నిజామాబాద్(వేల్పూర్) : ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైన కాంగ్రెస్కు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కులేదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి( MLA Prashanth Reddy) పేర్కొన్నారు. మంగళవారం నిజామాబాద్ జిల్లా వేల్పూర్ లోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
బీఆర్ఎస్ (BRS) హయాంలో రైతులకు పుష్కలమైన సాగు నీరు, 24 గంటల కరెంట్,రైతుబంధు(Raitu Bandu) అందించామని వెల్లడించారు. నేడు పరిస్థితులు అందుకు భిన్నంగా నెలకొన్నాయని వివరించారు. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం,రైతు ఏడ్చిన రాజ్యం బాగుండదని సామెత రాష్ట్రంలో పునరావృతం అవుతుందని తెలిపారు. పంటకు నీరందక, బోర్ల కింద సాగుకు విద్యుత్ అందక పంటలు ఎండిపోతున్నాయని అన్నారు. కేసీఆర్(KCR) నాయకత్వంలో కాళేశ్వరం రివర్స్ పంపింగ్ ద్వారా కింద గోదావరి నుంచి నీళ్లను శ్రీరామ్ సాగర్ తీసుకొచ్చి, వరద కాలువ, కాకతీయ కెనాల్ ద్వారా రైతులకు నీళ్లు అందించామని గుర్తు చేశారు.
పోచంపాడ్ డ్యామ్ నుంచి వరద కాలువ ద్వారా కేటాయింపుల కంటే నీరు కిందికి తరలించి రైతాంగానికి అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. పంటలను కాపాడాలని రైతుల తరపున విన్నవించినా ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. బ్యాంకు అధికారులు రైతులకు అప్పులు కట్టాలని లీగల్ నోటీసులు (Legal Notice)ఇవ్వడం దారుణమని, రైతులెవరూ బ్యాంక్ రుణాలు కట్టనవసరం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన 2 లక్షల రుణమాఫీ హామీని నెరవేర్చకుంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు.
యాసంగి పంటకు ఎకరానికి రూ.7,500 చొప్పున చెల్లించాలి
ఎన్నికల కోడ్ రైతుల సహాయానికి అడ్డు కాకూడదని వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. ఎన్నికల కోడ్ ఉందని కాంగ్రెస్ మాదిరిగా ఎలక్షన్ కమిషన్ (Election Commission) పిర్యాదు చేయమని వెల్లడించారు. రైతులకు సాయం విషయం లో రాజకీయాలకు పాల్పడబోమని వివరించారు. యాసంగి పంటకు ఎకరానికి రూ.7,500 చొప్పున చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి క్వింటాలు కి రూ .500 బోనస్ ఇచ్చి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అన్నారు.