశామని చెప్పారు. గ్రామాల్లో కొనసాగుతున్న కంటి వెలుగు శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.