శక్కర్నగర్, డిసెంబర్ 4: బోధన్- నిజామాబాద్ రహదారి విస్తరణ పనులతో పాటు వంతెన విస్తరణ పనులు చివరి దశకు చేరాయి. బోధన్- నిజామాబాద్ మధ్య ఎడపల్లి మండలంలోని బాపూనగర్ వద్ద రెండు వంతెనలు, ఎడపల్లి మండల కేంద్రం శివారులో ఓ వంతెన, బోధన్ పట్టణ శివారులోని నర్సాపూర్ వద్ద ఓ వంతెన, క్రిస్టియన్ సమాధుల వద్ద ఓ వంతెన ఇరుకుగా ఉండడంతో విస్తరణ పనులు ప్రారంభించారు.
ఈ పనులు సుమారు రెండేండ్లుగా కొనసాగుతున్నాయి. సాంకేతిక కారణాలతో పనుల్లో జాప్యం జరిగింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సుమారు నెల రోజుల నుంచి పనులు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి. ప్రస్తుతం పనులు చివరి దశకు చేరాయి. మరో 15 రోజుల్లో పనులు పూర్తయ్యే అవకాశాలున్నాయి. మిగిలిన చిన్న పనులుకూడా పూర్తిచేస్తే సౌకర్యంగా ఉంటుందని వాహనదారులు అంటున్నారు.