కామారెడ్డి, ఏప్రిల్ 15 : కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్గా ఇందుప్రియ ఎన్నికయ్యారు. గత చైర్పర్సన్పై అవిశ్వాస తీర్మానం నెగ్గగా.. అప్పటి నుంచి చైర్మన్ పదవి కోసం పోటీపడగా వైస్ చైర్పర్సన్గా ఉన్న ఇందుప్రియను సోమవారం నిర్వహించిన సమావేశంలో చైర్పర్సన్గా ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. మొత్తం 49 మంది కౌన్సిలర్లు, ఒక ఎక్స్అఫీషియో మెంబర్, ఎమ్మెల్యేతో కలిపి మొత్తం 50 మంది సభ్యులు ఉన్నారు. కోరంనకు 26 మంది సభ్యులు కావాల్సి ఉండగా 28 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు.
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి వచ్చిన సీల్డ్ కవర్లో ఇందూప్రియ పేరు రాగా..48, 38 వార్డుల కౌన్సిలర్లు సయ్యద్ అన్వర్ అహ్మద్, చాట్ల రాజేశ్వరు చైర్పర్సన్గా ఆమె పేరును ప్రతిపాదించగా సభ్యులందరూ ఆమోదించారు. 28 మంది చేతులెత్తడంతో మున్సిపల్ చైర్పర్సన్గా ఇందుప్రియ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆర్డీవో రఘునాథ్ రావు ప్రకటించారు. అనంతరం ప్రమాణం చేయించి ధ్రువపత్రం అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుజాత, కౌన్సిలర్లు పాల్గొన్నారు.