Kotagiri | కోటగిరి, మార్చి 13 : పశువులకు తప్పనిసరిగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని ఏత్తోండ క్యాంప్ సర్పంచ్ గైనీ వీరామణి అర్జున్ అన్నారు. పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మండలంలోని ఏతోండ క్యాంప్ లో పశువులకు స్థానిక సర్పంచ్ గైనీ వీరామణి అర్జున్ శిబిరాన్ని శుక్రవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ గైనీ వీరామణి అర్జున్ మాట్లాడుతూ పాడి పశువుల పెంపకం తో రైతులకు ఎంతో మేలు కలుగుతుందని, పాడి పశువుల వల్ల కలిగే ప్రధాన ఉపయోగాలను వివరించారు.ఆవులు, గేదెలు వల్ల రైతులకు పాలు, పాల ఉత్పత్తుల ద్వారా నిత్య ఆదాయం లభిస్తుందన్నారు.
పశువుల పేడ సహజ ఎరువుగా పంటలకు ఉపయోగపడుతుందని, అలాగే ఎడ్లు వ్యవసాయ పనులలో రవాణాలో సహాయపడతాయన్నారు. ఇవి వ్యవసాయానికి అదనపు బలాన్ని ఇస్తూ రైతు కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పిస్తాయని చెప్పారు. పశువులకు సోకే గాలికుంటు వ్యాధుల వల్ల పశువుకు జ్వరం రావడం వల్ల పాలు తగ్గిపోయే ప్రమాదం ఉందని, కావున రైతులు సకాలంలో గాలికుంటు నివారణ టీకాలు వేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సురేష్ కుమార్, పశువైద్య సహాయకులు సుధీర్, సిబ్బంది రైతులు పాల్గొన్నారు.