రామారెడ్డి, జూలై 31: ప్రకృతి ఒడిలో కొలువైన శ్రీస్వయంభూ బుగ్గ రామలింగేశ్వరస్వామి ఆలయం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నది. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని మద్దికుంట గ్రామానికి రెండున్నర కిలోమీటర్ల దూరంలో శ్రీస్వయంభూ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం ఉన్నది. 30 ఏండ్ల క్రితం చిన్న గుడి ఉండేది. సందర్శకులు, భక్తులు కాలినడకన, ఎడ్లబండ్లపై వెళ్లేవారు. పురాతనమైన ఈ ఆలయాన్ని గ్రామస్తుల ఆధ్వర్యంలో కులాలకు అతీతంగా ఆలయ కమిటీని ఏర్పాటు చేశారు. 2001లో ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఇంతింతై వటుడింతై అన్న చందంగా దాతల సహకారంతో శరవేగంగా అభివృద్ధి జరిగింది.
పేరు వచ్చిందిలా..
త్రేతాయుగంలో శ్రీరాముడు రావణవధ అనంతరం సహచరులతో కలిసి అయోధ్యకు వెళ్లే సమయంలో ఈ అరణ్యం మధ్యలో ఉన్న పరమశివుడి స్వయంభు లింగ రూపాన్ని అర్చించినట్లు చారిత్రక విశేషం. శివారాధనకు కావాల్సిన నీటిని బుగ్గ నుంచి సేకరించి అభిషేకం చేసేవారని, అందుకే ఈ స్వామికి బుగ్గ రామలింగేశ్వరుడు అనే పేరు వచ్చిందని చరిత్రకారులు చెబుతారు.
శ్రావణమాసంలో ప్రత్యేక పూజలు
స్వయంభూ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. నిత్యం బ్రహ్మ ముహూర్తంలో ఉదయం 4 గంటల నుంచి పూజలు, అభిషేకాలు, లక్ష బిల్వార్చన పూజలను ఆలయ ప్రధాన పూజారులు జంగం ప్రభాకర్ స్వామి, గణేశ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. జలబుగ్గ నుంచి రాగిబిందెలతో నీరు తెచ్చి, సమీపంలోని గోశాల నుంచి పాలు తెచ్చి మధ్యాహ్న సమయంలో స్వామివారికి పూజలు చేస్తారు.
బుగ్గ గుండం ప్రత్యేకత
బుగ్గ గుండము స్వామి వారి దేవాలయం వెనుక భాగములో ఉంటుంది. ఈ బుగ్గ గుండం నీటిని స్వామి వారి అభిషేకానికి వాడుతారు. ఈ నీరు చాలా పవిత్రమైనది. ఈ బుగ్గలో నీరు ఎంత తీసినా తరగదు. ఇది భగవంతుని మహిమగా.. ఈ నీటిని తాగినా, స్నానమాచరింనా చర్మసంబంధిత వ్యాధులు, దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. హరహర మహాదేవ అని చెంబెడు బుగ్గ నీరు ఆ స్వామిపై పోస్తేనే అభిషేకప్రియుడైన పరమశివుడు పరవశిస్తాడని శివ మహాపురాణం చెబుతున్నది. చారిత్రక ఆధారాలు లేని అతి ప్రాచీనమైన దేవాలయం పునరుద్ధరణ కోసం రామారెడ్డివాసి, శివారాధకుడు జంగం వీరభద్రయ్య కృషి చేశారు. మద్దికుంట గ్రామ పెద్దల ప్రో త్సాహంతో చుట్టు పక్కల గ్రామాలకు తిరిగి విరాళాలు సేకరించి నూతన ఆలయాన్ని నిర్మించారు. స్వామివారి ఎడమ పక్కన మంగళగౌరి అమ్మవారి విగ్రహాన్ని రెడ్డిపేట దొరగారి రాజేశ్వర్ రావు సూచన మేరకు జోగిపేటవాసి చాముండేశ్వరి అమ్మవారి ఆలయ నిర్మాణ దాత వెంకట రమణయ్య సలహాతో ప్రతిష్టించారు. వెంకట రమణయ్యకు కలలో స్వర్ణగౌరి పాము రూపంలో వచ్చి విగ్రహ ప్రతిష్టాపన చేయాలని చెప్పినట్లు పెద్దలు చెబుతారు.
బ్రహ్మ ముహూర్తంలో పూజలు
స్వయంభూ బుగ్గ రామలింగేశ్వర స్వామిని శ్రావణ మాసంలో దర్శించుకునేందుకు పెద్ద సంఖ్య లో భక్తులు ఇతర రాష్ర్టాల నుంచి వస్తుంటారు. శ్రావణ మాసంలో నిత్యం స్వామివారికి లక్ష బిల్వార్చన పూజలు బ్రహ్మ ముహూర్తంలో నిర్వహిస్తాం. స్వామివారిని దర్శించుకుంటే కోరుకున్న కోర్కెలు, అనారోగ్య సమస్యలు తీరుతాయని భక్తుల నమ్మకం.
– జంగం ప్రభాకర్ స్వామి, ప్రధాన పూజారి