‘పులి రాజాకు ఎయిడ్స్ వస్తుందా?’.. ఒకప్పుడు ఊరూవాడా హోరెత్తిన ప్రచారమిది. ఉత్కంఠను రేకెత్తించడమే కాకుండా ఉపద్రవంలా మారిన ఎయిడ్స్పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఈ వైవిధ్య ప్రకటన దోహదపడింది. శారీరకంగా దృఢంగా ఉన్నప్పటికీ.. విచ్చలవిడితనం, పట్టింపులేనితనం మూలంగా ప్రాణాంతక హెచ్ఐవీ మహమ్మారి కోరల్లో చిక్కుకుని విలవిల్లాడడమే.. ‘పులిరాజాకు ఎయిడ్స్ వస్తుందా?’ అనే ప్రకటనలోని సారాంశం. దశాబ్దమున్నర క్రితం వరకు హెచ్ఐవీ వైరస్ ప్రజానీకాన్ని వణికించింది. పల్లె, పట్టణం తేడాలేకుండా ఒకప్పుడు ఊరూరా వ్యాప్తిచెందిన మహమ్మారి.. జనచేతనతో ఇప్పుడు క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. ఎయిడ్స్ వ్యాధి నియంత్రణపై ప్రపంచవ్యాప్తంగా ఉద్యమంలా జరిగిన పోరాటంతో సంక్రమణ రేటు అదుపులోకి వచ్చింది. డబుల్ డిజిట్ నుంచి అర శాతానికి పాజిటివిటీ రేటు పడిపోయింది. గత ఏడునెలల కాలంలో నిజామాబాద్ జిల్లాలో 42,491మందికి ఎయిడ్స్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 220మందికి పాజిటివ్గా తేలింది. కామారెడ్డి జిల్లాలో 24,534మందికి పరీక్షలు జరుపగా, 136మందికి హెచ్ఐవీ నిర్ధారణ అయ్యింది. అధునాతన వైద్యవిధానాల సాయంతో ఉమ్మడి జిల్లాలో 21మంది చిన్నారులను.. ఎయిడ్స్ బాధిత తల్లుల నుంచి వ్యాధి సోకకుండా ఆరోగ్యసిబ్బంది కాపాడగలిగారు.
నిజామాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి):పులిరాజాకు ఎయిడ్స్ వస్తుందా…? 2003లో వెలుగు చూసిన సంచలనాత్మకమైన ప్రచార పర్వం ఇది. పులి రాజా పేరిట విడుదల చేసిన ఓ చిన్న ప్రకటన ఎయిడ్స్ వ్యాధి నివారణకు ఓ మార్గమైంది. శారీరకంగా దృఢమైనప్పటికీ విచ్చలవిడితనం, పట్టింపులేనితనం మూలంగా జరిగే శృంగార కార్యకలాపాలతో ప్రాణాంతకమైన మహమ్మారి కోరల్లో చిక్కుకొని విలవిల్లాడడమే పులి రాజాకు ఎయిడ్స్ వస్తుందా? అన్న ప్రకటనలోని సారాంశం. ప్రజల్లో విస్తృతమైన ప్రచారానికి వినూత్నమైన ప్రకటన కాసింత దోహదం చేసింది. సరిగ్గా దశాబ్దన్నర క్రితం ప్రపంచాన్ని హెచ్ఐవీ వణికించింది. ప్రజల్లో అవగాహనలేమితో ఎయిడ్స్ వ్యాధి విపరీతంగా వ్యాప్తి చెందింది. గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా పాకిపోయిన కేసుల పరంపర ప్రస్తుతం క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. ఎయిడ్స్ వ్యాధి నియంత్రణపై ప్రపంచవ్యాప్తంగా ఉద్యమంలా జరిగిన పోరాటంతో సంక్రమణ రేటు అదుపులోకి వచ్చింది. డబుల్ డిజిట్ పాజిటివ్ రేటు నుంచి అర శాతానికి పడిపోయింది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో 2021 ఏప్రిల్ నుంచి అక్టోబర్ నెలాఖరు వరకు నిర్వహించిన ఎయిడ్స్ నిర్ధారణ పరీక్షల్లో నిజామాబాద్లో 0.05శాతం, కామారెడ్డిలో 0.37శాతంగా తేలింది. నేడు ప్రపంచ ఎయిడ్స్ దినం సందర్భంగా ఉమ్మడి జిల్లాలో హెచ్ఐవీ – ఎయిడ్స్ పరిస్థితులపై కథనం.
ఎయిడ్స్ వ్యాధి పెరుగుదల రేటు 0.05శాతం..
