కంఠేశ్వర్, మే 24 : మూడు నెలల రేషన్ కోటాను ఒకేసారి పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన బియ్యం కోటాను రేషన్ దుకాణాల ద్వారా లబ్ధిదారులు ఒకేసారి పొందవచ్చని పేర్కొన్నారు. ఈ మేరకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, రేషన్ డీలర్లు మూడు మాసాల కోటాను దిగుమతి చేసుకుని సకాలంలో బియ్యం కోటా పంపిణీ చేయాలని సూచించారు.
జూన్ 1 నుంచి 30 లోపు పంపిణీ ప్రక్రియ పూర్తిచేయాలని ఆదేశించారు. బియ్యం పంపిణీలో అవకతవకలు, అలసత్వానికి తావిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వర్షాలు, వరదలు, నిల్వ సమస్యలు తదితర ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని తెలిపారు. ఏకకాలంలో మూడు నెలల పంపిణీ జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ చేపట్టాలని పౌర సరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి రేషన్ షాపులకు సరుకులు సక్రమంగా తరలించేలా బియ్యం నిల్వలు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు.