జిల్లాలో శివరాత్రి పర్వదినం రోజున తీవ్ర విషాదం నెలకొన్నది. శుక్రవారం జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు మృత్యువాతపడ్డారు. ఎస్సారెస్పీ లక్ష్మీకాలువలో నీట మునిగి ముగ్గురు యువకులు మృతిచెందగా.. రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకులు దుర్మరణం చెందారు. ఈ రెండు ఘటనలు మెండోరా, వేల్పూర్ మండలాల్లో చోటుచేసుకున్నాయి.
వేల్పూర్/మోర్తాడ్, మార్చి 8 : డయాలసిస్ చేయించుకోవడానికి దవాఖానకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకులు మృతి చెందా రు. ఈ ఘటన వేల్పూర్ మండలం అంక్సాపూర్ గ్రామ శివారులో శుక్రవారం ఉదయం చోటుచేసుకున్నది. మోర్తాడ్ మండలం దొన్కల్ గ్రామానికి చెందిన మాడవేడి రవీందర్(55)కు రెండు కిడ్నీలు చెడిపోయాయి. దీంతో వారంలో మూడు రోజులు జిల్లా ప్రభుత్వ దవాఖానకు వెళ్లి డయాలసిస్ చేయించుకుంటున్నాడు. ఈ క్రమంలో తన కొడుకు మాడవేడి శివరాజ్(24)తో కలిసి శుక్రవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో నిజామాబాద్ జిల్లా కేం ద్రానికి బైక్పై బయల్దేరారు. మార్గమధ్యంలో వేల్పూర్ మండలం అంక్సాపూర్ శివారులో ఆగి ఉన్న లారీని వీరి బైక్ ఢీకొట్టింది. దీంతో తండ్రీకొడుకులిద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఆర్మూర్ రూరల్ సీఐ శ్రీధర్రెడ్డి, వేల్పూర్ ఎస్సై వినయ్ ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వినయ్ తెలిపారు.
ఉదయం పూట వెళ్తే డయాలసిస్ చేయించుకొని ఇంటికి త్వరగా రావొచ్చని భావించి తండ్రీకొడుకులు తెల్లవారుజామున బయల్దేరారు. కొన్ని రోజుల నుంచి రవీందర్కు వచ్చిన జబ్బును నయం చేసుకోవడానికి కుటుంబ సభ్యులు దవాఖానల చుట్టూ తిరుగుతున్నారు. ఇంటి నుంచి బయల్దేరిన వారు వేల్పూర్ మండలంలోని అంక్సాపూర్ శివారుకు రాగానే రోడ్డుపై ఆగి ఉన్న లారీకి బైక్ ఢీకొట్టడంతో వీరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
మాడవేడి రవీందర్ గల్ఫ్లో కొంతకాలం కార్మికుడిగా పనిచేసి స్వగ్రామానికి వచ్చాడు. ఇక్కడ చేపలు పడుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రవీందర్ భార్య బీడీలు చుడుతూ కుటుంబానికి చేదోడుగా ఉంటున్నది. వీరికి ఇద్దరు కుమారులు ఉండగా, పెద్దకొడుకు శివరాజు బీటెక్ పూర్తి చేసి ఉద్యోగవేటలో ఉండగా.. చిన్న కొడుకు ఇంటర్ చదువుతున్నాడు. కొన్నిరోజులుగా రవి ఆరోగ్యం క్షీణించడంతో వారానికి ఒకసారి డయాలసిస్ చేయించుకోవాల్సి రావడంతో కుటుంబ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. శివరాత్రి పూట తండ్రీకొడుకుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ముప్కాల్/జక్రాన్పల్లి, మార్చి 8: ఎస్సారెస్పీ సందర్శనకు వెళ్లిన ముగ్గురు యువకులు లక్ష్మీ కాలువలో నీట మునిగి మృతిచెందారు. మృతిచెందిన యువకులు జక్రాన్పల్లి మండలం గన్యాతండాకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటన ముప్కాల్ పరిధిలోని లక్ష్మీ కాలువ హెడ్ రెగ్యులేటర్ వద్ద శుక్రవారం చోటుచేసుకున్నది. ఇందుకు సంబంధించిన వివరాలు.. జక్రాన్పల్లి మండలం గన్యాతండాకు చెందిన సలావత్ వంశీ, అజ్మీర్ సందీప్, భూక్యా భాస్కర్, లోకేశ్ (17), సాయినాథ్ (16), మున్నా (17) మొత్తం ఆరుగురు స్నేహితులు కారులో శుక్రవారం సెలవుదినం కావడంతో ఉదయం ఎస్సీరెస్పీ సందర్శనకు వెళ్లారు. ప్రాజెక్టు లక్ష్మీ కాలువ హెడ్ రెగ్యులేటర్ వద్ద స్నానం చేసేందుకు కాలువలోకి దిగారు. ఇందులో ముగ్గురు బయటికి రాగా.. మిగతా ముగ్గురు లోకేశ్, సాయినాథ్, మున్నా లోతు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో గల్లంతయ్యారు. దీంతో బయటికి వచ్చిన మిగతా ముగ్గురు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్న ముప్కాల్ పోలీసులు.. గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపు చర్యల్లో ఆర్మూర్ ఏసీపీ బస్వారెడ్డితోపాటు ఆర్మూర్ రూరల్ సీఐ శ్రీధర్రెడ్డి, ముప్కాల్, బాల్కొండ ఎస్సైలు భాస్కరాచారి, గోపి పాల్గొనగా.. సాయంత్రం ముగ్గురు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆర్మూర్ ప్రభుత్వ దవాఖానకు తరలించినట్లు ముప్కాల్ ఎస్సై భాస్కరాచారి తెలిపారు. కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
మృతిచెందిన వారిలో సాయినాథ్, మున్నా ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రాస్తున్నారు. లోకేశ్ హైదరాబాద్లో బీటెక్ సెకండియర్ చదువుతున్నాడు. ముగ్గురు యువకుల మృతితో గ్రామం లో విషాదఛాయలు అలుముకున్నాయి.