నిజామాబాద్ సిటీ, జనవరి 25: దళితబంధు పథకాన్ని పక్కగా అమలు చేయాలని, ఇందుకోసం క్షేత్రస్థాయిలో పరిస్థితులను నిశితంగా పరిశీలించాలని అధికారులను కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ప్రగతిభవన్ సమావేశ మందిరంలో దళితబంధు అమలుపై మంగళవారం నిర్వహించిన సమీక్షా సమవేశంలో ఆయన మాట్లాడారు. దళితబంధు అమలు కోసం ఇప్పటికే జిల్లా, నియోజకవర్గస్థాయి కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాస్థాయి కమిటీల్లో అదనపు కలెక్టర్లు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మెంబర్ కన్వీనర్గా, జిల్లా సాంఘిక సంక్షేమ అభివృద్ధి అధికారి, డీఆర్డీఏ పీడీ, మెప్మా పీడీ, డీసీవో, జిల్లా వ్యవసాయశాఖ అధికారి, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి, పరిశ్రమల శాఖ జీఎం, లీడ్బ్యాంకు మేనేజర్, నాబార్డ్ జీఎంలు సభ్యులుగా ఉంటారని వివరించారు. డివిజన్ స్థాయిలో బాల్కొండకు డీసీవో సింహాచలం, బోధన్కు ఆర్డీవో రాజేశ్వర్, నిజామాబాద్ రూరల్కు నిజామాబాద్ ఆర్డీవో రవి, ఆర్మూర్ సెగ్మెంట్కు స్థానిక ఆర్డీవో శ్రీనివాసులు, నిజామాబాద్ అర్బన్కు అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, బాన్సువాడకు జిల్లా వ్యవసాయశాఖ అధికారి గోవింద్ నోడల్ అధికారులుగా వ్యవహరిస్తారని వివరించారు. జిల్లా అధికారులు అంకితభావంతో పనిచేస్తే ఈ పథకం లక్ష్యం పూర్తిస్థాయిలో నెరవేరుతుందన్నారు. తమ కార్యాలయాలకు పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన చేసి నివేదికలు రూపొందించాలని ఆదేశించారు. విద్యార్థులు, సామాజిక స్పృహ కలిగిన యువకులతో బృందాలను ఏర్పాటు చేసి వారు ఎలాంటి ఉపాధి కోరుకుంటున్నారో సర్వే చేయించి రెండురోజుల్లో సర్వే వివరాలను అందించాలని సూచించారు. జిల్లాలో 2.17 లక్షల మంది దళిత జనాభా ఉండగా, 55,700 కుటుంబాలకు మున్ముందు దశల వారీగా దళితబంధు అమలుచేయనున్నట్లు తెలిపారు. లబ్ధిదారులు తమకు నచ్చిన యూనిట్, నచ్చిన ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఉందన్నారు. ఏ యూనిట్ ఎంచుకుంటే లాభాదాయకంగా ఉంటుందనే విషయాలను లబ్ధిదారులకు అధికారులు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, చంద్రశేఖర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.