ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న కేసీఆర్ ప్రభుత్వం వైద్యారోగ్య వ్యవస్థను మరింత పటిష్టం చేస్తున్నది. ఇందులో భాగంగా జిల్లాకో మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తుండగా.. వచ్చే ఏడాది నుంచి ప్రారంభించనున్న వైద్య కళాశాలల్లో కామారెడ్డి జిల్లా కూడా ఉంది. ఇప్పటికే రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ నేతృత్వంలో కామారెడ్డి పట్టణంలో స్థలాన్ని పరిశీలించి ఖాయం చేసిన చోటనే మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. శాశ్వత భవనం లేదంటే అందుబాటులో ఉన్న వసతుల ఆధారంగా వైద్య కళాశాల ఏర్పాటు తథ్యమని ప్రభుత్వం చెబుతున్నది. ఇదిలా ఉండగా మెడికల్ కాలేజీ నిర్వహణకు అధ్యాపక, అధ్యాపకేతర పోస్టులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడంతో వేగంగా అడుగులు పడుతున్నాయి. వైద్య కళాశాలకు అనుబంధంగా 500 పడకలతో ప్రభుత్వ జనరల్ దవాఖానను ఏర్పాటు చేయనున్నారు. దీంతో పేద, మధ్యతరగతి ప్రజలకు ఖరీదైన వైద్యం అందుబాటులోకి రానున్నది.
నిజామాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్రంలో వైద్యారోగ్య వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూతన మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తోంది. జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటే లక్ష్యంగా యుద్ధ ప్రాతిపాదికన సీఎం కేసీఆర్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ఏటా అకడమిక్ సంవత్సరానికి కొన్నింటిని ప్రారంభిస్తూనే వైద్య విద్యను బలోపేతం చేస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి ప్రారంభం కానున్న మెడికల్ కాలేజీల జాబితాలో కామారెడ్డి జిల్లాకు మంజూరైన వైద్య కళాశాల ఉంది. ఇందుకోసం ఏడాది కాలంగా ప్రభుత్వం ఏర్పాట్లను చేస్తుండగా సమయం ఆసన్నం అవుతుండడంతో చర్యలను వేగవంతం చేసింది. ఇప్పటికే రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ నేతృత్వంలో కామారెడ్డి పట్టణంలో స్థలాన్ని పరిశీలించి ఖాయం చేసిన చోటనే మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయనున్నారు. శాశ్వత భవనం లేదంటే అందుబాటులో ఉన్న వసతుల ఆధారంగా మెడికల్ కాలేజీ ఏర్పాటు తథ్యమని ప్రభుత్వం చెబుతోంది. అందుకు తగ్గట్లే మెడికల్ కాలేజీ నిర్వహణకు అధ్యాపక, అధ్యాపకేతర పోస్టులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడంతో వేగంగా అడుగులు పడుతున్నాయి.
2023-24 నుంచే మెడికల్ కాలేజీ ఆరంభానికి సిద్ధం కాబోతోంది. ఇప్పటికే సీఎం కేసీఆర్ ఈ మేరకు ప్రకటన చేశారు. మెడికల్ కాలేజీ డిమాండ్ స్థానికంగా ఎన్నో ఏండ్లుగా మూలుగుతున్నదే. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత 2016, డిసెంబర్ 11న కామారెడ్డి జిల్లాగా మారింది. అనంతర కాలంలో కేసీఆర్ మార్గదర్శకత్వంలో అభివృద్ధిలో కామారెడ్డి జిల్లా దూసుకుపోతోంది. పాత జిల్లాలతో పోటీ పడుతోంది. ఈ క్రమంలోనే 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు మెడికల్ కాలేజీ ఏర్పాటు కాబోతోంది. కొత్త కలెక్టరేట్ ప్రారంభోత్సవం సందర్భంగా 2021లో సీఎం కేసీఆర్ అధికారికంగా వైద్య కళాశాలను ప్రకటించారు. సరిగ్గా రెండేండ్ల కాల పరిమితిలోనే అందుకు తగిన మౌలిక సదుపాయాల కల్పనతోపాటు మెడికల్ విద్యకు కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలను వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా హరీశ్రావు బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ఏర్పాటు ప్రక్రియ వేగం పుంజుకున్నది. ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలో 9లక్షల 72వేల మంది జనాభా ఉంది. పట్టణాల్లో 1.30లక్షల మంది, గ్రామాల్లో 8.42లక్షల మంది ఉన్నారు.
మెడికల్ కళాశాల ఏర్పాటుతో పేద, మధ్య తరగతి ప్రజానీకానికి ఖరీదైన వైద్యం దరి చేరుతుంది. వైద్య కళాశాలకు అనుబంధంగా 500 పడకలతో ప్రభుత్వ జనరల్ దవాఖాన ఏర్పాటు చేయనున్నారు. ఇందులో అన్ని విభాగాలకు చెందిన వైద్య నిపుణులు ఉంటారు. ఎలాంటి రుగ్మతలకైనా చికిత్స చేసే సదుపాయం స్థానికంగా అందుబాటులోకి రానున్నది. ఫలితంగా పేదలకు ఇకపై ప్రైవేటు దవాఖానలకు వెళ్లి జేబులకు చిల్లులు పెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడదు. ఉచితంగానే కార్పొరేట్ స్థాయి వైద్యం అందడంతో పాటు ప్రజల్లో వైద్య భరోసా అన్నది రెట్టింపు కానున్నది. చిన్నపాటి జ్వరాలతో మొదలు పెడితే రూ.లక్షల్లో ఖర్చయ్యే శస్త్ర చికిత్సల వరకు మెడికల్ కాలేజీ ఏర్పాటుతో ప్రజలకు సదుపాయం కలుగుతున్నది. ఇప్పటి వరకు జిల్లా ప్రజలు సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. నిజామాబాద్ జనరల్ దవాఖాన లేదంటే హైదరాబాద్లోని గాంధీ దవాఖానలను ఆశ్రయించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇకపై ఎటూ తిరగాల్సిన అవసరం ఉండబోదు. కూతవేటు దూరంలోనే ఏర్పాటయ్యే కామారెడ్డి మెడికల్ కాలేజీ ద్వారా వైద్య సదుపాయం అందబాటులోకి రానున్నది.
కామారెడ్డి జిల్లా కేంద్రానికి మెడికల్ కాలేజీ మంజూరు చేసి వచ్చే ఏడాది నుంచి వైద్య విద్య తరగతులు, అనుబంధ దవాఖాన నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ప్రజల అవసరాలను గుర్తించడం, వాటిని అమలు చేయడంలో సీఎం కేసీఆర్ను మించినోళ్లు లేరు. ఇచ్చిన మాట ప్రకారం మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రికి కామారెడ్డి జిల్లా ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రభుత్వ మెడికల్ కాలేజీ ద్వారా వైద్య రంగంలో కామారెడ్డి మరింత వేగంగా దూసుకుపోనున్నది.
– గంప గోవర్ధన్, ప్రభుత్వ విప్