aనిజామాబాద్, ఫిబ్రవరి 13(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉద్యమ నాయకుడు, తెలంగాణ తొలి సీఎం, భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ గర్జించారు. చలో నల్లగొండ సభావేదికపై కేసీఆర్ చేసిన ప్రసంగం ఆద్యంతం అందరినీ ఆకట్టుకున్నది. ఇన్నాళ్లపాటు ప్రభుత్వంలో కీలక బాధ్యతల్లో ఉన్న కేసీఆర్ తన ప్రసంగంలో ఎక్కడా మాట దొర్లకుండా మర్యాదగా మెదులుతూ వచ్చారు. కానీ రెండున్నర నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇష్టానుసారంగా బాధ్యతను మరిచి మాట్లాడుతుండడం, ఇచ్చిన హామీలకు ఎగనామం పెడుతుండడంతో కేసీఆర్ స్పందించారు. మొత్తానికి తెలంగాణ రైతన్నల ఆత్మగౌరవానికి, వారి జీవనోపాధిని దెబ్బకొట్టేలా జల సంక్షోభంపై జంగ్ సైరన్ మోగించి కృష్ణా నదీ జలాల హక్కుల కోసం జై కొట్టి ఉద్యమ పంథాకు శ్రీకారం చుట్టారు. ఆనాడు ఉద్యమంలో వాగ్బాణాలతో యావత్ తెలంగాణ జనాలను ఆకర్షించగా ఇప్పుడు అదే స్థాయిలో ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ స్పందించిన తీరు సర్వత్రా ఆకర్షించింది. సీఎం సీట్లో కూర్చున్న రేవంత్ రెడ్డి చేస్తున్న యాగిని, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీరును కేసీఆర్ తన ప్రసంగంలో తేటతెల్లం చేశారు. దాదాపుగా ముప్పావు గంటసేపు సాగిన కేసీఆర్ ప్రసంగాన్ని యావత్ రాష్ట్రమంతా ఆసక్తిగా ఎదురుచూసి వీక్షించింది. ఇందులో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన జనాలు సైతం టీవీల్లో కేసీఆర్ ప్రసంగాన్ని చూసి ఆలోచనలోపడ్డారు.
డిసెంబర్ 3న అసెంబ్లీ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ 64 సీట్లతో అధికారాన్ని దక్కించుకున్నది. డిసెంబర్ 7న బాధ్యతలు చేపట్టిన తర్వాత నాటి నుంచి ఇప్పటి వరకు ఇచ్చిన హామీల అమలుకు, గత ప్రభుత్వం అమలు చేసిన పనుల కన్నా మిన్నగా పరిపాలన చేయాల్సింది పోయి ఎంతసేపూ ఆరోపణలతోనే కాంగ్రెస్ పాలకులు సమయాన్ని గడిపేస్తున్నారు. చీటికిమాటికి గత ప్రభుత్వాన్నే టార్గెట్ చేస్తూ పోవడం తప్ప 420 హామీల సంగతిని మాత్రం కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవడం లేదు. అడిగితే రైతులు, సామాన్యులపైనే ఆ పార్టీ పెద్దలంతా విరుచుకు పడుతున్నారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి సమయం ఇచ్చిన దరిమిలా కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ప్రాజెక్టులను అప్పగించడంతో కేసీఆర్ రంగప్రవేశం చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, హక్కులను కాపాడేందుకు ముందడుగు వేసి చలో నల్లగొండకు పిలుపునిచ్చారు. ఖమ్మం, నల్లగొండ, మహబూబ్నగర్, హైదరాబాద్, రంగారెడ్డి ప్రాంత ప్రజాప్రతినిధులు, ప్రజలతో ఊహించని స్థాయిలో బహిరంగ సభను నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపారు. అంతేకాకుండా తనదైన శైలిలో ఆరోపణ అస్ర్తాలను సంధించడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
ఉత్తర తెలంగాణ వరప్రదాయినిగా నిలిపిన కాళేశ్వరం ప్రాజెక్టులోని ఒక చిన్న భాగమైన మేడిగడ్డలోని పిల్లర్ను భూతద్దంలో పెట్టి చూపిస్తున్న కాంగ్రెస్ పార్టీ తీరును కేసీఆర్ ఎండగట్టారు. కాళేశ్వరం భారీ ప్రాజెక్టులోని రిజర్వాయర్లు, టన్నెళ్లు, కాలువల సంగతిని విశదీకరించారు. అంతేకాకుండా కాళేశ్వరం పేరిట సమయాన్ని వృథా చేస్తూ రైతులకు సాగుకు నీళ్లు ఇవ్వకుండా చోద్యం చూస్తున్న తీరును కేసీఆర్ వివరించారు. మిడ్మానేరు, లోయర్ మానేరు డ్యాంలో నీటి నిల్వ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూనే పరీవాహక ప్రాంత రైతుల దుస్థితిపైనా కదం తొక్కారు. చలో నల్లగొండతోనే ఆగదని… ఈ పంథా రాష్ట్రమంతటా కొనసాగుతున్నదని కేసీఆర్ ఢంకా బజాయించి చెప్పారు. ప్రజల కోసం కట్టె కాలేదాకా… కొట్లాడతానంటూ కేసీఆర్ చెప్పడంతో ప్రతిఒక్కరూ భావోద్వేగంతో స్పందించారు. సాగుకు కరెంట్ ఇవ్వ చేతకాని కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ రాజకీయ ఆరోపణలకే పరిమితమవుతున్నారని మండిపడ్డారు. రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు తానెప్పుడూ ముందుంటానని, తెలంగాణకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోనంటూ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతల తీరుపై సంధించిన వాగ్బాణాలకు ప్రజల నుంచి మంచి స్పందన వ్యక్తమైంది. వచ్చిన రెండు నెలలకే కరెంట్ కోతలు మొదలయ్యాయని, ఇదీ కాంగ్రెస్ పాలకుల రీతికి అద్దం పడుతున్నదని కేసీఆర్ పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్ తొలి ప్రసంగం విశేష స్పందనను రాబట్టింది.