మెండోరా, డిసెంబర్ 18 : యాసంగి సాగు కోసం ఎస్సారెస్పీ నుంచి సోమవారం నీటి విడుదల ప్రారంభించారు. ఉదయం 11 గంటలకు ఎస్సారెస్పీ జల విద్యుదుత్పత్తి కేంద్రం నుంచి జెన్కో సీఈ రమేశ్, ప్రాజెక్టు ఎస్ఈ శ్రీనివాస్ కాకతీయ కాలువకు నీటి విడుదలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ఈ శ్రీనివాస్ మాట్లాడుతూ.. కాకతీయ కాలువకు వారబందీ ప్రకారం నీటి విడుదల కొనసాగుతుందని తెలిపారు. ఏడు తడులపాటు నీటి విడుదల చేస్తామన్నారు. కాకతీయ కాలువ ఆయకట్టు రైతులు నీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎస్సారెస్పీ పూర్తిస్థాయి నీటి మట్టం 1091.00 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 1088.60 అడుగుల (78.342 టీఎంసీలు) నీటి నిల్వ ఉందని పేర్కొన్నారు. గతేడాది కన్నా రిజర్వాయర్లో 12 టీఎంసీల నీటి నిల్వ తక్కువగా ఉందన్నారు. ఈ సీజన్లో యాసంగి పంటల కోసం హైదరాబాద్లోని శివం కమిటీ ఆధ్వర్యంలో నిర్ణయించిన మేరకు 60 టీఎంసీల నీటిని కేటాయించినట్లు వివరించారు.
కాకతీయ కాలువ ఎస్సారెస్పీ హెడ్ రెగ్యులేటర్ నుంచి 65 కిలోమీటర్లు (జోన్-1) ఏడు రోజుల పాటు 3,500 క్యూసెక్కులు, కరీంనగర్ (జోన్-2) వరకు మరో 8 రోజులపాటు 5,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తామని తెలిపారు. ఈ నీటి విడుదల వారబందీ ప్రకారం కొనసాగుతుందన్నారు. మిడ్ మానేరు ప్రాజెక్టుకు 5 టీఎంసీల నీటిని కేటాయించాలని కోరినట్లు తెలిపారు. మిషన్ భగీరథ తాగునీటి కోసం 6.5 టీఎంసీలు అవసరం ఉంటుందని పేర్కొన్నారు. ప్రాజెక్టు ఎగువన ఉన్న లిఫ్ట్లు, సరస్వతీ, లక్ష్మీ, వరద కాలువల ఆయకట్టు రైతులకు సరిపడా నీరు ఉన్నదని తెలిపారు. రైతులు ప్రతినీటి చుక్కను సద్వినియోగం చేసుకోవాలని, ప్రాజెక్టు అధికారులకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ మిస్బా, ఈఈ చక్రపాణి, కాంగ్రెస్ నాయకులు బురుకల కమలాకర్, అంగరి చంద్రశేఖర్, కె. రమేశ్, అజ్జు తదితరులు పాల్గొన్నారు.