మోర్తాడ్, డిసెంబర్ 6: భారీ వర్షాలతో కల్వర్టులు, బ్రిడ్జిలు తెగి గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయి ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితులు ఉండేవి. గత ఏడాది వరకు ప్రతి వానాకాలంలో జరిగే తంతు ఇదే. కానీ ఈ సంవత్సరం భారీ వర్షాలు కురిసినా అలాంటి పరిస్థితులు ఎదురుకాలేదు. మంత్రిగా ఉన్న సమయంలో ప్రశాంత్రెడ్డి సకాలంలో స్పందించి అవసరమైన చోట బ్రిడ్జిల నిర్మాణానికి నిధులు మంజూరు చేయడంతోపాటు పనులు త్వరితగతిని పూర్తి చేయించడమే ప్రధాన కారణం. మోర్తాడ్ మండలంలోని వడ్యాట్-కమ్మర్పల్లి, వడ్యాట్-మోర్తాడ్, మోర్తాడ్ బద్దంవాడ రోడ్డు, ధర్మోరా-శెట్పల్లి, తిమ్మాపూర్-పాలెం గ్రామాల మధ్య గత సంవత్సరం భారీ వర్షాలతో కల్వర్టుల వద్ద రోడ్డు తెగి గ్రామాల మధ్య రాకపోకలు నిలిచాయి. ఈ విషయాన్ని గుర్తించిన అప్పటి మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి నిధులు మంజూరు చేయించడంతో పరిస్థితులు చక్కబడ్డాయి.
వేగంగా నిధులు.. చకచకా పనులు
గత సంవత్సరం కురిసిన భారీ వర్షాలతో మోర్తాడ్ మండలంలో పలు గ్రామాల్లో కల్వర్టులు తెగిపోవడం, బ్రిడ్జిలు కోతకు గురయ్యాయి. పాలెం-తిమ్మాపూర్ గ్రామాల మధ్య, ధర్మోరా-శెట్పల్లి గ్రామాల మధ్య, వడ్యాట్-కమ్మర్పల్లి గ్రామాల మధ్య కల్వర్టులు తెగిపోయి గ్రామాల మధ్య రాకపోకలు నిలిచాయి. మోర్తాడ్ బద్దంవాడలో బ్రిడ్జి వద్ద రోడ్డు కోతకు గురై బ్రిడ్జి శిథిలదశకు చేరుకున్నది. విషయం తెలుసుకున్న వేముల ప్రశాంత్రెడ్డి పరిస్థితులను సమీక్షించి వెంటనే పనులకు కావాల్సిన అంచనాలను తయారు చేయాలని అధికారులను ఆదేశించడం, నిధులు మంజూరు చేయించడం వేగంగా జరిగింది. మోర్తాడ్ బ్రిడ్జి మరమ్మతులకు రూ.2.60కోట్లు, శెట్పల్లి వద్ద బ్రిడ్జి నిర్మాణానికి రూ.50లక్షలు, తిమ్మాపూర్, పాలెం గ్రామాల మధ్య బ్రిడ్జిల నిర్మాణానికి రూ.60లక్షలు, వడ్యాట్-కమ్మర్పల్లి గ్రామాల మధ్య బ్రిడ్జి నిర్మాణానికి రూ.30లక్షలు మంజూరు చేయించారు. నిధులు మంజూరు కావడంతో పనులు కూడా చకచకా పూర్తయ్యాయి. దీంతో ఈ సంవత్సరం భారీ వర్షాలు కురిసినా ఎలాంటి ఇబ్బందులు రాలేదు.
పొలాలకు వెళ్లే దారిలో బ్రిడ్జి నిర్మాణం
బద్దంవాడ నుంచి పొలాలకు వెళ్లే రోడ్డులో కల్వర్టు కావాలని కోరితే ఏకంగా రూ.90లక్షలు మంజూరు చేసి బ్రిడ్జి నిర్మించేలా వేముల ప్రశాంత్రెడ్డి చూశారు. ఇది బద్దంవాడ రైతులం ఊహించనిది. కల్వర్టు కావాలంటే ఏకంగా బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం ఎంతో సంతోషమనిపించింది. గతంలో ఎంతమందికి చెప్పినా పట్టించుకోలేదు. కానీ ఒక్కమాటతో బ్రిడ్జి నిర్మాణానికే నిధులు మంజూరు చేసినందుకు ఆయనకు రుణపడి ఉంటాం.
– జేసీ గంగారెడ్డి, రైతు, మోర్తాడ్
పనులు పూర్తవ్వడం సంతోషకరం
గత సంవత్సరం కురిసిన భారీవర్షాలతో బద్దంవాడ బైపాస్రోడ్డుపై ఉన్న బ్రిడ్జి దెబ్బతిన్నది. విషయం తెలుసుకున్న అప్పటి మంత్రి ప్రశాంత్రెడ్డి రూ.2.60కోట్లు మంజూరు చేయడంతోపాటు పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూశారు. దీంతో రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అయ్యాయి. సకాలంలో స్పందించి నిధులు మంజూరు చేయడంతోపాటు పనులు పూర్తయ్యేలా చూసిన ప్రశాంత్రెడ్డికి మోర్తాడ్ ప్రజల తరఫున కృతజ్ఞతలు.
– బోగ ధరణి, సర్పంచ్, మోర్తాడ్
ఇబ్బందులు దూరమయ్యాయి
గత సంవత్సరం వర్షాలతో కల్వర్టుల వద్ద రోడ్డు కోతకు గురై తిమ్మాపూర్, పాలెం మధ్య రాకపోకలు బంద్ చేసిండ్రు. కోతకు గురైన కల్వర్టుల వద్ద బ్రిడ్జీలు కట్టడంతో ఈసారి భారీ వర్షాలు పడ్డా ఎలాంటి ఇబ్బంది రాలేదు. రెండు బ్రిడ్జీలను కట్టిన ఎమ్మెల్యే వేములకు కృతజ్ఞతలు.
– కుమ్మరి సిద్ధయ్య, పాలెం