నిజామాబాద్, జూలై 20, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రతి పంట కాలంలో క్రాప్ బుకింగ్(పంటల నమోదు) ప్రక్రియ వ్యవసాయ శాఖకు కీలకం. రైతులు ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగు చేశారో సరైన వివరాలు నమోదు చేస్తే ఎరువుల పంపిణీ, మద్ధతు ధరకు కొనుగోళ్లు, పంటల బీమా, ఇతర రాయితీలు సజావుగా అందుతాయి. కానీ ఉమ్మడి జిల్లాలో మరీ ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో వ్యవసాయ విస్తరణాధికారులు, మండల వ్యవసాయాధికారుల నిర్లక్ష్యానికి రైతులు బలి అవుతున్నారు. కూర్చున్న చోటే క్రాప్ బుకింగ్ నమోదు చేస్తున్నారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వెలుగు చూస్తున్నాయి. క్షేత్ర స్థాయిలో పొలాలు తిరిగి జియో ట్యాగింగ్ లేదా సరైన సర్వే చేయడం లేదని తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
దీంతో రైతులు పంటలు అమ్ముకునే సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు గతేడాది లెక్కల ఆధారంగా కాకి లెక్కలు వేస్తున్నారని రైతులు భావిస్తున్నారు. గత యాసంగిలో బోధన్ డివిజన్ లో అనేక పొరపాట్లు జరిగాయి. రైతులు సాగు చేసిన పంటలకు ఇతరత్రా వివరాలు నమోదు చేయడంతో అనేక మంది ఇక్కట్లు ఎదుర్కొన్నారు. ఇదే డివిజన్లో గతంలో తప్పుడు పంట వివరాలు నమోదు చేసిన ఘటనలు అనేకం వెలుగు చూశాయి. అయినప్పటికీ తీరు మారకపోగా తప్పు మీద తప్పులు చేస్తున్నారు. జిల్లా వ్యవసాయాధికారి క్షేత్ర స్థాయిలో పర్యటించకపోవడం, ఫిర్యాదులను పట్టించుకోకపోవడం వల్లే ఇదంతా జరుగుతోందని కర్షకులు మండిపడుతున్నారు. మొక్కుబడిగా క్రాప్ బుకింగ్ వల్ల ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసే వారికి, అసలైన రైతులకు తలపోటు తప్పడం లేదు. వానాకాలంలో అంతర పంటలు సాగు చేసే ఆదర్శ రైతులకు సైతం అనేక మార్లు ఇబ్బందులు ఎదురయ్యాయి.
నిజామాబాద్ జిల్లాలో మొత్తం 5లక్షల 30వేల 397 ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయ నివేదికలు చెబుతున్నాయి. ప్రధానంగా 4లక్షల 38వేల 521 ఎకరాల్లో వరి, 55వేల ఎకరాల్లో మొక్కజొన్న, 34వేల 227 ఎకరాల్లో సోయాబీన్, 994 ఎకరాల్లో కందులు(రెడ్గ్రామ్), 993 ఎకరాల్లో పత్తి, 228 ఎకరాల్లో వేరుశనగ, 65 ఎకరాల్లో పెసర్లు(గ్రీన్ గ్రామ్), 37 ఎకరాల్లో మినుములు(బ్లాక్గ్రామ్) పంటలు సాగవుతాయని అంచనాలు సిద్ధమయ్యాయి. 2025 వానాకాలం సీజన్లో వ్యవసాయ అంచనాలకు భిన్నంగా పంటలు సాగయ్యాయి.
