నిజామాబాద్, మార్చి 22, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రాణాలు తెగించి తెలంగాణ సాధించిన కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేస్తానంటూ ప్రగల్భాలు పలికిన సీఎం రేవంత్ రెడ్డి దిక్కు లేక పాత పథకాలను అమలు చేస్తున్నాడు. కేసీఆర్ తీసుకు వచ్చిన అనేక పథకాలను రద్దు చేసినప్పటికీ చివరికి వాటిపైనే ఆధారపడి ప్రజల్లోకి వెళ్తున్నాడు. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకానికి అదనంగా తులం బంగారం ఇస్తానని చెప్పి ఆడబిడ్డలకు ఢోకా చేసి ఆర్థిక సాయం రూ.లక్ష ఇస్తున్నాడు. రూ.4వేల పింఛన్ను అమలు చేయలేక గతంలో కేసీఆర్ ఇచ్చిన రూ.2వేలతోనే సరిపెడుతున్నాడు. రైతుబంధు పేరిట పెట్టుబడి సాయాన్ని రూ.15 వేలకు పెంచుతానని చెప్పి రైతుభరోసా పేరు తో కొన్ని సీజన్లు ఎగ్గొట్టి అమలు అరకొరగా అమలు చేస్తున్నాడు. తాజాగా సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీమ్కు రూపకల్పన చేస్తున్నాడు.
ఈ మేరకు 2026-27 వార్షిక బడ్జెట్లో నూతన విద్యా సంవత్సరంలో అమలుకు నిర్ణయం తీసుకున్నట్లుగా ఆర్థిక మంత్రి ప్రకటించాడు. గతంలో ఈ పథకాన్ని 2023లోనే కేసీఆర్ తీసుకు వచ్చారు. రేవంత్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత అర్ధాంతరంగా నిలిపేసి పేద, దిగువ, మధ్యతరగతి వర్గాల విద్యార్థులకు ఎనలేని నష్టం చేశాడు. అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వస్తున్న దరిమిలా కేసీఆర్ తీసుకు వచ్చిన అల్పాహారం పథకాన్ని దిక్కులేని దుస్థితిలో అమలు కాంగ్రెస్ ప్రభుత్వం ముందడుకు వేయడం విశేషం.
రేవంత్కు ఆదర్శంగా కేసీఆర్ పథకం..
ప్రభుత్వ బడుల్లో విద్యను అభ్యసించే వారికి బీఆర్ఎస్ ప్రభుత్వంలో అద్భుతమైన పథకం అమలైంది. ముఖ్యమంత్రి అల్పాహార పథకం పేరుతో 2023లో దసరా రోజు అమల్లోకి తీసుకు వచ్చారు. పాఠశాల విద్యా శాఖ ఉత్తర్వులతో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ స్కీమ్ను అమలు చేశారు. ప్రభుత్వ స్కూళ్లలో మధ్యాహ్న భోజనం విజయవంతంగా అమలవుతుండగా అదనంగా ఉదయం అల్పాహారం సైతం కేసీఆర్ సర్కారు గతంలోనే అమల్లోకి తీసుకు వచ్చింది. తద్వారా పేద కుటుంబాలకు చెందిన వారందరికీ ఎంతో మేలు జరిగింది.
మధ్యాహ్న భోజన పథకం నిజామాబాద్ జిల్లాలో 1180 ప్రభుత్వ స్కూళ్లలో, కామారెడ్డి జిల్లాలో 1011 ప్రభుత్వ బడుల్లో ఈ స్కీమ్ను విజయవంతంగా మొదలు పెట్టారు. మధ్యాహ్న భోజన పథకం అమలవుతున్నట్లే ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు అల్పాహారం పథకాన్ని కేసీఆర్ అందించారు. సర్కారు స్కూల్కు వెళ్లే వారందరికీ అల్పాహారం, మధ్యాహ్న భోజనంతో పాటుగా అత్యున్నతమైన విద్యను బీఆర్ఎస్ ప్రభుత్వం అందించింది. ఈ పథకం ద్వారా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దాదాపుగా 2లక్షల పైచిలుకు విద్యార్థులకు లాభం చేకూరింది. ప్రభుత్వ బడుల బలోపేతమే లక్ష్యంగా కేసీఆర్ ప్రభుత్వం పని చేసింది. రాజకీయ అక్కసుతో నిత్యం కేసీఆర్పై అనేక వేదికలపై నుంచి బూతుపురాణం పలికే రేవంత్ రెడ్డికి కేసీఆర్ పథకమే ఆదర్శంగా నిలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
పేదింటి బిడ్డలకు అండగా కేసీఆర్
పదేళ్ల కేసీఆర్ పాలనలో విద్యా వ్యవస్థ గాడిలో పెట్టారు. గురుకులాలు, ప్రభుత్వ బడులను బలోపేతం చేశారు. రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో విద్యా వ్యవస్థ పూర్తిగా గాడి తప్పింది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి పర్యవేక్షిస్తున్నప్పటికీ విద్యా శాఖలో నిర్లక్ష్యం, అవినీతి రోజురోజుకు పెరిగి పోతోంది. గురుకులాలు అదోగతిలో కొట్టుమిట్టాడుతున్నాయి. విషహారం తిని విద్యార్థులు ఆసుపత్రి పాలవుతున్నారు. రోడ్డెక్కి ధర్నాలు, రాస్తారోకోలు చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. నిర్లక్ష్య ఘటనలు చోటు చేసుకుని గురుకుల విద్యార్థులు ప్రాణాలు సైతం పోగొట్టుకోవడం బాన్సువాడలో వెలుగు చూసింది.
ఎల్లారెడ్డిలో ఎస్టీ గురుకుల విద్యార్థుల ఆందోళన రచ్చకెక్కింది. ఎడపల్లిలో స్కూల్ టీచర్కు వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళన చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఉమ్మడి జిల్లాలో గురుకులాల్లో పర్యవేక్షణ పూర్తిగా దెబ్బతిన్నది. కేసీఆర్ ప్రభుత్వంలో గురుకులాల్లో పౌష్టికాహారం సక్రమంగా అందింది. విద్యా వ్యవస్థ గాడిలో నడిచింది. ప్రభుత్వ స్కూళ్లను మన ఊరు మన బడి కార్యక్రమంతో బలోపేతం చేశారు. ఇంటి భోజనమే అక్కర్లేకుండా ఉదయం అల్పాహారం, మధ్యాహ్నా భోజనం పకడ్భందీగా అమలైంది. డ్రాపౌట్ సమస్యలకు చెల్లుచీటి అయ్యే విధంగా కృషి చేశారు.