మాచారెడ్డి/సిరికొండ/డిచ్పల్లి, జనవరి 19 : ప్రమాదవశాత్తు నాటు తుపాకీ పేలి వేటగాడు మృ తి చెందిన సంఘటన నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని తూంపల్లి- కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం బంజపల్లి శివారులోని అటవీప్రాంతంలో గురువారం వేకువజామున చోటు చేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మాచారెడ్డి మండలంలోని మర్రితండాకు చెందిన రాంరెడ్డి, అశిరెడ్డి, సర్ధాపూర్తండాకు చెందిన రావోజీలు వన్యప్రాణులను వేటడానికి అటవీ ప్రాంతంలో గల చెరువు వద్దకు వెళ్లారు. చెరువులో దప్పిక తీర్చుకోవడానికి వచ్చే వన్యప్రాణులను వేటాడం కోసం రావోజీ హెడ్లైట్ ధరించి చెట్టుపైకి ఎక్కాడు. చెట్టుకింద ఉన్న రాంరెడ్డి నాటు తుపాకీని రావోజీకి అందించబోయాడు. చెట్టు పైనుంచి తుపాకీని వంగి తీసుకొనే క్రమంలో తుపాకీ జారిపోయి కిందపడి ట్రిగ్గర్కు తగిలింది. దీంతో తుపాకీ పేలడంతో వంగి ఉన్న రావోజీ (35) శరీరంలోకి బుల్లెట్ దూసుకెళ్లడంతో అక్కడిక్కడే మృతిచెందాడు.
రాంరెడ్డి, అశిరెడ్డి గురువారం ఉదయం 5 గంటలకు మాచారెడ్డి పోలీస్స్టేషన్కు వెళ్లి లొంగిపోయారు. సంఘటన వివరాలు తెలుపడంతో కామారెడ్డి రూరల్ సీఐ శ్రీనివాస్, మాచారెడ్డి ఎస్సై సంతోష్కుమార్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. దర్యాప్తు చేస్తుండగా సంఘటనా స్థలం నిజామాబాద్ జిల్లా సిరికొండకు వస్తుందని ఆ విషయాన్ని అక్కడి పోలీసులకు సమాచారం అందించారు. డీఎఫ్వో వికాస్మీన, ఎఫ్డీవో భవానీశంకర్, ఎఫ్ఆర్వో వినాయక్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ధర్పల్లి సీఐ సైదా, ఎస్సై నర్సిహుంలు వివరాలు సేకరించారు. నాటు తుపాకీని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ సైదా తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా దవాఖానకు తరలించారు. మృతుడికి భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
తుపాకీ, బుల్లెట్లు ఎక్కడివి ?
వన్యప్రాణుల వేటకు వెళ్లి మిస్ఫైర్ కావడంతో ఒకరు అక్కడిక్కడే మృతిచెందగా ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వారికి నాటుతుపాకీ, బుల్లెట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.