నిజామాబాద్ రూరల్, డిసెంబర్ 3 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసేందుకు ప్రాధాన్యమిస్తున్నది. ఈ నేపథ్యంలో గుండారం గ్రామశివారులో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణ స్థలాన్ని నిజామాబాద్కు చెందిన ఓ వ్యక్తి కబ్జాకు పాల్పడినా పట్టించుకునే నాథుడే కరువయ్యారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుండారం గ్రామానికి వెళ్లే మార్గంలో కమాన్ సమీపంలో ఎడమ వైపున ఒక ఎకరం ప్రభుత్వ భూమిని ఆరునెలల క్రితం అప్పటి తహసీల్దార్ ప్రశాంత్కుమార్ పరిశీలించి.. క్రీడా ప్రాంగణం కోసం కేటాయించారు. ఈ భూమిలో పెరిగిన ముళ్ల చెట్లు, పొదలు, ఎత్తు పల్లాలను గ్రామపంచాయతీ సిబ్బంది ట్రాక్టర్ బ్లేడ్ సహాయంతో చదును చేయించారు.
ఈ ఏడాది జూన్ 20వ తేదీన స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి క్రీడా ప్రాంగణం ఏర్పాటుకు భూమిపూజ చేశారు. ఇదిలా ఉండగా నిజామాబాద్ నగరానికి చెందిన ఓ బడాబాబు క్రీడా ప్రాంగణాన్ని కబ్జా చేసినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. క్రీడా ప్రాంగణానికి కేటాయించిన స్థలం ఒక ఎకరం ఉండగా.. దానికి అనుకొని ఉన్న మరో ఎకరం ప్రభుత్వ భూమిని కూడా కబ్జా చేసి మొత్తం 2 ఎకరాల చుట్టూ సిమెంట్ పలకలతో ప్రహరీని నిర్మించారు. పంచాయతీ కార్యదర్శి సుధాకర్రెడ్డి, పాలకవర్గసభ్యులు క్రీడా ప్రాంగణం చుట్టూ కబ్జాదారుడు ప్రహరీ నిర్మించిన సమయంలో అడ్డుకున్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. కబ్జాకు గురైన క్రీడా ప్రాంగణం భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని, క్రీడా ప్రాంగణానికి మాత్రమే ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు విన్నవించనున్నట్లు సర్పంచ్ లక్ష్మణ్రావు, ఉపసర్పంచ్ శంకర్రెడ్డి, గ్రామపెద్దలు విలేకరులతో శనివారం తెలిపారు.