ఖలీల్వాడి/ బాల్కొండ/ కామారెడ్డి, సెప్టెంబర్ 2 : రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు ఉమ్మడి జిల్లా నుంచి నలుగురు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. అవార్డుకు ఎంపికైన వారిలో నిజామాబాద్ నుంచి కాసర్ల నరేశ్, వేల్పూర్ శ్రీనివాస్, కామారెడ్డి నుంచి పాపయ్య గారి గోవర్ధన్ రెడ్డి, తమ్మల రాజు ఉన్నారు. వీరు ఈ నెల 5న రవీంద్రభారతిలో నిర్వహించనున్న ఉపాధ్యాయ దినోత్సవంలో పురస్కారాలను అందుకోనున్నారు. రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికైన వీరిని తోటి ఉపాధ్యాయులు, సిబ్బంది అభినందించారు.
సాహిత్యరంగంలో విద్యార్థులను తీర్చిదిద్దుతున్న కాసర్ల ..
సిరికొండ మండలం గడ్కోల్ గ్రామానికి చెందిన కాసర్ల నరేశ్ ప్రస్తుతం గుండారం ఉన్నత పాఠశాలలో ఎనిమిదేండ్లుగా తెలుగు ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు.బాన్సువాడ మండలం బుడ్మిలో ఉద్యోగ ప్రస్థానం మొదలైంది. డిచ్పల్లి మండలం సుద్దులంలో పదేండ్లు పనిచేశారు. కవి, రచయితగా పది పుస్తకాలు రాశారు. ఆయన రాయడమే కాకుండా వందలాది పద్యాలను విద్యార్థులకు నేర్పించారు.వారితో అనేక ప్రదర్శనలు ఇప్పించారు.కవితలు రాసే విద్యార్థులను ప్రోత్సహించి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించేలా చేశారు. కాసర్ల నరేశ్ జాతీయ పురస్కారాలు సైతం అందుకున్నారు. కరోనా కాలంలో ఆయన రచించిన కట్టడి పుస్తకాన్ని అప్పటి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతులమీదుగా ఆవిష్కరించి ప్రశంసలు అందుకున్నారు. ఆయన ఏ పాఠశాలకు వెళ్లినా బడిని తెలుగు భాషా సాహిత్య కేంద్రంగా మార్చడం ఆయనకే సాధ్యం.
పాఠ్యపుస్తక రచయితగా, వ్యాఖ్యాతగా.. వేల్పూర్ శ్రీనివాస్
బాల్కొండ జడ్పీహెచ్ఎస్లో సాం ఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా వేల్పూర్ శ్రీనివాస్ ఐదేండ్లుగా విధు లు నిర్వర్తిస్తున్నారు. పదో తరగతి, ఓపెన్ ఇంటర్ పాఠ్యపుస్తక రచయితగా, ఎస్సీఈఆర్టీ మాడ్యుల్స్ రచయితగా సేవలు అందించారు. ఎస్ఆర్పీగా, డీఆర్పీగా అధికారిక, అనధికారిక ఎన్నో కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా పనిచేశారు. శ్రీనివాస్ సేవలను గుర్తించిన ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక చేసింది.
కామారెడ్డి నుంచి..
కామారెడ్డి జిల్లా నుంచి ఇద్దరు ఉపాధ్యాయులు అవార్డుకు ఎంపికైనట్లు డీఈవో రాజు తెలిపారు. రామారెడ్డి మండలం ఉప్పల్వాయి జడ్పీహెచ్ఎస్లో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు పాపయ్య గారి గోవర్ధన్ రెడ్డి, బీబీపేట్ మండలం తుజాల్పూర్ జడ్పీహెచ్ఎస్కు చెందిన స్కూల్ అసిస్టెంట్ తమ్మల రాజు ఎంపికైనట్లు పేర్కొన్నారు.