కామారెడ్డి, ఆగస్టు 7: రైతును రాజు చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త పథకాలను అమలు చేస్తున్నది. పంట కాలనీల ఏర్పాటుతో వ్యవసాయంలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. పంటల నమోదు కోసం రాష్ట్ర వ్యవసాయశాఖ క్రాప్ బుకింగ్ పేరుతో పంటల వివరాల సేకరణకు శ్రీకారం చుట్టింది. ప్రతి రైతు పొలం వద్దకు వ్యవసాయశాఖ అధికారి వెళ్లి ఫొటోలు తీసి అక్కడి నుంచే మొబైల్ యాప్ ద్వారా ఆన్లైన్లో పంట వివరాలను నమోదు చేస్తున్నారు. పంటల సాగు వివరాల నమోదులో తప్పులు, పైర్లకు సోకుతున్న తెగుళ్లను సకాలంలో గుర్తించలేకపోవడం, పంట దిగుబడి వచ్చాక కొనుగోళ్లలో ఇబ్బందులు వంటి సమస్యలను పరిష్కరించేందుకు వ్యవసాయశాఖ వివరాలు సేకరిస్తున్నది.
జిల్లా, మండల, సబ్ డివిజన్, గ్రామస్థాయి వ్యవసాయశాఖ అధికారుల ఆధ్వర్యంలో ఈ సర్వే చేపడుతున్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ సర్వే నంబర్ల ఆధారంగా జియో ట్యాగింగ్ చేస్తూ పంటల వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ నుంచి ఉపగ్రహం సాయంతో పంటలను చిత్రీకరించేందుకు యాప్ను ఉపయోగిస్తున్నారు. రోజూ ఎంత దూరం, ఎన్ని ఎకరాల పంటలు, ఎంత మంది రైతుల వివరాలు పొందుపరుస్తున్నారో వ్యవసాయ కమిషనరేట్కు అనుసంధానం అవుతుంది. కామారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు 3.64 లక్షల ఎకరాలల్లో పంటలు సాగు చేశారు. 16,729 ఎకరాల్లో క్రాప్ బుకింగ్ పూర్తయ్యింది.
3.64 లక్షల ఎకరాల్లో సాగు
కామారెడ్డి జిల్లాలో వానకాలానికి 5.36లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇప్పటి వరకు 3,64,419 ఎకరాల్లో వివిధ పంట ల సాగయ్యాయి. మరోవైపు వరి నాట్లు కొనసాగుతున్నాయి. 2.50లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని అంచనా వేయగా, ఇప్పటి వరకు 1,62,345 ఎకరాల్లో నాట్లు పూర్తయ్యాయి. ఇంకా కొనసాగుతున్నాయి. మక్క 86,205 ఎకరాల్లో, జొన్న 300, కందులు 22,151, మినుములు 10,500, పత్తి 73,545, బబ్బెర్లు 108, సోయాబీన్ 72,878, చెరుకు 4,100, ఇతర పంటలు వెయ్యి ఎకరాల్లో సాగు చేస్తారని వ్యవసాయశాఖ అంచనా వేసింది. అంతకన్నా ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సాగుకానున్నాయి. గత సీజన్లో 2,18,300 ఎకరాల్లో వరి సాగు చేస్తారని అంచనా వేయగా 2,85,877 ఎకరాల్లో సాగైంది. భారీ వర్షాలకు జిల్లాలోని నిజాంసాగర్, కౌలాస్నాలా, లెండి, పోచారం, కళ్యాణి, సింగీతం రిజర్వాయర్లు పూర్తిస్థాయిలో నిండాయి.
