రెంజల్ : కరోనా వ్యాక్సిన్పై ఎలాంటి అపోహాలు పెట్టుకోవద్దని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. కరోనా వ్యాక్సినేషన్ లక్ష్యంలో జిల్లాలోనే వెనుకబడ్డ రెంజల్ మండలం కందకుర్తి, సాటాపూర్ గ్రామాన్ని గురువారం ఆయన సందర్శించారు. కందకుర్తి గ్రామంలో సుమారు రెండు గంటల పాటు పలు వార్డుల్లో అధికారులు, వైద్య సిబ్బందితో పర్యటించి టీకా వేసుకోని వారికి తానే దగ్గరుండి కరోనా టీకాలు వేయించారు. టీకాలపై వస్తున్న అపోహాలను నివృత్తి చేస్తూ ఎలాంటి భయాందోళన చెందవద్దని కోరారు. నవంబర్ 3 నాటికి 18 సంవత్సరాలు పైబడిన వారందరు మొదటి, రెండవ టీకాను తప్పకుండా వేయించుకోవాలని పేర్కొన్నారు.
జిల్లాలో 8లక్షల 10 వేల మంది టీకాలు వేయించుకొగా, మిగిలిన 3లక్షల 45 వేల మందికి టీకాలు వేసి నవంబర్ 3 నాటిని నూరు శాతం పూర్తి చేసేలా అధికారులు టీం వర్కుగా, ప్రజాప్రతినిధుల సహకారంతో అధిగమించాలని వెల్లడించారు. ఆయన వెంట తాసీల్దార్ రాంచందర్, సర్పంచులు ఖలీంబేగ్, వికార్పాషా, ఎంపీడీవో గోపాలకృష్ణ, అధికారులు తదితరులు ఉన్నారు.