Ready Action | ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు ఉమ్మడి జిల్లాలోని పల్లెలు. ఇక్కడి ఆహ్లాదకర వాతావరణం, ఆధ్యాత్మిక ప్రాంతాలు సినీ దర్శకులను కట్టిపడేస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణ యాస, భాష, ఇతివృత్తంపై దృష్టి సారించిన డైరెక్టర్లు.. సినిమా చిత్రీకరణకు మన పల్లెలనే ఎంపిక చేసుకుంటున్నారు. ఫిదా, లవ్స్టోరీ వంటి పలు చిత్రాలను ఇక్కడే తీశారు. అనేక షార్ట్ ఫిల్మ్లను కూడా మన ప్రాంతాల్లోనే చిత్రీకరించారు. ఉమ్మడి జిల్లాలోని పల్లెటూర్లు షూటింగ్లకు అనుకూలంగా ఉండడంతో వీటిపైనే ఆసక్తి చూపుతున్నారు.
హోయలొలికే గోదావరి, మంజీరా పరవళ్లు…గోదావరి తీరాన ఆహ్లాదకర పచ్చికబయళ్లు.. అబ్బురపరిచే సంభ్రమాశ్చర్యాలు.. ఒంపుసొంపులతో కట్టిపడేసే సాగర్ కాలువలు… మడమ తిప్పని మడ అడవులు.. అద్భుత శిల్పకళతో అలరారే చారిత్రక ఆలయాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో… ఎన్నెన్నో సుమనోహర ప్రాంతాలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సొంతం. ప్రకృతి రమణీయతకు ప్రసిద్ధి. సినిమా షూటింగ్లకు అనువైన వేదికగా నిలుస్తున్నాయి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు. ఒకవైపు పర్యాటక ప్రాంతాలుగా అలరిస్తూనే.. సినిమా షూటింగ్లకు నెలవుగా మారుతున్నాయి. ఉమ్మడి జిల్లాలోని షూటింగ్ స్పాట్లపై నమస్తే తెలంగాణ ప్రత్యేక కథనం.
– నస్రుల్లాబాద్/ ఎడపల్లి, ఏప్రిల్ 22
ఎడపల్లి మండలంలోని అలీసాగర్ ప్రసిద్ధి చెందిన షూటింగ్ స్పాట్. ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్లతోపాటు జానపద గేయాలను చిత్రీకరిస్తుంటారు. ఫిదా సినిమాలోని ఓ పాటకు సంబంధించిన సన్నివేశాన్ని చిత్రీకరించారు. భారతదేశ పటం మాదిరిగా ఉండే అలీసాగర్ పర్యాటకంగానూ పేరొందింది. ఇక్కడి గుట్టపై నుంచి ఎటువైపు చూసినా పచ్చని పంటలు, కొండలు కనిపిస్తాయి. సాగర్ను ఆనుకొని ఉండే పార్క్లో ప్రీవెడ్డింగ్ షూట్లు తీస్తుంటారు.
నస్రుల్లాబాద్ మండలంలోని నాచుపల్లి గ్రామంలో వందల ఏండ్ల చరిత్ర కలిగిన రామాలయం ఉంది. పురాణంలో పెద్దపులి కాపలా కాస్తున్న గుహమధ్యలో రాముల వారు వెలిశారని ప్రఖ్యాతి. ఇక్కడ ఫిదా సినిమా సన్నివేశాలను చిత్రీకరించారు. కొండరాళ్ల మధ్యన ఉండే ఈ ఆలయం వద్ద ఆహ్లాదకర వాతావరణం నెలకొంటున్నది. సినిమాలో ఈ ఆలయాన్ని మల్లన్నగుట్టగా చూపుతూ హీరో వరుణ్తేజ్, హీరోయిన్ సాయిపల్లవి మధ్య గుడి ప్రాశస్త్యాన్ని తెలిపే సన్నివేశాలను చిత్రీకరించారు. దీంతో ఈ గుట్టను యువత ఎక్కువగా సందర్శిస్తున్నది.
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఆధ్యాత్మిక, ప్రకృతి రమణీయ ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. వీటిని కేంద్రంగా చేసుకొని పలు చిత్రాలకు సంబంధించిన సన్నివేశాలను తీస్తుంటారు దర్శకులు. డిచ్పల్లి మండలంలోని ఖిల్లా రామాలయం వద్ద జానపద, సాంస్కృతిక కళా వైభవాలను చిత్రీకరిస్తుంటారు. ఇందల్వాయి మండలం సిర్నాపల్లిలో గడి, వాటర్ ఫాల్స్ వద్ద పలు సినిమాలకు చెందిన షూటింగ్ నిర్వహించారు.
బాల్కొండ నియోజకవర్గంలోనూ సినిమా షూటింగ్ల సందడి కనిపిస్తున్నది. మెండోరా మండలంలోని పోచంపాడ్ శ్రీరాంసాగర్ ప్రాజెక్టుపై హీరో కల్యాణ్రామ్ నటించిన ఎంఎల్ఏ(మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి) సినిమాలోని ఓ సన్నివేశాన్ని చిత్రీకరించారు. షూటింగ్లో భాగంగా ప్రాజెక్టుపై పెద్ద సంఖ్యలో అర్టిస్టులతో కూడిన ర్యాలీ చేపట్టారు. కమ్మర్పల్లి మండలం చౌట్పల్లిలో రాజ్యసభసభ్యుడు కేఆర్ సురేశ్రెడ్డికి చెందిన ఇంటి వద్ద సైతం అల్లరి నరేశ్ నటించిన సినిమాను చిత్రీకరించారు. వేల్పూర్ మండల కేంద్రంతోపాటు చుట్టు పక్కల పల్లెటూర్లు, వాగుల వద్ద సినీ సన్నివేశాలను చిత్రీకరించడం విశేషం. ఇవే కాకుండా రాళ్లవాగు సమీపంలో జానపద గేయాలను షూట్ చేస్తుంటారు.
ఆర్మూర్ ప్రాంతంలోనే ఆధ్యాత్మికతకు ప్రసిద్ధి చెందినది నవనాథ సిద్ధుల గుట్ట. ఈ గుట్ట వద్ద అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ సినిమాలోని సన్నివేశాలను చిత్రీకరించారు. గుట్ట కింది భాగంలో పారిపోయే సన్నివేశాన్ని చిత్రీకరించారు. అదేవిధంగా సమీపంలోని అంకాపూర్ గ్రామంలో జానపద గేయాలు, షార్ట్ ఫిలింలు తీస్తుంటారు. గ్రామం చుట్టూ ఎల్లప్పుడూ పచ్చనిపొలాలు కనిపించడం విశేషం. ఇక్కడి అందమైన ఇండ్లను చూస్తే అందరూ అవాక్కవ్వాల్సిందే. పలు సీరియళ్లు సైతం ఇక్కడి అందాల మేడల్లో చిత్రీకరించారు.