ఏండ్లుగా అణగారిన దళితుల జీవితాల్లో విప్లవాత్మక మార్పునకు అడుగులు పడుతున్నాయి. ఆర్థిక అభివృద్ధి సాధించేలా రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పథకాన్ని రూపొందించి విజయవంతంగా అమలు చేస్తున్నది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో ఈ పథకాన్ని అమలుచేయడంతో దళిత కుటుంబాలు ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నాయి. దళితుల అభ్యున్నతికి ఇంత పెద్ద బడ్జెట్తో ఉపాధి ఇచ్చే పథకాన్ని ఇప్పటి దాకా ఏ ప్రభుత్వమూ చేపట్టలేదు. కానీ కొందరు దళితబంధు పథకంపై అక్కసు వెల్లగక్కుతున్నారు. తెలంగాణ ప్రజలు ఆర్థిక ప్రగతి సాధించే కార్యక్రమాలేవీ 60 ఏండ్ల సీమాంధ్ర పాలనలో చేపట్టలేదు. దీంతో పేదలకు సంక్షేమ కార్యక్రమాలు ఎన్ని చేసినా తక్కువేనని సీఎం కేసీఆర్ వివిధ పథకాలను అందిస్తున్నారు. కానీ వాటిపై విషప్రచారం చేస్తున్న వారిపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కమ్మర్పల్లి/నిజాంసాగర్/ డిచ్పల్లి, ఆగస్టు 28: దళిత బంధు బతుకు దారి చూపే పథకమనే సంపూర్ణ విశ్వాసం దళిత వర్గాల్లో వ్యక్తమవుతోంది. దళిత బంధు అమలు ప్రారంభించి పేద దళిత కుటుంబాలను క్రమంగా సమగ్ర ఆర్థిక అభివృద్ధి దిశగా తీసుకెళ్లేలా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి తప్పక సత్ఫలితాలను ఇస్తున్నదనే భరోసా దళిత సంఘాల నాయకుల్లోనూ నెలకొన్నది. దళితుల అభివృద్ధికి ఇంత పెద్ద బడ్జెట్తో ఉపాధి నిచ్చే పథకాన్ని ఏ ప్రభుత్వమూ చేపట్ట లేదు. ఇలాంటి గొప్ప పథకంపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తూ దళిత బంధు పథకాన్ని వృథా పథకమనే భావన కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ కోవ లోదే ఓటీవీ చానల్లో దళిత బంధుపై చేసిన కామెంట్లు అనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. దళిత సంక్షేమాన్ని సంపూర్ణంగా అందిచేందుకు దళిత బంధు దారి చూపుతుందని పలువురు దళిత బంధు లబ్ధిదారులు, దళిత సంఘాల నాయకులు పేర్కొంటున్నారు.
దళిత బంధు చారిత్రాత్మకం
దళిత బంధు చారిత్రాత్మక పథకం. అర్హులందరికీ పథకాన్ని అందించాలనే అభిప్రాయాలు ఉన్న మాట వాస్తవమే. కానీ భారీ నిధులతో చేపట్టిన ఈ పథకం సత్ఫలితాలనిచ్చే దిశలో అమలు చేస్తున్నారు. దళితుల కోసం ఇలాంటి పథకమొకటి వస్తదని ఎవరైనా ఊహించారా.. దానికి పెద్ద ఎత్తున బడ్జెట్ను క్రమంగా అందిస్తున్నారు. ఇలాంటి గొప్ప పథకం వృథా అంటూ మాట్లాడడం భావ్యం కాదు. -సాయన్న, అంబేద్కర్ యువజన సంఘం కమ్మర్పల్లి మండల గౌరవ అధ్యక్షుడు
దుకాణానికి ఓనరయ్యాను
నేను రోజూ వారి కూలీ డబ్బులకు పని ఎక్కడ దోరికితే అక్కడికి వెళ్లి ఎలక్ట్రిషియన్గా పని చేసి కుటుంబాన్ని కష్టం మీద నెట్టుకొచ్చే వాన్ని. కానీ కేసీఆర్ దళిత బంధు పథకం తేవడంతో నేనే సొంత ఎలక్ట్రికల్ దుకాణానికి ఓనరయ్యాను. ఈ పథకంతో నేడు సంపూర్ణ ఆర్థిక ప్రగతి సాధించే అవకాశం కలిగింది.
– గుర్రం నరేశ్, అమీర్ నగర్, కమ్మర్పల్లి మండలం
వెలుగులు నింపుతున్న పథకం..
పేద దళిత వర్గాలు ఆర్థిక వృద్ధి సాధించేలా దళిత బంధు పథకం దారి చూపుతున్నది. ఈ విషయం పథకం అరంభలోనూ..అమలు లోనూ, నిధుల కేటాయింపు లోనూ కనిపించింది. టాక్టర్లపై, ఆటోలపై, లారీలపై డ్రైవర్లుగా పని చేసిన వారు అలాంటి వాహనాలకు ఓనర్లు అయ్యారు. సర్కారు ఆర్థిక చేయూత ఇవ్వడంతోనే ఇది సాధ్యమైంది.