సాధారణ వానాకాలం సాగు విస్తీర్ణం 5.18లక్షల ఎకరాలు కాగా 10వేల ఎకరాలు అదనంగా సాగులోకి వచ్చాయి. అంటే దాదాపుగా 10వేల ఎకరాల్లో పంటల సాగు పెరిగింది. సాధారణ పంటల సాగు విస్తీర్ణంతో పోలిస్తే 12వేల ఎకరాల్లో అధికంగా పంటలు సాగవుతాయని అంచనాలు సిద్ధం చేసినప్పటికీ ఎల్నినో భయాల మూలంగా ఏ మేర పంటలు పండుతాయని వేచి చూడాల్సి ఉంది. అంచనాల రూపకల్పనలో వ్యవసాయ శాఖ తూతూ మంత్రంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలకు ఈ లెక్కలు బలం చేకూరుస్తున్నాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు హడావిడిగా గణాంకాలు తయారు చేసి ఇవ్వడం మినహా క్షేత్ర స్థాయి పరిస్థితికి అద్దం పట్టేలా గణాంకాలు ఉండటం లేదు.
ఏటా క్రాప్ బుకింగ్ ప్రక్రియ ప్రహసనంగా మారుతున్న నేపథ్యంలో ఈసారైన సజావుగా నిర్వహిస్తారా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారుతోంది. వ్యవసాయాధికారులు బాధ్యతగా మెదిలి రైతులకు మేలు చేయాలని ప్రతి ఒక్కరూ కోరుతున్నారు. లేదంటే పంటల విక్రయ సమయంలో ఎదురయ్యే కష్టాలకు ఎవరు బాధ్యులని? ప్రశ్నిస్తున్నారు. తప్పు చేసిన ఏఈవో, ఏవోలపై చర్యలు తీసుకోవడంలో ఉన్నతాధికారులు వెనుకాడుతున్నారు. తద్వారా క్రాప్ బుకింగ్ ప్రక్రియ సాదాసీదాగా జరుగుతోంది. క్రాప్ బుకింగ్ ఆన్లైన్ ఆధారంగా జరుగుతుంది. వ్యవసాయ శాఖ నమోదు చేసే వివరాలనే పౌరసరఫరాల శాఖ, మార్క్ఫెడ్ వ్యవస్థల్లో కనిపిస్తోంది. క్రాప్ బుకింగ్లో ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లుగా చూపితే గందరగోళం ఏర్పడి రైతులకు నష్టం వాటిల్లుతోంది.
వ్యవసాయ శాఖ విడుదల చేసే సాగు అంచనాలు ప్రభుత్వానికి కీలకంగా మారుతాయి. సీజన్ ఆరంభానికి ముందే అప్రమత్తత విషయంలో ఈ అంచనాల ద్వారానే యంత్రాంగం సంసిద్ధం కావాల్సి ఉంటుంది. పంటల సాగును అంచనా వేయడానికి వ్యవసాయ శాఖ శాస్త్రీయ విధానాన్ని అవలంభించాలి. కానీ ఏవో, ఏఈవోలు తూతూ మంత్రంగానే గత లెక్కలను పరిశీలన చేసి రాసిస్తున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. తద్వార గణాంకాల్లో తేడా మినహా క్షేత్ర స్థాయి పరిస్థితులకు అద్దం పట్టేలా వివరాలు ఉండటం లేదన్న విమర్శలు వెలుగు చూస్తున్నాయి.
కామారెడ్డి జిల్లాలో మొత్తం 5లక్షల 59వేల 290 ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనాలు సిద్ధం చేసింది. ఇందులో అత్యధికంగా 3లక్షల 20వేల ఎకరాల్లో వరి, 90వేల 684 ఎకరాల్లో సోయాబీన్, 54వేల 500 ఎకరాల్లో మొక్కజొన్న, 45వేల 500 ఎకరాల్లో పత్తి, 41వేల 500 ఎకరాల్లో కందులు(రెడ్గ్రామ్), 3382 ఎకరాల్లో పెసర్లు(గ్రీన్ గ్రామ్), 2858ఎకరాల్లో మినుములు(బ్లాక్గ్రామ్), 588 ఎకరాల్లో చెరుకుతో పాటుగా ఇతర పంటలు సాగవుతాయని సూచించింది. గతేడాది వానాకాలంలో 5.52లక్షల ఎకరాల్లో పంటలు సాగైనట్లుగా వ్యవసాయ శాఖ పేర్కొంది.