కోటగిరి, నవంబర్ 28:ఉమ్మడి జిల్లాలో రోజురోజుకూ చలి తీవ్రత పెరుగుతున్నది. పగటి ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదు అవుతున్నా సాయంత్రం ఏడు గంటల నుంచి చలి మొదలవుతున్నది. దీంతో ప్రజల్లో ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే చాలా మంది చలికాలంలో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలతో దవాఖానల దారి పడుతుండడమే ఇందుకు నిదర్శనం. వీటితోపాటు దోమల వ్యాప్తి ఎక్కువగా ఉండడంతో చిన్నారుల నుంచి పెద్ద వారి వరకు డెంగీ, మలేరియా, చికున్ గున్యా బారిన పడుతున్నారు. గతంలో ఊపిరితిత్తులు, ఆస్తమా ఇతరత్రా సమస్యలతో బాధపడుతున్న వారికీ చలి తీవ్రత ఇబ్బంది పెడుతున్నది. జాగ్రత్తలు పాటించకుంటే ప్రాణాలకు ముప్పు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వాతావరణంలో మార్పులతోపాటు అల్పపీడన ప్రభావంతో ఈ ఏడాది నవంబర్ రెండోవారం నుంచి నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం సీజనల్ వ్యాధులతోపాటు ఎక్కువగా ఆయాసం, గుండె జబ్బులు వస్తున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రజలు ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఉదయం వాకింగ్కు వెళ్లే వారి చర్మం పొడిబారి బిరుసుగా మారే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. వీటితోపాటు కాళ్ల మడిమలు, పెదాలు పగలడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. మరోవైపు చిన్నారులపై చలి ప్రభావం ఎక్కువగా ఉండనున్నది. వివిధ రుగ్మతలు ఉన్నవారు జాగ్రత్తలు పాటిస్తే చలికాలంలో వ్యాధులబారిన పడకుండా ఉండవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
గ్లిజరిన్ సబ్బుల వాడకం మేలు..
చలికాలంలో చర్మం తెల్లగా పొడిబారకుండా ఉండేందుకు గ్లిజరిన్ సబ్బులు వాడితే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. వైద్యుల సూచన మేరకు స్నానం చేసే సమయంలో గ్లిజరిన్ సబ్బులను వాడాలి. అప్పుడే చర్మం మృదువుగా ఉంటుంది. స్నానానికి ముందు ఆలివ్ ఆయిల్, కొబ్బరి నూనెతో మసాజ్ చేసుకొని తలస్నానం చేయాలి. వేడినీటితో స్నానం చేస్తే చర్మం పొడిబారుతుంది. గోరువెచ్చని నీటితోనే స్నానం చేయాలి.
ఆస్తమా ఉంటే..
చలికాలంలో ఆస్తమా ఉన్నవారు నిత్యం వాడే మందులను సిద్ధంగా ఉంచుకోవాలి. దుమ్ము, దూళి పనులకు దూరంగా ఉండాలి. చల్లని గాలికి తిరుగొద్దు. శ్వాసనాళాలు మూసుకుపోకుండా వైద్యుడి సలహాల మేరకు మందులు వాడాలి. ఇన్హేలర్, నెబ్యులైజర్ వంటివి అందుబాటులో ఉంచుకోవాలి. గుండెజబ్బులున్న వారు, గుండె ఆపరేషన్ చేయించుకున్న వారు వాకింగ్ చేయొద్దు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
పాదాలు పగిలే ప్రమాదం..
చలికాలంలో పాదాలు పగలడం ఎక్కువగా ఉంటుంది. ఉప్పు నీరు కలిపిన గోరువెచ్చని నీటి లో పాదాలను పది నిమిషాలు ఉంచాలి. నీటిలో ఉంచిన తర్వాత సబ్బుతో శుభ్రంగా కడుక్కుని పొడిగుడ్డతో శుభ్రంగా తుడవాలి. పగిలిన చోట మాయిశ్చరైజర్ రాయాలి. మధుమేహ వ్యాధిగ్రస్తులు డాక్టర్ల సలహాలను పాటించాలి.
చిన్నారులు పైలం..
చలికాలంలో చిన్నారులకు జబ్బులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. చలి నుంచి రక్షణకు స్వెట్టర్లను తొడగాలి. వేడినీటితో స్నానం చేయించాలి. ప్రయాణాలు తగ్గించుకోవడం మంచిది. ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
ఉన్ని దుస్తులు మంచిది..
చలికాలంలో రాత్రివేళ తమ పనులు ముగించుకొని ఇంటికి వెళ్లేవారు, పనుల నిమిత్తం బయటికి వచ్చే వారు ఉన్ని దుస్తులు ధరించాలి. బైక్పై వెళ్లే వారు మంకీ క్యాప్, కాళ్లకు బూట్లు, చేతులకు గ్లౌజ్లు ధరించాలి.
గజగజ..
నిజామాబాద్ జిల్లాలో చలి తీవ్రత పెరుగుతున్నది. మూడు రోజుల నుంచి ఉష్ణోగత్రలు కనిష్ఠానికి పడిపోతున్నాయి. గరిష్ఠ ఉష్ణోగ్రత 26.2 డిగ్రీల సెల్సియస్గా నమోదవుతున్నా ఉత్తరదిశ నుంచి చల్లటి గాలులు వీయడంతో కనిష్ఠ ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. ఇప్పటి వరకు ఈ సీజన్లో అత్యల్పంగా 11.5 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఆదివారం 16.2 డిగ్రీలు నమోదు కాగా, మున్ముందు మరింత కనిష్ఠానికి పడిపోయే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. గత ఏడాది చలికాలంలో అత్యల్పంగా 10 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈసారీ అదే తరహాలో 8డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయని అధికారులు తెలిపారు. చలి తీవ్రత పెరుగుతుండడంతో మహిళలు, వృద్ధులు, చిన్నారులు దవాఖానల పాలవుతున్నారు. ఉదయం, సాయంత్రం వేళలో బయటికి వెళ్లలేని పరిస్థితి నెలకొంటున్నది. స్వెట్టర్లు, మంకీ క్యాప్లు ధరించినా చలిని తట్టుకోవడం లేదు. వాతావరణంలో వస్తున్న మార్పుల దృష్ట్యా ప్రజలు ఆరోగ్యంపై జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
జాగ్రత్తలు పాటించాలి..
అస్తమా, టీబీ వ్యాధిగ్రస్తులు ఉదయం 8గంటల వరకు, సాయంత్రం 6గంటల తర్వాత బయటికి వెళ్లొద్దు. బయటికి వెళ్లా ల్సి వస్తే మాస్కులు ధరించడం మేలు. ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే సమీపంలోని వైద్యులను సంప్రదించాలి. వేడి ఆహార పదార్థాలు తినాలి. చిన్నపిల్లలకు నిమోనియా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చల్లని వాతావరణంలో పిల్లలు బయటికి వెళ్లకుండా చూడాలి.