బాన్సువాడ టౌన్, డిసెంబర్ 17: బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి పథకం ఆడబిడ్డలు ఉన్న పేద కుటుంబాల కష్టాలు తీరుస్తున్నదని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆడబిడ్డల సంక్షేమమే ధ్యేయంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. అనేక సంక్షేమ పథకాలను అమలుచేసి పేదలకు అండగా నిలిచారని గుర్తుచేశారు. నియోజకవర్గంలోని బాన్సువాడ పట్టణంతోపాటు రూరల్, బీర్కూర్, నస్రుల్లాబాద్ మండలాల పరిధిలోని 118 మంది లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను బాన్సువాడలోని తన అధికారిక నివాసంలో ఆదివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ.. రాష్ట్రంలో 70 శాతం మధ్యతరగతి ప్రజలే ఉన్నారని, ఆడబిడ్డల పెండ్లి చేయాలంటే బంగారం లేదా ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితులను గమనించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. కల్యాణలక్ష్మి పథకాన్ని తెచ్చారని తెలిపారు. ఈ పథకం కింద నియోజకవర్గ పరిధిలో 15వేల కుటుంబాలకు రూ. 130 కోట్లు పంపిణీ చేశామన్నారు.
బాన్సువాడ పట్టణంలో రూ. 20 కోట్లతో 100 పడకల మాతా-శిశు దవాఖాన నిర్మించి కార్పొరేట్ దవాఖానలకు దీటుగా సౌకర్యాలు కల్పించామని వివరించారు. నాణ్యమైన సేవలు అందించడంతో స్థానికులతోపాటు చుట్టుపక్కల మూడు నియోజకవర్గాల ప్రజలు ప్రసవం కోసం ఎంసీహెచ్కు వస్తున్నారని తెలిపారు. ఒకప్పుడు ప్రభుత్వ దవాఖానలో నెలకు వందలోపే ప్రసవాలు జరిగేవని, ఇప్పుడు ప్రతి నెలా 500 డెలివరీలు చేస్తున్నారని గుర్తుచేశారు. రోజు రోజుకూ సమాజంలో మానవీయ కోణం లోపిస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సేవలందించాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ వరప్రసాద్, సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి, నాయకులు, వివిధ గ్రామాల ప్రజాప్రతినిదులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.