వేల్పూర్, డిసెంబర్ 9 : మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కార్పొరేట్ స్థాయిలో ముస్తాబైంది. దవాఖానను రాష్ట్ర రోడ్లు, భవనాలు, హౌసింగ్, శాసనసభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి శుక్రవారం ప్రారంభించనున్నారు. దవాఖానలో సౌకర్యాలు లేక పేద ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు మంత్రికి ఇటీవల విన్నవించారు. ఈ మేరకు మంత్రి తన స్నేహితుల సహకారంతో రూ.35 లక్షలతో దవాఖానను ఆధునీకరించారు. దవాఖాన భవనాన్ని సుందరంగా తీర్చిదిద్దడంతోపాటు దవాఖానలోని గదుల్లో టైల్స్ వేయించారు. రోగులను పరీక్షించే గదితోపాటు వైద్యులకు ప్రత్యేక హాలును నిర్మించారు. ఆపరేషన్ థియేటర్లో ఆధునిక సౌకర్యాలను కల్పించారు. గతంలో ఐసీయూలో బెడ్ల సంఖ్య తక్కువగా ఉండడంతో స్థానికులు ఇతర ప్రాంతాల్లోని దవాఖానలకు వెళ్లాల్సి వచ్చేది. ప్రస్తుతం ఐసీయూలో 8 బెడ్లను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ దవాఖానను కార్పొరేట్ స్థాయిలో సిద్ధం చేయడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దవాఖానలో సకల సౌకర్యాల కల్పనకు కృషి చేసిన మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి రుణపడి ఉంటామని గ్రామస్తులు పేర్కొంటున్నారు.
మంత్రికి రుణపడి ఉంటాం
మా గ్రామంలోని ప్రభుత్వ దవాఖానను కార్పొరేట్ స్థాయిని తలపించేలా తీర్చిదిద్దిన మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి రుణపడి ఉంటాం. దవాఖానలో సౌకర్యాలు కల్పించాలని విన్నవించిన వెంటనే మంత్రి వారి స్నేహితుల సహకారంతో రూ.35 లక్షలతో దవాఖానను అభివృద్ధి చేయడం సంతోషంగా ఉంది.
పేద ప్రజలకు సౌకర్యంగా..
వేల్పూర్ దవాఖానలో ఆధునిక సౌకర్యాలను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. కరోనా ఉధృతంగా ఉన్నప్పుడు దవాఖానలో సరైన సౌకర్యాలు లేక రోగులు ఇబ్బందులు పడ్డారు. దవాఖాన అభివృద్ధితో గ్రామస్తులకు మెరుగైన వైద్యం అందుతుంది. దవాఖానను అభివృద్ధి చేయించిన మంత్రికి కృతజ్ఞతలు.
అమరవీరులకు అశ్రునివాళి
ఇందూరు, డిసెంబర్ 9 : తమిళనాడు రాష్ట్రంలో హెలికాప్టర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్తోపాటు 12 మంది సిబ్బంది మృతిచెందడం బాధాకరమని ఎస్ఎస్ఆర్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఎం.మారయ్యగౌడ్ అన్నారు. అమరులైన వారి చిత్రపటాలకు కళాశాల ఆవరణలో విద్యార్థులతో కలిసి గురువారం ఘన నివాళులర్పించారు. భారత తొలి త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్ ఓ అసమాన సైనికుడు, అసలైన దేశభక్తుడని, దేశానికి అవిరళ కృషిచేశారని కొనియాడారు. ఆయన మృతి దేశానికి తీరని లోటు అని అన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.