నిజామాబాద్, మార్చి 19(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు అమాత్యయోగమే దక్కకుండా పోయింది. డిసెంబర్ 7న ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం ఆ తర్వాత మంత్రివర్గ కూర్పు చకచకా జరిగినప్పటికీ ఇంతవరకు ఉభయ జిల్లాలకు చెందిన నేతలకు ఎవరికీ చోటే లేకుండా పోయింది. మంత్రివర్గ విస్తరణ రేపు, మాపు అంటూ సాగదీస్తున్నది. మంత్రి పదవి పక్కన పెడితే వివిధ కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకాల ప్రక్రియలో మాత్రం పెద్దపీట దక్కింది. మొదటగా షబ్బీర్ అలీకి ప్రభుత్వ సలహాదారుగా, ఉర్దూ అకాడమీ చైర్మన్గా తాహెర్బిన్ హుందాన్ను ప్రభుత్వం నియమించింది. ఆ తర్వాత మరో నలుగురికి మూడు రోజుల క్రితం వివిధ ప్రభుత్వరంగ సంస్థలకు చైర్మన్ల నియామకం జరిగింది. అందులో ముగ్గురు నేతలూ బాల్కొండ నియోజకవర్గానికి చెందిన వారు కావడంతో కాంగ్రెస్ పార్టీలో ప్రచ్ఛన్నయుద్ధం మొదలైంది.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ నుంచి హస్తం గూటికి చేరిన మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డికి ప్రస్తుత పదవుల భర్తీ ఇబ్బందికరంగా మారే అవకాశం ఏర్పడింది. కాంగ్రెస్ తరఫున బాన్సువాడ నుంచి పోటీచేసి పోచారం చేతిలో ఘోరంగా ఓటమి చవిచూశారు. ఓడిపోయినా నియోజకవర్గంలో పర్యటిస్తూ హల్చల్ చేస్తున్నారు. ఇదే సమయంలో సీనియర్ నేత కాసుల బాలరాజుకు ఆగ్రోస్ చైర్మన్ పదవిని కట్టబెట్టడంతో ఏనుగు రవీందర్ రెడ్డి పరిస్థితిపై నియోజకవర్గంలోని కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చ జరుగుతున్నది. నియోజకవర్గ ఇన్చార్జీగా తానే వ్యవహరిస్తానంటూ పలు సందర్భాల్లో ఏనుగు రవీందర్రెడ్డి శ్రేణులకు చెప్పుకొచ్చారు. కాసుల యాక్టివ్ మోడ్లోకి రావడంతో హస్తం క్యాడర్ ఎటువైపు వెళ్లాలో తర్జనభర్జన పడుతున్నది.
వంద రోజుల పరిపాలనను పూర్తి చేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉమ్మడి జిల్లాకు ఇప్పటికీ మంత్రి యోగమే లేకుండా పోయింది. కేవలం మహబూబ్నగర్కు చెందిన జూపల్లి కృష్ణారావును ఇన్చార్జి మంత్రిగా నియమించి చేతులు దులుపుకోవడంతోనే పరిస్థితి ముగిసినట్లయ్యింది. ఫిబ్రవరిలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, అందులో నిజామాబాద్ జిల్లాకు చెందిన సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి కట్టబెడతారని అంతా ఆశించారు. కానీ అదీ నెరవేరలేదు. సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో జూన్ 6 వరకు ఈ ప్రభావం ఉండనున్నది. దీంతో ఇప్పట్లో మంత్రి యోగం జిల్లాకు దక్కే అవకాశం లేకుండా పోయింది.
బాల్కొండ నియోజకవర్గానికి ఏకంగా ఒకేసారి మూడు రాష్ట్రస్థాయి కార్పొరేషన్ పదవులు దక్కినట్లు అయ్యింది. కో-ఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్గా డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, తెలంగాణ మినరల్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్, తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్గా కిసాన్ సెల్ అధ్యక్షుడు అన్వేశ్ రెడ్డిని నియమిస్తూ సర్కారు ఉత్తర్వులు జారీచేసింది. వీరు ముగ్గురూ ఒకే నియోజకవర్గం కాగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన సునీల్ రెడ్డితో కలుపుకొని నాయకత్వం నాలుగు భాగాలుగా విభజనకు గురికావడం తథ్యమన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. సునీల్ రెడ్డితో పోలిస్తే పై ముగ్గురికి ప్రోటోకాల్ పదవులుండడంతో వారికే ఎక్కువగా ప్రాధాన్యత ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ఎన్నికల ముందు కాంగ్రెస్లోకి వచ్చిన సునీల్ రెడ్డి పరిస్థితి ఏంటన్న చర్చ సర్వత్రా జోరుగా నడుస్తున్నది. మరోవైపు నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బోధన్, ఆర్మూర్, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల్లో సీనియర్ నేతలెందరో ఉండగా వారికి పదవులే వరించకపోవడంతో స్థానిక నాయకత్వం అసంతృప్తితో రగిలిపోతున్నది.