బోధన్ రూరల్, మార్చి 7: సాలూరా మండలం హున్సా గ్రామంలో హోలీ పండుగను పురస్కరించుకొని మంగళవారం సాయంత్రం పిడిగుద్దులాట నిర్వహించారు. సోమవారం రాత్రి కామదానం చేసిన గ్రామస్తులు ఉదయం హోలీ సంబురాలు జరుపుకొన్నారు. సాయంత్రం గ్రామంలో రెండు వర్గాలుగా ఏర్పడి హనుమాన్ మందిరం వద్దకు చేరుకున్నారు.
అడ్డుగా కట్టిన తాడుకు రెండువైపులా నిలబడి ముఖం, వీపులపై గుద్దుకున్నారు. ఈ ఆట సుమారు ఎనిమిది నిమిషాల పాటు కొనసాగింది. పిడిగుద్దులాటను చూడడానికి మన రాష్ట్రం నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పండుగ సందర్భంగా జాతర ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బోధన్ రూరల్ పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఏండ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం
హోలీ పండుగ రోజు పిడిగుద్దులాట నిర్వహించుకొనే సంప్రదాయం ఇక్కడ కొన్నేండ్లుగా కొనసాగుతున్నది. ఈ ఆటను నిర్వహించుకోవద్దని పోలీసులు చేప్పినప్పటికీ.. గ్రామస్తులు సంప్రదాయంగా వస్తున్నదని, ఈ ఆటను నిర్వహించకుంటే గ్రామానికి ఆరిష్టం జరుగుతుందని విశ్వసిస్తున్నారు. పిడిగుద్దులాట ప్రారంభానికి ముందు గ్రామ శివారులో కుస్తీపోటీలు నిర్వహించారు.