నిజామాబాద్ క్రైం, జనవరి 4 : తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే అత్యాశతో ఆన్లైన్లో వచ్చే బిజినెస్ యాప్లను నమ్ముకుంటూ వాటి ద్వారా లక్షల రూపాయలను పోగొట్టుకుంటున్నారు వారు కొందరు.. మరికొందరు ల్యాటరీ తగిలిందని గుర్తు తెలియని వ్యక్తులు పంపించే మెస్సేజ్లను గుడ్డిగా నమ్మి వాటిని ‘క్లిక్’ చేస్తూ లక్షల రూపాయలు తమ బ్యాంక్ ఖాతాలోంచి ఖాళీ చేసుకుంటున్నారు.
అపరిచిత వ్యక్తుల ద్వారా వచ్చే ఫోన్ కాల్స్ నమ్మి వారికి తమ బ్యాంక్ అకౌంట్ వివరాలు ఇతర సమాచారం ఇవ్వకూడదని పోలీసులు ఎంత చెప్పినా జనం మాత్రం పట్టించుకోకుండా సులువుగా డబ్బులు వస్తాయనే ఆశతో విలువైన బ్యాంక్ సమాచారం సైబర్ మోసగాళ్లకు ఇచ్చేస్తున్నారు. ఫలితంగా ఎంతో కష్టపడి పిల్లల భవిష్యత్ కోసం లేదా కుటుంబ పోషణ కోసం భద్రంగా దాచుకున్న డబ్బును సైబర్ నేరాగాళ్ల చేతిలో పెడుతూ లబోదిబోమంటూ చివరకు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఆన్లైన్ నెట్వర్క్ వ్యవస్థ ఎంతగానో అభివృద్ధి చెందుతున్న తరుణంలో పంజాబ్, మహారాష్ట్ర, అస్సాం, ఉత్తరప్రదేశ్, బిహార్ తదితర రాష్ట్రాలకు చెందిన పలువురు కేటుగాళ్లు ఆన్లైన్ టెక్నాలజీ ద్వారా జనాన్ని మోసం చేసేందుక కొత్త కొత్త పాచికలు విసురుతున్నారు.
కామారెడ్డి జిల్లాలో ఇన్స్టాగ్రామ్ మెస్సేజ్తో దోపిడీ
మంచి లాభాలు వచ్చే వ్యాపారం ఉందంటూ ఓ ఉద్యోగికి మెస్సేజ్ పంపించిన సైబర్ మోసగాళ్లు అతని బ్యాంక్ ఖాతాను ఖాళీ చేసిన సంఘటన వెలుగు చూసింది. డిసెంబర్ 18వ తేదీన కామారెడ్డి జిలా ్ల చిన్న మల్లారెడ్డి గ్రామానికి చెందిన సివిల్ సప్లయి డిపార్ట్మెంట్లో ఉద్యోగిగా పనిచేసే నిఖిల్ గౌడ్కు మంచి లాభాలు ఉన్న వ్యాపారం ఉందని ఇన్స్టాగ్రామ్లో ఆన్లైన్ మోసగాళ్లు మెస్సేజ్ పం పించారు. తమ కంపెనీలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు ఉంటాయని వారు నమ్మించారు. దీంతో వారి మాయమాటలు నమ్మిన నిఖిల్ సైబర్ మోసగాళ్ల అకౌంట్కు మొత్తం రూ.1,12,397 పంపించాడు. అనంతరం అటువైపు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తాను మోసపోయానని గుర్తించి చివరకు దేవునిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
రోజుల వ్యవధిలో నమోదైన సంఘటనలు..
నిజామాబాద్ 2,3,4, రూరల్ టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధితో పాటు ఆర్మూర్, మోర్తాడ్, డిచ్పల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలోని పలువురు బాధితులకు ‘ఎస్బీఐ యోనో’లో కేవైసీ అప్డేట్ కోసం పాన్ కార్డ్ వివరాలు అప్డేట్ చేయండి లేదంటే బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అవుతుందని సైబర్ మోసగాళ్లు మెస్సేజ్లు పంపించారు. దీంతో బాధితులు తమకు వచ్చిన మెస్సేజ్లోని నీలిరంగు లింక్ను నొక్కి సైబర్ నేరగాడు చెప్పినట్లుగా గూగుల్ ఫారంలో వాళ్ల బ్యాంక్ వివరాలు, పాస్వర్డ్ నమోదు చేశారు. ఆ తరువాత తనకు వచ్చిన ఓటీపీ సైతం చెప్పడంతో వెంటనే బాధితుల బ్యాంక్ అకౌంట్లోంచి డబ్బులు ఖాళీ అయ్యాయి.
