బాల్కొండ / ముప్కాల్ (నిజామాబాద్ ) : సీఎం కేసీఆర్(CM KCR) చేసేదే చెప్తడు.. చెప్పింది చేస్తడని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ( Minister Vemula Prashant Reddy ) అన్నారు. అమలుకు నోచుకోని హామీలు కేసీఆర్ ఇవ్వరని, పేద ప్రజలకు అక్కరకు వచ్చే పనులు చేస్తారని వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలోని బోదేపల్లి, వన్నెల్(బీ) గ్రామాల్లో రూ. 2 కోట్లు, ముప్కాల్ మండలం రెంజర్ల గ్రామంలో సుమారు రూ.2.80 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ కన్నా గొప్పగా చేస్తామని ప్రజలను మభ్యపెట్టే హామీలతో వస్తున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైతుబంధు (Raitu Bandu) , రైతుబీమా, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, ఆసరా పెన్షన్లు (Aasara Pensions) , 24 గంటల ఉచిత విద్యుత్, కుల వృత్తులకు ప్రోత్సాహం సాగునీరు, సకాలంలో ఎరువులు అందిస్తున్నారని వివరించారు. ఏ రంగం చూసుకుంటున్నా కేసీఆర్ మానవీయ కోణంలో ఆలోచించి పథకాలు, అభివృద్ధి పథకాలు, అభివృద్ధి పనులు చేయడంతో పేదలు, రైతులకు ఎంతో మేలు జరిగిందన్నారు.
కాంగ్రెస్ ఇచ్చిన రూ.200 పెన్షన్ను రూ.2 వేలు చేసింది కేసీఆర్ అని, కాంగ్రెస్ ఇప్పుడు 4 వేలు ఇస్తామంటే ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రూ.4 వేల పెన్షన్ ఇచ్చి ప్రజలను ఓట్లు అడగాలన్నారు. వ్యవసాయానికి 3 గంటల కరెంట్ చాలు అని రైతును మళ్లీ గోస పెట్టే కార్యక్రమానికి తెర లేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ అభివృద్ధి ఓర్వని బీజేపీ నాయకులు బీజేపీపాలిత రాష్ట్రాల్లో తెలంగాణ పథకాలు ఎందుకు లేవని ప్రశ్నించారు. స్థానిక ఎంపీ బాండ్ పేపర్ రాసిచ్చి పసుపు రైతులను మోసం చేశాడని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీల మోసపు మాటలు నమ్మి ప్రజలు ఆగం కావొద్దని కోరారు. కేసీఆర్తోనే తెలంగాణ పదిలంగా ఉంటుందని, కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని మంత్రి వేముల పునరుద్ఘాటించారు.