భీమ్గల్, నవంబర్ 5 : నింబాచల లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజైన శనివారం ప్రత్యేక కార్యక్రమాలు కొనసాగాయి. ఉదయం ఏకాక్షర నృసింహ హోమాన్ని వేద పండితులు శాస్రోక్తంగా నిర్వహించారు. అనంతరం స్వామి వారి ఉత్సవ విగ్రహాలతో గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
అందంగా అలంకరించిన పల్లకీలో ఉత్సవ విగ్రహాలను ఉరేగించారు. గోవింద నామ స్మరణతో నింబాచల గిరులు మార్మోగాయి. గతంలో ఎప్పుడూ లేనంతగా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కృషితో రాళ్లురప్పలతో ఉన్న దారిని రూ.70 లక్షల నిధులతో బీటీ రోడ్డుగా మార్చడంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.