కరెంట్ బిల్లు పేరుతో లక్షన్నర టోకరా
నిజామాబాద్ 4వ, రూరల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇద్దరికి సైబర్ మోసగాళ్లు మెస్సేజ్ పంపించి వారి బ్యాంక్ ఖాతాలోంచి డబ్బులు కాజేసిన సంఘటనలు నమోదయ్యాయి. తక్షణమే కరెంట్ బిల్లు చెల్లించాలని లేదంటే మీ కరెంట్ సరఫరా నిలిపివేడం జరుగుతుందని సైబర్ మోసగాళ్లు మెస్సేజ్ పంపించారు. బాధితులు భయపడి వారికి వచ్చిన లింక్ను క్లిక్ చేసి, వివరాలు నమోదు చేయడంతో వారి ఖాతాలోంచి రూ.లక్షా 59 వేలు సైబర్ మోసగాళ్లు దోచుకున్నారు.
కస్టమర్ కేర్ నంబర్కు కాల్ చేస్తే డబ్బులు మాయం
వర్ని,ఎడపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలోని బాధితులు గూగుల్లో కస్టమర్ కేర్ నంబర్కు కాల్ చేశారు. సైబర్ నేరగాడు బాధితులతో మీ సమస్య పరిష్కా రం కావడానికి ‘ఎనీడెస్క్’ లేదా క్విక్ ‘సపోర్ట్’ అప్లికేషన్ డౌన్లోడ్ చేయమని చెప్పాడు. బాధితులు డౌన్లోడ్ చేసి యాక్సిస్ ఐడీని సైబర్ నేరాగాళ్లకు ఇచ్చారు. అనంతరం మోసగాళ్లు బాధితుల ఫోన్ కంట్రోల్ తీసుకొని ఆన్లైన్ బ్యాంకింగ్ సైతం ఓపెన్ చేయించి, ఎనీ డెస్క్, క్విక్ సపోర్ట్ అప్లికేషన్ ద్వారా బాధితుల ఆన్లైన్ బ్యాంకింగ్ యూజర్ ఐడీ/పాస్వర్డ్ తెలుసుకుని వారి బ్యాంక్ ఖాతాలోంచి రూ.77 వేలు కాజేశారు.
కొంప ముంచుతున్న లోన్ యాప్లు
మనం పరిచయం లేకపోయినా తక్కువ వడ్డీకే లోన్ ఇస్తామంటూ మెస్సేజ్లు పంపుతుంటారు సైబర్ మోసగాళ్లు. డబ్బులు అంటే ఎవరికైనా అవసరం ఉంటుంది కాబట్టి గుర్తు తెలియని వ్యక్తులు మన బ్యాంక్ ఖాతాలోకి లోన్ ద్వారా పొందిన అమౌంట్ను ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇంకేముంది అప్పడే మనం పూర్తిగా వారి చేతిలో ఇరుక్కుపోయామనే విషయాన్ని గుర్తించలేకపోతున్నాం. ఎంతో మంది ‘Golden Rupee’ లోన్ తీసుకున్న కొద్ది రోజులకు మళ్లీ మెస్సేజ్ పంపుతారు సైబర్ మోసగాళ్లు. అందులో మీరు తీసుకున్న లోన్ చెల్లించాలని మెస్సేజ్ రావడంతో లోన్ పొందిన వారు లోన్ పూర్తిగా చెల్లిస్తారు. అయితే సైబర్ మోసగాళ్లు మాత్రం మళ్లీ డబ్బులు చెల్లించాలంటూ మెస్సేజ్లు పంపుతారు. బాధితులు వారు అడిగిన డబ్బులు పంపకుంటే వారి వాట్సాప్కు మహిళల అసభ్యకరమైన ఫొటోలు పంపుతూ మానసికంగా వేధింపులకు పాల్పడుతుంటారు.అంతే కాకుండా బాధితుడి ఫోన్లో ఉన్న అన్ని కాంటాక్ట్స్కు అసభ్యకరమైన ఫొటోలు పంపుతూ వేధిస్తారు. ఇలాంటి సంఘటనపై నిజామాబాద్ 4 టౌన్, రూరల్, మోర్తాడ్ పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు నమోదు అయ్యాయి.
విస్తృతంగా అవగాహన సదస్సులు..
సైబర్ నేరాల బారిన పడకుండా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఎవరైనా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతే 24 గంటల్లోపు 1930 నంబర్కి ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తాం. అంతే కాకుండా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ https://cybercrime.gov.in లో సైతం ఫిర్యాదు చేయవచ్చు. సైబర్ మోసాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నా పట్టించుకోవడం లేదు.
-కె.ఆర్.నాగరాజు, కమిషనర్ ఆఫ్ పోలీస్