వినాయక్నగర్, జనవరి 29 : నిజామాబాద్ జిల్లాకేంద్రంలో ఆదివారం రాత్రి పలువురు యువకుల మధ్య జరిగిన ఘర్షణ ఓ యువకుడి ప్రాణాలు బలిగొనగా.. మరో యువకుడికి తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నాడు. నగరంలోని ఖిల్లారోడ్డులో ఉన్న ఓ పాత భవనంలో ఓ యువకుడి మృతదేహాన్ని సోమవారం ఉదయం గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ట్రైనీ ఐపీఎస్ చైతన్యరెడ్డితో పాటు అదనపు డీసీపీ జయరాం, ఏసీపీ కిరణ్ కుమార్, నగర సీఐ నరహరి ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. యువకుడి శరీరానికి నిప్పంటించి దహనం చేసినట్లు పోలీసులు గుర్తించారు.
మృతుడిని ముఖీత్ (25)గా గుర్తించారు. ఈ ఘటనలో రాత్రి నిప్పంటించిన సంఘటనలో శరీరం కాలిన గాయాలతో షేక్ హైమద్ అనే మరో యువకుడు జిల్లా ప్రభుత్వ దవాఖానలో చికి త్స పొందుతున్నాడు. మృతుడు, క్షతగాత్రుడి మధ్య జరిగిన గొడవలో ఒకరినొకరు కాల్చుకున్నారని పోలీసులు తెలిపారు. వీరి మధ్య గొడవ జరిగిన సమయంలో ఎంత మంది ఉన్నారు, ఘటనకు గల కారణాలు, దీనివెనుక ఎవరెవరు ఉన్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నామని, ఖిలా రోడ్డు ఏరియాలోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నామని సీఐ తెలిపారు.