ఆర్మూర్ : ఆర్టీసీ కార్గో సేవలను గ్రామీణ ప్రాంత ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యే జీవన్రెడ్డి సూచించారు. గురువారం అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల ప్రారంభమైన టీఎస్ ఆర్టీసీ కార్గో సేవలు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి జిల్లా హెడ్ క్వార్టర్లకు, నియోజకవర్గాల హెడ్ క్వార్టర్లకే పరిమితమైనట్లు చెప్పారు. ఇటీవల యావత్ ప్రపంచం, దేశం మొత్తం ప్యాండమిక్ సిస్టమ్లో రవాణా వ్యవస్థ స్తంభించిన సమయంలో సీఎం కేసీఆర్ ఆలోచనతో టీఎస్ ఆర్టీసీ ఆధ్వర్యంలో కార్గో సేవలు ప్రారంభమయ్యాయని, ఈ కార్గో సేవల వల్ల రాష్ట్రవ్యాప్తంగా 62 కోట్ల లాభం వచ్చిందని పేర్కొన్నారు.
కరోనా సమయంలో నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గట్టెక్కించడం కోసం బడ్జెట్లో 1500ల కోట్లను, బడ్జెటేతరలో మరో 1500 కోట్లను సీఎం కేసీఆర్ కేటాయించారని వెల్లడించారు. అమెజాన్, ప్లిప్ కార్డు వంటి కార్గో డెలివరీ ఏజెన్సీలతో ఒప్పందం కుదుర్చుకుని గ్రామీణ ప్రాంత ప్రజలకు సైతం కార్గో పార్సిల్స్ సేవలను అందుబాటులోకి తేవాలని ఎమ్మెల్యే జీవన్రెడ్డి కోరారు.