లింగంపేట, మే 10 : రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి పరుగులు పెడుతున్నాయని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. రూ. 56.66లక్షల నిధులతో మండలకేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ అభివృద్ధి పనులను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలోని పాలకులు అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. బస్టాండ్ దుస్థితి తన దృష్టికి రాగానే ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ను తీసుకువచ్చి పరిశీలించామని గుర్తుచేశారు. అడిగిన వెంటనే ప్రహరీ నిర్మాణానికి ఆయన అవసరమైన నిధులు ఇచ్చారని, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి కూడా మంజూరు చేస్తానని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. మండల కేంద్రంలోని కేజీబీవీలో కోతుల బెడద ఉందని విద్యార్థులు చెప్పగానే రూ. రెండు లక్షలతో సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయించామన్నారు. మండలంలో రూ. 10 కోట్లతో రోడ్లను అభివృద్ధి చేసినట్లు వివరించారు. తండాలకు రహదారులు మంజూరయ్యాయని త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు. లింగంపేట జీపీలో రూ. 10 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభిస్తామన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న గొప్ప కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో లేవని అన్నారు. ఎన్నికలు సమీపిస్తున్నందున ప్రతిపక్షాల నాయకులు గ్రామాల్లోకి వస్తున్నారని, వారి మాయలో పడొద్దని సూచించారు. అనంతరం మండలంలోని 25 మందికి మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ గరీబున్నీసా బేగం, జడ్పీటీసీ శ్రీలత, సర్పంచ్ లావణ్య, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు విష్ణువర్ధన్రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమేశ్, ఎంపీటీసీలు, సర్పంచులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
తాను పార్టీ మారినట్లు చేస్తున్న దుష్ప్రచారం మానుకోవాలని ప్రతిపక్షాల నాయకులను హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో లింగంపేటకు తానే గులాబీ జెండాను తీసుకువచ్చి ఎగురువేసినట్లు గుర్తుచేశారు. అప్పుడు కనిపించని నాయకులు ఇప్పుడు తనను విమర్శించడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.