బాల్కొండ (ముప్కాల్), ఆగస్టు 16: సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో బాల్కొండ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల పరంపర కొనసాగుతున్నదని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి ప్రశాంత్రెడ్డి అన్నారు. ప్రతిరోజూ కోటి రూపాయలకు తగ్గకుండా ఏదో ఒక పనిని ప్రారంభిస్తున్నామని తెలిపారు. బాల్కొండ మండలంలో ఆయన బుధవారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బాల్కొండ మండలకేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా నుంచి భూమారెడ్డి ఇంటి వరకు సెంట్రల్ లైటింగ్, రోడ్డు విస్తరణ, డివైడర్ పొడిగింపునకు రూ. 2కోట్ల వ్యయంతో చేపట్టనున్న పనులకు శంకుస్థాపన చేశారు. రూ. 2.65 కోట్ల వ్యయంతో తెలంగాణ ఫంక్షన్హాల్ నుంచి డబుల్ బెడ్రూం ఇండ్ల వరకు సంతమల్లన్న గుడి మీదుగా బీటీరోడ్డు, రూ.44.62 లక్షల వ్యయంతో మండల కేంద్రంలో రింగ్ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం కిసాన్నగర్ గ్రామంలో రూ.20 లక్షల వ్యయంతో చేపట్టనున్న గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులను ప్రారంభించారు. రూ.2.42 కోట్ల నిధులతో కిసాన్నగర్ నుంచి జలాల్పూర్, నాగాపూర్ ఎక్స్ రోడ్ వరకు డబుల్ రోడ్డు విస్తరణకు శంకుస్థాపన చేశారు. కిసాన్నగర్ గ్రామ బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో బాల్కొండ నియోజకవర్గంలో ప్రతి రోజూ కోటి రూపాయలకు తగ్గకుండా ఏదో ఒక అభివృద్ధి పనిని ప్రారంభిస్తున్నామని గుర్తుచేశారు. కానీ ఇది గిట్టని కొంతమంది సోషల్ మీడియాలో కోడిగుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. వారు అధికారంలో ఉన్నప్పుడు నిధులు తేవడం చేతకాలేదని, తాను నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తుంటే మాత్రం అడ్డుపడే మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తమకన్నా ముందు పదేండ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధికి కనీసం రెండురెట్ల అభివృద్ధి ఇప్పుడు ప్రతి గ్రామంలో జరిగిందన్నారు. లేదంటే తాను దేనికైనా సిద్ధమేనని మంత్రి సవాల్ చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయని కాంగ్రెస్ పార్టీ వాళ్లు.. చందమామను తీసుకొచ్చి ఒళ్లో పెడతామని ఇప్పుడు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. అబద్దపు హామీల మాయలో పడి మోసపోవద్దని ప్రజలకు మంత్రి విజ్ఞప్తి చేశారు.
అర్వింద్ ఒక్క కొబ్బరికాయనైనా కొట్టిండా?
బాండ్ పేపర్తో రైతులను మోసం చేసి ఎంపీగా గెలిచిన అర్వింద్.. అడ్రస్ లేకుండా పోయాడని మంత్రి విమర్శించారు. మోసపు హామీతో రైతుల ఓట్లు దండుకొని ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఒక్క కొబ్బరికాయ అయినా కొట్టిండా అని నిలదీశారు. ఆయన గెలిస్తే ఐదు రోజుల్లో తెస్తానన్న పసుపు బోర్డు.. ఐదేండ్లయినా పత్తాలేదన్నారు. కేసీఆర్, కేటీఆర్, కవిత, ప్రశాంత్రెడ్డిని విమర్శించేందుకే ఆయనకు నాలుగేండ్లు అయిపోయాయని ఎద్దేవా చేశారు. మోసపు మాటలు చెప్తున్న వారితో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అభివృద్ధి పనులు చేస్తూ.. ప్రజల మేలు కోరే కేసీఆర్కు అందరూ అండగా నిలువాలని మంత్రి ఈ సందర్భంగా కోరారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మంత్రికి ఘన స్వాగతం..
అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి ప్రశాంత్రెడ్డికి బాల్కొండ, కిసాన్నగర్ గ్రామాల ప్రజలు ఘన స్వాగతం పలికారు. పటాకులు కాల్చి, డీజే, డప్పుచప్పుళ్లతో యువకులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. మంత్రిని ఆహ్వానించేందుకు మహిళలు మంగళహారతులతో తరలివచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
బీఆర్ఎస్లో 300 మంది చేరిక
నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలంలోని నాగాపూర్ గ్రామానికి చెందిన యాదవ, కుర్మ, మాల, బంజారాలు, నర్సాపూర్లోని వివిధ యువజన సంఘాల సభ్యులు మొత్తం 300 మంది కాంగ్రెస్, బీజేపీని వీడి బుధవారం బీఆర్ఎస్లో చేరారు. మంత్రి ప్రశాంత్రెడ్డి వేల్పూర్లోని క్యాంపు కార్యాలయం వద్ద వారికి గులాబీ కండువాలు వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కేసీఆర్తోనే రాష్ట్ర అభివృద్ధి సాధించిందని, ఇకముందు కూడా ఆయనే బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతారని అన్నారు. కేసీఆర్ నాయకత్వమే రాష్ర్టానికి శ్రీరామరక్ష అని పునరుద్ఘాటించారు. కాంగ్రెస్, బీజేపీ వస్తే మళ్లీ పాత రోజుల్లాగా కష్టాలు పురావృతమవుతాయని అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ కమ్మర్పల్లి మండల అధ్యక్షుడు రేగుంట దేవేందర్, యూత్ విభాగం రాష్ట్ర నాయకుడు బద్దం చిన్నారెడ్డి, నాగాపూర్, నర్సాపూర్ నాయకులు పాల్గొన్నారు.