బోధన్, ఫిబ్రవరి 11: ఛత్రపతి శివాజీ అందరివాడని, అన్ని మతాల పట్ల ఆయనకు సమభావన ఉందని, ఏ ఒక్క మతం కోసమో యుద్ధం చేయలేదని, అటువంటి యోధుడికి మతం రంగు పులమవద్దని, ఆయనను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యే షకీల్ అన్నారు. శనివారం బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన శివాజీ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా షకీల్ మాట్లాడుతూ.. శివాజీ విగ్రహావిష్కరణను మతవాద పార్టీలు రాజకీయ లబ్ధికోసం వాడుకోవడం శోచనీయమన్నారు. శివాజీ చరిత్రను చదివినవారికి ఆయన గొప్పతనం తెలుస్తుందని, ఆయన మతం కోసం యుద్ధాలు చేయలేదన్నారు.
శివాజీ తన మరాఠా రాజ్యాన్ని కాపాడుకునేందుకే యుద్ధాలు చేశారన్నారు. శివాజీ సైన్యంలో 60 వేల మంది ముస్లిం సైనికులు ఉండేవారని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మధ్య మత వైషమ్యాలు పెంచడం మంచిదికాదన్నారు. హిందూ ముస్లిం భాయ్ భాయ్లా ఉండాలని, మత సామరస్యంతో అభివృద్ధి కోసం కృషిచేయాలన్నారు. శివాజీ విగ్రహంతో పాటు అంబేద్కర్ చౌరస్తాలో గ్రీన్ బెల్ట్లో మిగతా మహనీయుల విగ్రహాలను కూడా ఏర్పాటుచేస్తామన్నా రు. ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ను శివసేన జిల్లా అధ్యక్షుడు పసులోటి గోపికిషన్ సన్మానించారు. ఆయనతోపాటు శివసేన కార్యకర్తలు విగ్రహావిష్కరణకు తరలివచ్చారు