ఒకరి కన్నా ఎక్కువ మందితో సంభోగంలో పాల్గొనడంతో హెచ్ఐవీ సోకుతుంది. రక్త మార్పిడి, తల్లిపాల ద్వారా బిడ్డకు, కలుషిత సిరంజీలతో ఎయిడ్స్ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. మొదట ఈ వ్యాధిని ప్రాణాంతకమైనదిగా పరిగణించేవారు. కానీ శక్తివంతమైన ఏఆర్టీ మందులు, ఎయిడ్స్ వల్ల వచ్చే రుగ్మతలను నయం చేసే మందులు లభ్యమవుతుండడంతో ఊరట లభిస్తున్నది. మధుమేహం, రక్తపోటు లాంటి వ్యాధుల మాదిరిగానే ఎయిడ్స్ కూడా దీర్ఘకాలికంగా నియంత్రించడానికి వీలు కలిగే వ్యాధిగా వ్యవహరిస్తున్నారు. ఇది హెచ్ఐవీ(హ్యూమన్ ఇమ్యునో డెఫిసియెన్సీ వైరస్)వల్ల వస్తుంది. ఎయిడ్స్ను ఎక్వైర్డ్ ఇమ్యునో డెఫిసియెన్సీ సిండ్రోమ్గా పరిగణిస్తుంటారు. హెచ్ఐవీ ఉన్న వారందరికీ ఎయిడ్స్ ఉన్నట్లు కాదు. శరీరం లోపల హెచ్ఐవీ ఉన్నా కూడా కొన్ని సంవత్సరాల పాటు ఆరోగ్యంగానే కనిపిస్తారు. ఎప్పుడైతే ఆరోగ్యం క్షీణిస్తుందో అప్పుడు వారికి ఎయిడ్స్ వచ్చినట్లుగా పరిగణిస్తారు. ఒక వ్యక్తి శరీరంలో హెచ్ఐవీ ఉంటే అతనిని హెచ్ఐవీ పాజిటివ్ అని సంబోధిస్తారు. నిజామాబాద్ జిల్లాలో ఏప్రిల్ 2021 నుంచి అక్టోబర్ నెలాఖరు వరకు 42,491 మందికి హెచ్ఐవీ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఇందులో 220 మందికి పాజిటివ్ వచ్చింది. మొత్తం పరీక్షల్లో ఎయిడ్స్ నిర్ధారణ అయిన వారి శాతం 0.05గా ఉంది. కామారెడ్డి జిల్లాలో 24,534 మందికి హెచ్ఐవీ టెస్టులు చేయగా 136 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. పరీక్షలు నిర్వహించిన మొత్తం మందిలో పాజిటివ్గా తేలినవారు 0.37శాతం ఉన్నారు.
బాధితులకు సర్కారు భరోసా..
ఎయిడ్స్తో బాధపడుతున్న వారికి మానవీయ కోణంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెలా పింఛన్ అందిస్తున్నది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులను ఆదుకుంటున్న ప్రభుత్వం తెలంగాణ ఒక్కటే. కేంద్రం నుంచి ఎలాంటి సహకారం లేకపోయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి నిధులను వెచ్చిస్తున్నది. ఎయిడ్స్ బాధితులకు ప్రస్తుతం నెలకు రూ.2వేల చొప్పున పింఛన్ అందిస్తున్నారు. ఎయిడ్స్తో బాధపడుతున్న వారిని సమాజం దూరం పెడుతూ వస్తున్నది. హెచ్ఐవీ ఉన్నట్లుగా తెలిసిన వ్యక్తిని సామాజికంగా బహిష్కరించినట్లు ప్రవర్తిస్తున్న దాఖలాలు అనేకం ఉన్నాయి. కన్నవారికి, కట్టుకున్నవారికి, ఇంటికి, గ్రామానికి దూరమైన వారందరినీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గరకు తీసుకుని ఆర్థిక సాయం అందిస్తున్నది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా సుమారుగా 4వేల మంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు రూ.2016 పింఛన్ వస్తుండగా, నెలకు రూ.26లక్షలు ప్రభుత్వం మంజూరు చేస్తున్నది. కామారెడ్డి జిల్లాలో 2194 మందికి రూ.23.47లక్షలు పంపిణీ చేస్తున్నారు.
22 మంది చిన్నారులకు ఊపిరి..
సాధారణంగా ఎయిడ్స్ వ్యాధి తల్లిగర్భం నుంచి బిడ్డలకు త్వరగా సోకుతుంది. ఇలాంటి ఘటనలో అప్పుడే పుట్టిన అభం శుభం తెలియని పిల్లలకు సురక్షితమైన జీవితాన్ని అందించేందుకు వైద్యాధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. తల్లిదండ్రుల అవగాహన లేమితో జరిగిన నష్టాన్ని నివారించేందుకు అధునాతన వైద్య విధానాన్ని అవలంబిస్తున్నారు. హెచ్ఐవీ సోకిన తల్లికి నిరోధక శక్తిని పెంపొందించేలా, కడుపులోని బిడ్డకు వైరస్ అంతగా ప్రభావం చూపకుండా నివారిస్తున్నారు. ప్రసవ అనంతర కాలంలోనూ శిశువును రెండేండ్ల పాటు కంటికి రెప్పలా చూసుకుంటూ ఎయిడ్స్ మహమ్మారి నుంచి దూరం చేస్తున్నారు. ఇలా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఎయిడ్స్ సోకిన తల్లి నుంచి శిశువుకు హెచ్ఐవీ ద్వారా నష్టం వాటిల్లకుండా రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తున్నది. నిజామాబాద్ జిల్లాలో 13 మంది పిల్లలు, కామారెడ్డి జిల్లాలో 9 మంది పిల్లలకు ఈ రకమైన వైద్యంతో నిండు జీవితాలను కాపాడారు. తల్లి నుంచి బిడ్డలకు ఎయిడ్స్ వ్యాధి సోకకుండా కాపాడుతున్న కేటగిరీలో నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలో మూడోస్థానంలో నిలిచింది.
భారీగా తగ్గుముఖం..
ఎయిడ్స్ సంక్రమణ కేసులు గతంతో పో లిస్తే భారీగా తగ్గుముఖం పట్టాయి. నిజామాబాద్ జిల్లాలో ప్రస్తుతం 0.05శాతం మాత్రమే వ్యాప్తిరేటు కనిపిస్తున్నది. మహమ్మారి బారినపడిన వారికి కొత్త జీవితాన్ని అందిస్తున్నాం. ప్రభుత్వం తరఫున ఉచితంగా వైద్యం చేస్తున్నాం. తల్లి నుంచి బిడ్డకు ఎయిడ్స్ వ్యాధి సంక్రమించకుండా కృషి చేస్తున్నాం.