ఖలీల్వాడి నవంబర్ 28 : తెలంగాణలో ఎక్కడ చూసినా కాంగ్రెస్ కండకావరమే కనిపిస్తున్నది. అక్రమ అరెస్టులు, లాఠీచార్జీలు, నిర్బంధాలు, కూల్చివేతలు, పేల్చివేతలు. ఇందిరమ్మ రాజ్యమంటే ఇదేనా? అని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి ప్రశ్నించారు. ఇది ప్రజా పాలన కాదు, రాక్షస పాలన అని మండిపడ్డారు. నిజామాబాద్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ హయాంలో తెలంగాణ భూములు పాడిపంటలతో విలసిల్లితే, రేవంత్రెడ్డి వచ్చాక అగ్నిమంటలతో కాలిపోతూ కనిపిస్తున్నాయన్నారు.
రేవంత్రెడ్డి ఏ ముహూర్తంలో వచ్చాడో కానీ, ఆయన పాదం తెలంగాణకు ప్రమాదకరంగా మారిందన్నారు. సీఎం సోదరులది అంతులేని అవినీతి, చిట్టినాయుడు దుర్నీతికి తెలంగాణ ఆహుతి అవుతున్నదని తెలిపారు. రేవంత్ సోదరులు భూకబ్జాకోరులు. వారికి అధికారులు వంత పడుతున్నారని మండిపడ్డారు. పల్లెల్లో అధికారుల దురహంకారం పెరుగుతుండంతో రైతులు, ప్రజలు తిరగబడుతున్నారన్నారు. మొన్న లగచర్ల, నిన్న దిలావర్పూర్.. ఏ గ్రామంలో అయినా కాంగ్రెస్ సర్కారుపై ప్రజల సంగ్రామమే కనిపిస్తున్నదన్నారు.
అప్పట్లో నీరో చక్రవర్తి రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేల్ వాయించినట్లు, ఇప్పుడు సీఎం రేవంత్ ఢిల్లీలో ఫిడేల్ వాయిస్తూ తెలంగాణను తగలబెడుతుండని ఎద్దేవా చేశారు. రేవంత్రెడ్డి మూసీ ప్రక్షాళన పేరుతో రూ.లక్షన్నర కోట్ల అవినీతికి సిద్ధపడుతున్నాడని జీవన్రెడ్డి ఆరోపించారు. ఇదేమని ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నాయకులపై దాడులు చేయిస్తున్నారని తెలిపారు. తనతో పాటు నిజామాబాద్ నగరమేయర్ భర్తపై అక్రమంగా కేసులు పెడుతున్నారని, 11 నెలల్లో 1200లకు పైగా కేసులు పెట్టారని తెలిపారు.
తాము అధికారంలో ఉన్న పదేండ్లలో ఇన్ని కేసులు పెడితే కాంగ్రెస్ బతికి బట్టకట్టేదా? అని ప్రశ్నించారు. అధికారులు అతి చేస్తున్నారని, వారి పేర్లు పింక్ బుక్లో ఎక్కిస్తున్నామని చెప్పారు. వచ్చేది తమ ప్రభుత్వమేనని, తప్పు చేసిన వారు ఎక్కడున్నా పట్టుకుని వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. దీక్షా దివస్ స్ఫూర్తితో రేవంత్ సర్కారుపై సమరభేరి మోగిస్తామని చెప్పారు. శుక్రవారం నిర్వహించనున్న దీక్షాదివస్కు పార్టీ శ్రేణులు పెద్దసంఖ్యలో తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. జడ్పీ మాజీ చైర్మన్ విఠల్రావు, బీఆర్ఎస్ పార్టీ బోధన్ నియోజకవర్గ ఇన్చార్జి ఆయేషా ఫాతిమా, నేతలు రాంకిషన్రావు, సుజీత్సింగ్ ఠాకూర్, ప్రభాకర్, సత్యప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
సీఎంగా పాలనలో విఫలమైన రేవంత్.. అరాచకాల్లో సఫలమవుతున్నారని ఎద్దేవా చేశారు. హోంశాఖను దగ్గర పెట్టుకుని శాంతిభద్రతలను సర్వనాశనం చేశారని మండిపడ్డారు. గురుకులాల్లో మరణ మృదంగం మోగుతున్నదని, 11 నెలల్లో 48 మంది విద్యార్థులు మృత్యువాతపడితే పట్టించుకోలేదని తెలిపారు. శైలజ అనే విద్యార్ధి చనిపోతే ఆ గ్రామానికి ఎవరూ వెళ్లకుండా నిర్బంధం చేశారన్నారు. కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్కరైనా సంతోషంగా ఉన్నారా? అని జీవన్రెడ్డి ప్రశ్నించారు. ఆటోడ్రైవర్ నుంచి అంగన్వాడీల వరకూ, ఉద్యోగుల నుంచి నిరుద్యోగుల వరకూ ఎవరూ సంతోషంగా లేరని తెలిపారు. పోలీసులు, లాయర్లు సైతం రోడ్లపైకి వస్తున్నారన్నారు. బాసర నుంచి మొదలు కీసర దాకా అందరు దేవుళ్లకు శఠగోపం పెట్టిన ఘనుడు రేవంత్రెడ్డి అని విమర్శించారు.
నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ అవినీతికి అంతే లేకుండా పోయిందని, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ బంధుగణం అవినీతికి జిల్లా బలవుతున్నదని తెలిపారు. ఆ పార్టీ నాయకులు ఈరవత్రి అనిల్ ఇసుక దందాలో, సుదర్శన్రెడ్డి అనేక జిల్లాల్లో లిక్కర్ వ్యాపారంలో మునిగి తేలుతున్నారన్నారు. ఆర్మూర్లో కాంగ్రెస్ నాయకుడు వినయ్రెడ్డి అవినీతికి పాల్పడుతూ ప్రజలను దోచుకుంటున్నారని తెలిపారు.