సేవల రంగంగా పేరొందిన వైద్యం కొందరి వల్ల ఫక్తు వాణిజ్య రంగంగా మారుతున్నది. పుష్కలంగా డబ్బులుంటే చాలు లాభసాటి వ్యాపారంగా ఓ దవాఖానను ఏర్పాటు చేసి అందినకాడికి దండుకుంటున్నారు. వైద్యంపై ఎలాంటి అవగాహన లేకపోయినా మల్టీస్పెషాలిటీ దవాఖానలకు యజమానులుగా మారిపోతున్నారు. డాక్టర్ కోర్సు చేసినవారిని ఆసరాగా చేసుకొని ‘వైద్య’ వ్యాపారం చేస్తున్నారు. ప్రైవేట్ దవాఖానల్లో వైద్యుల అర్హత విషయం దేవుడెరుగు.. ఎప్పుడైన వైద్యం వికటించి ఎవరి ప్రాణాలమీదికైనా వస్తే చూసుకుందాంలే అన్నట్లుగా మారింది పరిస్థితి.
జిల్లాలో ధనార్జనే ధ్యేయంగా సాగుతున్న వైద్య వ్యాపారంలో ఎన్నో లోసుగులు, అక్రమాలు బహిర్గతమవుతున్నా.. సంబంధిత శాఖ ఉదాసీనం గా వ్యవహరించడం గమనార్హం. పర్యవేక్షించాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం విమర్శలకు దారి తీస్తున్నది. ఫిర్యాదులు అందినా ఆఫీస్ నుంచి కాలు బయట పెట్టకుండానే మమ అనిపించడం, మామూళ్ల మత్తులో మునిగి తేలడం రివాజుగా మారింది. దీంతో అక్రమార్కుల వైద్య దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతున్నది. వైద్యారోగ్య శాఖలో ఇంటి దొంగల తీరుతో ఆ శాఖకు మాయని మచ్చగా మిగుతోంది. ఇన్చార్జి అధికారి ఆగడాలు ఓ వైపు, మరోవైపు వరుస ఏసీబీ కేసులతో పరువు పోగొట్టుకున్న వైద్యారోగ్య శాఖ గుట్టు రోజుకో రూపంలో రట్టు అవుతోంది. కుప్పలు తెప్పలుగా వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ బృందాలు తనిఖీలు చేపట్టగా నిజామాబాద్ జిల్లాలో పలుచోట్ల గుర్తింపులేని దవాఖానలు వెలుగు చూడడం ఆ శాఖ పనితీరుకు అద్దం పడుతోంది.
వాస్తవానికి ఒక దవాఖానను ఏర్పాటు చేయాలంటే అదో ప్రహసనం. అనుమతుల విషయం పక్కన పెడితే ..అనుమతి లేకుండా ఏర్పాటయ్యే హాస్పిటల్స్కైనా నెలల సమయం పడుతుంది. ప్రారంభోత్సవాల అనంతరం దవాఖానలో రోగుల సందడి, ఓపీ(ఔట్ పేషెంట్), ఐపీ(ఇన్ పేషెంట్) రద్దీతోనైనా వైద్యారోగ్య శాఖకు సమాచారం టక్కున వెళ్తుంది. ఈ విషయం తెలిసిన వెంటనే రంగంలోకి దిగి గుర్తింపు లేని దవాఖానల భరతం పడితే ప్రజలకు మంచి జరుగుతుంది. కానీ అలాకాకుండా అలాంటి దవాఖాల అక్రమాలు,ఆగడాలను ఏడాది కాలంగా చూస్తూ.. అకస్మాత్తుగా గుర్తింపు లేని దవాఖానలను మూసేయడం వెనుకున్న రహస్యం ఏమిటో ఎవరికీ అర్థం కాని అంశం.