ఏడాది క్రితం సర్వే ప్రారంభం
రైతులు తనకు ఇష్టమైన పంట వేసుకొని దిగుబడి వచ్చాక దాన్ని అమ్ముకునేందుకు పడుతున్న ఇబ్బందులు, మార్కెటింగ్ చేసే సమయంలో దళారుల దోపిడీతో నష్టపోకుండా ఉండేందుకు క్రాప్ కాలనీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతేడాది రాష్ట్ర ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో పంట కాలనీలు అనే కార్యక్రమాన్ని పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేసింది. మంచి ఫలితాలు రావడంతో ఈ విధానాన్ని అన్నిజిల్లాల్లో అమలు చేయాలని నిర్ణయించింది. ఈ వివరాల ఆధారంగా ఒక ప్రాంతంలో రైతులు ఎక్కువగా పండించిన పంటల ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పాలనేది ప్రణాళిక. సర్వేలో రైతు పట్టాపాస్ పుస్తకం నంబరు, బ్యాంకు ఖాతా నంబర్, సామాజిక స్థితి, రైతు భూమి విస్తీర్ణం, నీటి పారుదల వసతి, వానకాలం, యాసంగిలో పండించిన పంటల వివరాలు, మార్కెటింగ్ సౌకర్యం, రైతులు తీసుకున్న రుణాలు, పంటలకు బీమా వివరాలు, రైతు కుటుంబంలో స్వయం సహాయక సంఘాల సభ్యుల వివరాలను సేకరిస్తున్నారు. రైతులకున్న పశువుల సంఖ్య? సేంద్రియ వ్యవసాయంపై వారికి అవగాహన ఉందా? అనే వివరాలతోపాటు ఆ ప్రాంతంలో ఉన్న ప్రాసెసింగ్ యూనిట్లకు అనుగుణంగా రైతుల అభిప్రాయాలను సేకరిస్తున్నారు. వ్యవసాయ విస్తరణాధికారులు క్షేత్రస్థ్ధాయిలో వెళ్లి రైతులను కలుస్తూ క్రాప్ బుకింగ్ యాప్లో వివరాలను పొందుపరుస్తున్నారు.
ఫుడ్ ప్రాసెసింగ్, పరిశ్రమల ఏర్పాటుకు అడుగులు..
కామారెడ్డి జిల్లాలో 22 మండలాల పరిధిలో 104 క్లస్టర్ల వారీగా రైతుల వివరాలు సేకరిస్తున్నారు. 39 అంశాలను మొబైల్ యాప్లో పొందుపరుస్తున్నారు. కామారెడ్డి, దోమకొండ, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ ప్రాంతాల వారీగా డీఏవో, ఏడీఏ, ఏవోల పర్యవేక్షణలో రూపొందించిన నివేదిక ఆధారంగా ఏ ప్రాంతంలో ఏఏ పంటలకు అనుబంధంగా ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలో నిర్ణయిస్తారు. సదాశివనగర్ మండలం లింగంపల్లి, జనగామ గ్రామాల్లో ఫుడ్ ప్రాసెసింగ్, జనపనార పరిశ్రమల ఏర్పాటుకు అడుగులు పడ్డాయి. ఇక్కడ పనులను ప్రారంభించేందుకు సదరు కంపెనీ చర్యలు చేపట్టింది. పంటల ఆధారంగా అనుబంధ పరిశ్రమలను స్థాపించి రైతులకు మార్కెటింగ్ సౌకర్యం, మద్దతు ధరలు అందించేందుకు సర్కారు సమాయత్తమవుతున్నది. వరి, మక్క, పత్తి తదితర పంటలకు సంబంధించి ఎన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అంచనాలు వేసేందుకు ఈ సర్వే దోహదపడుతుంది.
సర్వే కొనసాగుతున్నది..
క్రాప్ బుకింగ్ వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించాం. జిల్లాలోని 104క్లస్టర్ల వారీగా స్థానిక వ్యవసాయశాఖ అధికారులతో కలిసి సమగ్ర సర్వే కొనసాగుతున్నది. పంటల వివరాలు, సాగు విధానం, పరిస్థితులు, అవగాహన వంటి వివరాలు ఆన్లైన్లో పొందుపరుస్తున్నాం. సర్వేలో జాప్యం లేకుండా చర్యలు తీసుకుంటున్నాం.
– భాగ్యలక్ష్మి, జిల్లా వ్యవసాయ అధికారిణి, కామారెడ్డి