ఇందూరు : నిజామాబాద్ రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలోని చంద్రశేఖర్ కాలనీలో పోలీస్ కమిషనర్ కార్తికేయ ఆధ్వర్యంలో గురువారం కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. నేరాల నియంత్రణల భాగంగా ముందస్తుగా 125 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో సెర్చ్నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనాలకు సంబంధించిన ధ్రువపత్రాలు, నంబర్ప్లేట్లు లేని 44 ద్విచక్రవాహనాలు, 3ఆటోలు, 4కార్లను స్వాధీనం చేసుకున్నారు. సీపీ కార్తికేయ మాట్లాడుతూ.. నేరాల అదుపునకు కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఎలాంటి పరిచయం లేని వారికి ఇల్లు కిరాయికి ఇవ్వరాదని, కొత్త వ్యక్తులకు ఇంటిని కిరాయికి ఇచ్చేప్పుడు పూర్తి సమాచారం తెలుసుకోవాలన్నారు.
అవసరమనుకుంటే ఆధార్ కార్డు చూడాలని, కొత్త వ్యక్తులు కాలనీలో తిరిగినట్లయితే సమాచారం ఇవ్వాలని, ఇతరులకు తమ వాహనాలు ఇవ్వరాదని, ఒకవేళ ఇస్తే వాహన యజమానిపై కేసులు నమోదు చేస్తామన్నారు. ప్రస్తుతం పోలీసుల ఆధీనంలో ఉన్న వాహనాలకు సంబంధించిన ధ్రువపత్రాలు చూపించి వాహనాలు తీసుకెళ్లాలని సూచించారు. పత్రాలు లేని వారిపై మోటారు వాహన చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.. ప్రతిఒక్కరూ వారి పరిధిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రజలకు గల సమస్యలపై డయల్ 100ను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
అలాగే గల్ఫ్ మోసాల నియంత్రణలో భాగంగా పోలీసు కళాబృందం ద్వారా ప్రచారం చేస్తున్నామన్నారు. కార్డెన్ సెర్చ్లో డిప్యూటీ కమిషనర్ అరవింద్బాబు, ట్రాఫిక్ ఏసీపీ ఆర్.ప్రభాకర్రావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాఘవేందర్, సిఐలు, ఆర్ఐలు, ఎస్సైలు, హెడ్కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, మహిళా పోలీసులు, హోంగార్డులు, సిబ్బంది, కాలనీవాసులు పాల్గొన్నారు.