– సుంకరి విజయ్, ఎవైఎస్ కమ్మర్పల్లి మండల అధ్యక్షుడు
తగిన బుద్ధిచెబుతాం..
ఏబీఎన్ ఎండీ దళితులను చిన్నచూపు చూస్తూ మాట్లాడడం తగదు. మా జోలికి వస్తే బుద్ధి చెప్పేరోజులు ముందున్నాయి. మమ్మల్ని ఇప్పటి వరకు ఎవరూ గుర్తించలేదు. అలాంటిది సీఎం కేసీఆర్ గుర్తించి పథకాన్ని తీసుకువస్తే పథకం వేస్ట్.. ఇలాంటి పథకం వల్ల ఒరిగిందేమి లేదంటూ రాధాకృష్ణ మాట్లాడడం తగదు. ఇప్పటికైనా ఆయన అహంకార ధోరణి వీడకపోతే మా సత్తా చూపిస్తాం. – రమేశ్, మండల దళితబంధు కార్యదర్శి, మంగళూరు
అవహేళన చేయడం మానుకోవాలి
దళితులను అవహేళన చేయడం మానుకోవాలి. ఇది మానుకోకపోతే రాధాకృష్ణను కోర్టుకు పంపాల్సి వస్తుంది. హెచ్చరికలు పట్టించుకోకుంటే భౌతికదాడులకు పాల్పడుతాం.
– రామరాజు, దూస్గాం
దళితుల గుండెల్లో దేవుడు కేసీఆర్
నాకు దళితబంధు పథకం కింద టాటా కంపెనీ ఆటో అందజేశారు. అన్ని ఖర్చులు పోనూ నెలకు రూ.20వేల వరకు సంపాదిస్తున్నాను. గౌరవంగా జీవిస్తున్నాను. దీనికి కారణం సీఎం కేసీఆర్ సారే. ఆయన దేవుడు. మా గురించి ఆలోచించి ఇంత మంచి పథకాన్ని తీసుకువస్తే కొంతమంది వ్యక్తులు దీనిని రాజకీయం చేస్తూ దళితబంధు పథకం వృథా అంటూ లేని పోని మాటలు మాట్లాడుతున్నారు. చులకనగా మాట్లాడడం మానుకోవాలి.
– దుర్గయ్య, దళిత బంధు లబ్ధిదారుడు, గోర్గల్
చాలా గొప్ప ఆలోచన..
దళితబంధు పథకం సీఎం కేసీఆర్కు వచ్చిన గొప్ప ఆలోచన. ప్రతి ఒక్క వ్యక్తి సంఘంలో గౌరవంగా నిలబడాలన్న ఆకాంక్షతో తీసుకువచ్చిన పథకం. ఇలాంటి పథకం వృథా అంటూ ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణ చెప్పడం ఎంత వరకు సమంజసం. దళితుల పట్ల చిన్నచూపు చూడడం తగదు. – విఠల్, దళితబంధు కమిటీ మండల అధ్యక్షుడు, నర్సింగ్రావుపల్లి
క్షమాపణ చెప్పాలి.. లేదంటే బుద్ధి చెబుతాం
ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ మరోసారి దళితులపై విషం కక్కిండు. దళితులకు భేషరతుగా క్షమాపణ చెప్పాలి. లేకపోతే అట్రాసిటీ కేసు పెట్టాలి. దళిత కుటుంబాల్లో వెలుగు నింపిన మహానాయకుడు కేసీఆర్. ఏబీఎన్ డిబెట్లో ఎమ్మెల్సీ కవితతో దళితబంధు వృథా ఖర్చు, దళితబంధు ఎందుకు ఇవ్వాలని అవహేళన చేయడం సరికాదు. ఇలాంటి వ్యాఖ్యలు ఎవరైనా చేస్తే సహించం.
– పాశం కుమార్, ఇందల్వాయి
నెలకు రూ.25వేల సంపాదన
సీఎం కేసీఆర్ వల్ల ఈ రోజు నాకు వాహనం వచ్చింది. ఇప్పటి వరకు మమ్ములను పట్టించుకునే వారు లేరు. అలాంటిది మా గురించి ఆలోచించి ఈ పథకాన్ని తీసుకురావడంతోనే సంఘంలో గౌరవంగా బతుకుతున్నాం. నెలకు అన్నీ పోనూ రూ.25వేల వరకు మిగులుతున్నాయి. ఎంతో మంది పాలకులు వచ్చారు.. పోయారు. మా గురించి ఆలోచించే నాయకుడు వచ్చాడంటే అది కేవలం కేసీఆర్ సారే. – సాయిలు, గోర్గల్, నిజాంసాగర్ మండలం
అవమానిస్తే దాడులకు దిగుతాం
ఎమ్మెల్సీ కవితతో ఇంటర్వ్యూలో దళితబంధు పథకంపై అవహేళన చేసిన ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ భేషరతుగా క్షమాపణ చెప్పాలి. దళితులను అవమానించే విధంగా మాట్లాడడం సరికాదు. తీరు మార్చుకోకపోతే కార్యాలయంపై దాడికి దిగుతాం.
– నీరడి పద్మారావు, బర్దిపూర్