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ప్రైవేటు వైద్యరంగం వైద్యో నారాయణ హరి అన్న నానుడిని తిరగేసి.. కమీషన్ల వ్యవస్థను ప్రవేశ పెట్టి రోగులను ఆదా య వనరుగా మారుస్తున్నారు. రోగి అనారోగ్య పరిస్థితిని అంచనా వేసి ఇష్టానుసారంగా దోచుకుంటున్నారు. మల్టీ స్పెషాలిటీలు, కార్పొరేట్ వైద్యం పేరుతో రోగులకు చుక్కలు చూపిస్తున్నాయి. కాసులకు కక్కుర్తి పడి రోగుల ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నాయి. నడుము నొప్పితో బాధపడుతున్న ఓ వ్యక్తి నిజామాబాద్లో ఓ వైద్యుడి వద్దకు వెళ్లగా సర్జరీకి సిఫార్సు చేశాడు. ఆపరేషన్తో ఇబ్బందులు తప్పవని గ్రహించిన సదరు వ్యక్తి ఏకంగా హైదరాబాద్కు వెళ్లడంతో నడుపు నొప్పి కాస్త మందులతోనే తగ్గి పో యింది. ఇలాంటి ఘటనలకు నిజామాబాద్ కేం ద్రంగా మారింది. చేయి ముడితే శస్త్ర చికిత్సలు, కోకొల్లలుగా టెస్టులతో రోగిని నిలువుదోపడీ చేస్తున్నప్పటికీ వైద్యారోగ్య శాఖ పట్టించుకోకపోవడం దురదృష్టకరం. నిరంతర తనిఖీలు చేపట్టాల్సిన అధికారులు.. యాజమాన్యాలతో చెట్టాపట్టాలేసుకుని తిరగడం ఇందుకు కారణమని తెలుస్తోంది. ఫిర్యాదు లు వస్తే కూడా ముందే ప్రైవేటు దవాఖాన యాజమాన్యాలకు లీకులు ఇచ్చిన ఘనాపాఠీలు వైద్యారోగ్య శాఖలో ఉన్నారు. లీకువీరులపై గత కలెక్టర్ నారాయణ రెడ్డి సీరియస్గా వార్నింగ్ కూడా ఇచ్చారు. పాత కలెక్టర్ బదిలీ తర్వాత లీకువీరులకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. కొన్ని దవాఖానలకు అనుమతులు లేకున్నా రోగుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుంటున్నాయి. వైద్య వృత్తిపై కనీ స పరిజ్ఞానం లేని వారితో పాటు వ్యా పారమే పరమావధిగా భావిస్తున్న కొందరు వైద్యులు నడుపుతున్న దవాఖానల్లో పరిస్థితి గందరగోళంగా మారింది.
వైద్యారోగ్య శాఖలోని ఓ అధికారి ఆశీస్సులతో ఎడాపెడా నిజామాబాద్, బోధన్, ఆర్మూర్లో నకిలీ డాక్టర్లు, బోగస్ దవాఖానలను నిర్వహిస్తున్నారు. వీటిపై ఫిర్యాదులు అందినా వాటి జోలికి మాత్రం పోని సదరు శాఖకు చెందిన అధికార గణం..అకస్మాత్తుగా ఆర్మూర్లో రెండు దవాఖానలను మూసేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారి పనితనం మరోసారి ప్రస్ఫుటంగా బట్టబయలైంది. మూసేసిన ఈఎన్టీ దవాఖానలు చాలా రోజులుగా నడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు వాటి జోలికి వెళ్లకపోవడం చర్చకు దారి తీసింది. నిజామాబాద్ నగరంలోని అర్సపల్లిలోనూ నిబంధనలకు విరుద్ధంగా ఓ పీఎంపీ వ్యవహారమూ ఇలాగే ఉంది. ఆలస్యంగా డీఎంహెచ్వో బృందాలు స్పందించడం ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఆర్మూర్లో డిప్యూటీ డీఎంహెచ్వో స్థాయి అధికారి ఉన్నప్పటికీ.. వారికి ఈ అక్రమ వైద్య దందా కనిపించక పోవడం విడ్డూరంగా మారింది. జిల్లాలో ఈ తరహా తంతుపై తనిఖీలు సీరియస్గా చేపడితే మరిన్ని దవాఖానల బాగోతాలు వెలుగు చూస్తాయని ప్రజలు భావిస్తున్నారు. చాప కింద నీరులా మారిన వీటిని మూసేయాలని కోరుతున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే దవాఖానలపై కఠిన చర్యలు తీసుకుంటాం. అర్హత లేని డాక్టర్లతో వైద్య సేవలు అందించినా తప్పే. ప్రజలకు ఇబ్బందులు సృష్టించే వారిపై చర్యలు ఉంటాయి. ప్రజలెవరైనా ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం.