భీమ్గల్, ఆగస్టు 11 : నిజామాబాద్ జిల్లాలోని భీమ్గల్ స్వాతంత్య్ర సమరయోధుల ఇలాకాగా ప్రఖ్యాతి గాంచింది. ఒకప్పుడిది తాలుకా. అప్పట్లో ఈ తాలూకా పరిధిలో భీమ్గల్, కమ్మర్పల్లి, వేల్పూర్, సిరికొండ, మోర్తాడ్ మండలాల్లో ఉన్న అప్పటి 99 గ్రామాలకు భీమ్గల్ పట్టణం ప్రధాన కేంద్రంగా భాసిల్లేది. అనంతరం మండలాల ఏర్పాటుతో భీమ్గల్ తాలుకాను ఆర్మూర్ మండలంలో విలీనం చేశారు. తాలూకాల పిమ్మట అప్పటి ప్రభుత్వం మండల వ్యవస్థను తీసుకురావడంతో భీమ్గల్ మండల కేంద్రంగా కొనసాగింది. ప్రస్తుతం భీమ్గల్ మున్సిపాలిటీగా రూపాంతరం చెందింది. 1857లో సిపాయిల తిరుగుబాటు కాలం నుంచే స్వేచ్ఛా భారతావని కోసం ఊపిరులూదిన గడ్డగా మోర్తాడ్ను చెప్పుకోవచ్చును. రాజారుక్మారెడ్డి మొదలుకొని చౌట్పల్లి హన్మంత్రెడ్డి వరకు 12మంది స్వాతంత్య్ర సమరయోధులుగా గుర్తించబడ్డారు. అప్పటి భారత ప్రభుత్వం వీరి సేవలను గుర్తించి తామ్ర పత్రాలను ఇచ్చి ఘనంగా సత్కరించింది.
భారత స్వాతంత్ర ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొని అమరులైన వారి పేర్లతో కూడిన నల్లరాతి శిలాఫలకాన్ని మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేశారు. భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించి 25సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వేడుకలను నిర్వహించి భీమ్గల్ పంచాయతీ సమితి పరిధిలోని 12 మంది సమరయోధుల పేర్లతో కూడిన నిలువెత్తు స్మారక చిహ్ననాన్ని 1973 ఆగస్టు 14న ఏర్పాటు చేశారు.
ఈ శిలాఫలకం ఇరువైపులా అందంగా చెక్కబడి ఉంది. ఒకపైపు స్వాతంత్య్ర సమరయోధుల పేర్లు మరోవైపు 1949 నవంబర్ 10వ తేదీన భారత సంవిధానం చెక్కబడింది.
కేవీ శర్మ.. భీమ్గల్ పట్టణంలో బ్రాహ్మణ వీధికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు. వృత్తి పౌరోహిత్యం. అప్పటి దేశనాయకుల పిలుపునందుకొని స్వాతంత్ర సంగ్రామంలో వీరోచితంగా పోరాడిన యోధుడు. 1946లో కొందరిని రాజకీయ ఖైదీలుగా నిజామాబాద్ జిల్లా జైల్లో బంధించారు. అప్పట్లో వీరు ఎనిమిది నెలల పాటు జైలు శిక్ష అనుభవించారు. తదనంతరం కేవీ శర్మకు 1972లో భారత ప్రభుత్వం తామ్ర పత్రంతో ఘనంగా సత్కరించింది.
మండలంలోని సికింద్రాపూర్ గ్రామానికి చెందిన స్వర్ణకారుడు అవుసుల నర్సయ్య వృత్తిరీత్యా స్వర్ణకారుడు. భారత స్వాతంత్య్ర సంగ్రామంలొ దేశనాయకుల పిలుపునందుకొని ఉద్యమంలో పాల్గొన్నారు.