బాన్సువాడ టౌన్, ఏప్రిల్ 1: స్వరాష్ట్రంలోనే ఆలయాలకు మహర్దశ వచ్చిందని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. పట్టణంలోని శ్రీజ్ఞాన సరస్వతీ ఆలయ పరిసరాల్లో శనివారం హనుమాన్ దీక్షా స్వాముల 14వ సామూహిక మహా మండల పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆలిండియా హనుమాన్ దీక్షా సేవా సమితి అధ్యక్షుడు, విజయవాడ పీఠాధిపతి దుర్గాప్రసాద్ స్వామీజీ ఆధ్వర్యంలో కొనసాగింది. మహా మండల పూజలో భాగంగా 1008 మంది దంపతులతో లక్ష నాగవల్లి దళార్చన, సామూహిక లక్ష హనుమాన్ చాలీసా పారాయణంతోపాటు ప్రత్యేక యజ్ఞ, హోమాలు, అర్చన, అభిషేకాలు, సాయంత్రం మ హా మండల పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో సభాపతి కుటుంబసభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హక్కుల కన్నా బాధ్యత గొప్పది అనేది శ్రీరామతత్వమని, కష్టాల్లో కలిసి నడవాలనేది సీత తత్వమని, కుటుంబ బాధ్యత పంచుకోవాలనేది లక్ష్మణ తత్వమైతే మనల్ని నమ్మిన వారి కోసం తెగించమని చెప్పేది ఆంజనేయ తత్వమని పేర్కొన్నారు. జీవితంలో ఏం చేయాలో చెప్పింది రామాయణమని, ఏం చేయకూడదో చెప్పింది మహాభారతమని, ఎలా జీవించాలో చెప్పింది భగవద్గీత అని అన్నారు. ప్రతి ఒక్కరూ తమకు దొరికిన కాస్త సమయంలో భగవద్గీత చదవాలని సూచించారు. భగవద్గీతతో మన బుద్ధి, ఆలోచన విధానం, జ్ఞానాన్ని పెంపొందించుకుంటామని, తద్వారా మన జీవన విధానం మారుతుందన్నారు.గీతలోని ఒక్కో శ్లోకం ఒక్కో జీవిత సత్యాన్ని మనకు పరిచయం చేస్తుందన్నారు.
ఆలయాల కోసం రూ. కోట్ల నిధులు
బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని ఉన్న ఆలయాలు పునర్నిర్మాణం, నూతన ఆలయాలు, ఆలయాల అభివృద్ధి కోసం రూ. కోట్ల నిధులను కేటాయించినట్లు తెలిపారు. బాన్సువాడ పట్టణ పరిధిలో నిర్మించ తలపెట్టిన హనుమాన్ దీక్షాస్వాముల సన్నిధానం కోసం సీఎం కేటాయించిన స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి రూ. 25 లక్షలు మంజూరుచేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి, సుదర్శన దండి కాశీ స్వామీజీ, తపస్వీ బాలయోగి పిట్ల మహరాజ్, చేర్యాల స్వామీజీ, మంగళగిరి నరసింహ మూర్తి, బాన్సువాడ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, జ్ఞాన సరస్వతీ ఆలయ ధర్మకర్త పరిగె శంభురెడ్డి, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, విండో చైర్మన్ ఎర్వాల కృష్ణారెడ్డి, హనుమాన్ వ్యాయామశాల అధ్యక్షుడు గురువినయ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పాత బాలకృష్ణ, కౌన్సిలర్లు గదుమల లింగమేశ్వర్, దోన్కంటి వెంకటేశ్, హనుమాన్ ఆలయ కమిటీ కార్యదర్శి వెంకట్ రెడ్డి, హనుమాన్ దీక్షా స్వాములు పాల్గొన్నారు.