ఎక్కువ ఉద్యోగాలు సాధించి బాన్సువాడ నియోజకవర్గానికి పేరు తేవాలి
ఒంట్లో శక్తి ఉన్నంత కాలం రాజకీయాల్లో ఉంటా
స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి
అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ
పోటీ పరీక్షలు ముగిసే వరకూ ఉద్యోగార్థులు సన్నద్ధతపైనే దృష్టి సారించాలని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. మిగతా పనులన్నీ పక్కన పెట్టి బాగా చదవాలన్నారు. ఉద్యోగార్థులకు సోమవారం బాన్సువాడలో పీబీఆర్ స్టడీ మెటీరియల్ను ఆయన పంపిణీ చేశారు. ఒంట్లో శక్తి ఉన్నంత కాలం రాజకీయాల్లో ఉంటానని, పేదల అభివృద్ధి, సంక్షేమమే తన లక్ష్యమన్నారు.
బీర్కూర్, జూలై 4: ఉద్యోగార్థులు పోటీ పరీక్షలు ముగిసే వరకూ ప్రిపరేషన్పైనే దృష్టిసారించాలని స్పీకర్ పోచా రం శ్రీనివాసరెడ్డి సూచించారు. బాన్సువాడ పట్టణంలోని భారత్ గార్డెన్లో పీబీఆర్ కోచింగ్ సెంటర్లో శిక్షణ పొందిన అభ్యర్థులకు సోమవారం స్టడీ మెటీరియల్ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. రైతులకు మంచి విత్తనం అందిస్తే పొలంలో వేసి పంటలను బాగా ఎలా పండిస్తారో అదేమాదిరిగా ఉద్యోగార్థులకు పీబీఆర్ కోచింగ్ కేంద్రం ద్వారా మెరుగైన శిక్షణ అందించడమే తమ పని అని అన్నారు. బాగా చదివి ఉద్యోగాలను సాధించడం అభ్యర్థుల పని అని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని నిరుద్యోగ యువత కోసం కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసిన తన కుమారుడు, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డిని అభినందించారు. కొంతమంది కోచింగ్ సెంటర్లను లాభాల కోసం ఏర్పాటు చేస్తారని, కానీ భాస్కర్రెడ్డి సేవా భావంతో సొంత ఖర్చుతో శిక్షణ తరగతులతోపాటు భోజనం సౌకర్యం ఏర్పాటు చేశారని అన్నారు.
70 రోజులుగా తీసుకున్న కోచింగ్, అది ఉద్యోగార్థుల జీవితానికి మలు పు కావాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో 4.50 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారని తెలిపారు. తెలంగాణ ప్రభు త్వం వచ్చాక లక్షా 36వేల ఉద్యోగాలను భర్తీ చేసిందని చెప్పా రు. ఈ ఏడాది 91 వేల 106 ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉండగా ఇందులో 11 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసినట్లు తెలిపారు. మిగితా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ప్రభుత్వం జారీ చేసిందన్నారు. కొత్త ఉద్యోగాల భర్తీతో ప్రభుత్వంపై రూ.7 వేల కోట్ల భారం పడుతుందన్నారు. విద్యార్థులు బాగా చదువుకొని తమ కాళ్లపై తాము నిలబడి సమాజానికి ఉపయోగపడేవిధంగా తయారుకావాలని సూచించారు. విద్యార్థులు ఆత్మ విశ్వాసంతో కష్టపడితే లక్ష్యాన్ని చేరుకోవచ్చన్నారు. బాన్సువాడ పేరును రాష్ట్రంలో నం బర్ వన్ స్థానానికి తీసుకెళ్లాలని కోరారు. మనం చేసే మంచి పనులే మనకు పేరును సంపాదించి పెడతాయన్నారు. తన ఒంట్లో శక్తి ఉన్నంతకాలం రాజకీయాల్లో ఉంటానన్నారు. కోచింగ్ పొందినవారందరూ ఉద్యోగాలు పొంది మంచి స్థానాల్లో ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
కోచింగ్ సెంటర్ ఏర్పాటుపై ఐదేండ్ల క్రితం నిర్ణయం తీసుకున్నాం: డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి
డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి మాట్లాడుతూ.. బాన్సువాడ నియోజకవర్గంలో నిరుద్యోగుల కోసం ఉచిత కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఐదేండ్ల క్రితం నిర్ణయం తీసుకొని అమలు చేశామని అన్నారు. ఈ కార్యక్రమానికి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి స్ఫూర్తి అని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ఉద్యోగార్థులందరూ ఉద్యోగాలు సంపాదించాలన్నదే సభాపతి ఆశయమన్నారు. గతంలో పీబీఆర్ కోచింగ్ కేంద్రంలో 1000 మంది శిక్షణ పొందితే 110 మంది ఉద్యోగం సాధించారని తెలిపారు. అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీలతో క్లాసులు చెప్పించామన్నారు. గ్రాండ్ టెస్టుకు అందరూ హాజరు కావాలని, కోచింగ్ సెంటర్ నిర్వహణకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ మాట్లాడుతూ.. కోచింగ్ అంటే లక్షల ఖర్చుతో కూడుకున్నదని, కానీ డీసీసీబీ చైర్మన్ భాస్కర్రెడ్డి నిరుద్యోగ యువతకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడే కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేశారని అన్నారు. ఎస్పీ శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. స్టడీ మెటీరియల్ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. నిజామాబాద్ సీపీ నాగరాజు మాట్లాడుతూ అభ్యర్థుల కోసం ఉచితంగా కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసిన పోచారం భాస్కర్రెడ్డికి అభినందనలను తెలిపారు. అంతకుముందు బాన్సువాడ పట్టణానికి చెందిన గౌసియా అనే విద్యార్థిని పాడిన పాటకు సభాపతి కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం కోచింగ్ నిర్వహణకు సహకరించిన జగదీశ్వర్రెడ్డి, బాన్సువాడ, రుద్రూర్ గ్రామాల్లో కోచింగ్ సెంటర్ నిర్వహణకు కృషి చేసిన పత్తి రాము, ప్రశాంత్, ప్రవీణ్ను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పీజేఆర్ కోచింగ్ నిర్వాహకులు జగదీశ్వర్రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ జంగం గంగాధర్, ఆర్డీవో రాజాగౌడ్, ఆత్మ కమిటీ చైర్మన్ మోహన్ నాయక్, సొసైటీ చైర్మన్లు ఎర్వాల కృష్ణారెడ్డి, పిట్ల శ్రీధర్, పెర్క శ్రీనివాస్, జిల్లా కో -ఆప్షన్ మెంబర్ మాజీద్, ఎంపీపీలు తిలకేశ్వరి రఘు, పాల్ద్య విఠల్, సుజాత, జడ్పీటీసీ నారోజీ గంగారాం, నాయకులు గోపాల్రెడ్డి, దొడ్ల వెంకట్రాంరెడ్డి, లాడేగాం వీరేశం, ఎజాజ్, గురువినయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.