కోటగిరి, సెప్టెంబర్ 29: మూడు నెలలుగా బకాయి పడిన వేతనాలు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని పంచాయతీ కార్మికులు(Grama Panchayati Workers) డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఎదుట పారిశుద్ధ్య కార్మికులు, పంచాయతీ కార్మికులు నిరసన తెలుపుతూ ధర్నాకు దిగారు. బకాయిలు చెల్లిస్తేనే విధులు చేపడతామని హెచ్చరించారు. జీతాలు ఇవ్వకపోతే ఎలా బతికేదని ప్రశ్నించారు. దసరా పండుగ ఉన్నప్పటికీ జీతం చెల్లించకుంటే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మూడు నెలల నుంచి జీతాలు ఇవ్వకుంటే ఏం తినాలి? ఎలా బతకాలి? అని కార్మికులు ప్రశ్నించారు. జీతాలివ్వాలని అధికారులను అడిగితే రేపు, మాపు అంటూ కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. నెలలతరబడి జీవితాలు ఇవ్వకుంటే ఎలా? అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్లో ఉన్న మూడు నెలల జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. లేనట్లయితే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హనుమండ్లు, పోశెట్టి, సాయిలు, బ్రహ్మం, లింగం, లింగవ్వ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.