కిడ్నీ బాధితులకు బోధన్ జిల్లా దవాఖాన అండగా నిలుస్తున్నది. ఐదేండ్లుగా ఉచితంగా డయాలసిస్ సేవలు అందిస్తున్నది. వైద్యరంగాన్ని బలోపేతం చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. అధునాతన వైద్య సేవలను విస్తరించింది. ఈ క్రమంలోనే బోధన్ జిల్లా దవాఖానలో 2018లో డయాలసిస్ సెంటర్ను ఏర్పాటు చేసింది. ఇక్కడ రోజూ 20 మంది వరకు కిడ్నీబాధితులు ఉచితంగా వైద్య సేవలను పొందుతున్నారు.
శక్కర్నగర్, ఏప్రిల్ 28: ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన తెలంగాణ ప్రభుత్వం.. నాణ్యమైన వైద్య సేవలను అందిస్తున్నది. సర్కారు దవాఖానలను ఆధునీకరించింది. డాక్టర్లు, ఆధునిక వైద్య పరికరాలను సమకూర్చి నాణ్యమైన చికిత్స అందిస్తున్నది. ఇందులో భాగంగా బోధన్ పట్టణంలోని ఏరియా దవాఖానను జిల్లా దవాఖానగా అప్గ్రేడ్ చేసి వైద్య సేవలను అందిస్తున్నారు.
ప్రజల జీవన విధానం, ఆహారపు అలవాట్లతో బీపీ, షుగర్ వంటి రోగాలు ఎక్కువ అవుతున్నాయి. కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య కూడా పెరిగింది. మధుమేహం, కిడ్నీ బాధితులకు డయాలసిస్ ఒక్కటే మార్గం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం వారికి అండగా నిలుస్తున్నది. క్రమం తప్పకుండా డయాలసిస్ చేయించుకోవాల్సిందే. రూ. వేలల్లో ఖర్చయ్యే ఈ సేవలను సర్కారు దవాఖానలో అందజేస్తున్నారు. బోధన్ పట్టణంలోని జిల్లా ప్రభుత్వ దవాఖానాలో కిడ్నీ బాధితులకు సేవలందించేందుకు 2018, ఏప్రిల్ 25న డయాలసిస్ సెంటర్ను ప్రారంభించారు. ఐద మెషీన్లతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం బాధితులకు 24/7 సేవలు అందిస్తున్నది. నలుగురు పేషెంట్లకు బెడ్లు ఏర్పాటు చేయగా, మరో బెడ్తో ప్రత్యేక గదిని అందుబాటులో ఉంచారు. ఇందులో క్రిటికల్ కండీషన్లో ఉన్నవారికి డయాలసిస్ చేస్తున్నారు. ఈ కేంద్రంలో ఐదుగురు సిబ్బందితోపాటు పర్యవేక్షణకు ఓ వైద్యుడిని నియమించారు.
కిడ్నీ బాధితులు వారి వ్యాధి తీవ్రత మేరకు డాక్టర్లు సూచించినట్లుగా క్రమం తప్పకుండా డయాలసిస్ చేయించుకోవాల్సిందే. లేదంటే ప్రాణాలకే ప్రమాదం. డయాలసిస్ కోసం బాధితులు గతంలో ప్రైవేటు దవాఖానలకు వెళ్లేవారు. ఒక్కసారి డయాలసిస్ చేస్తే దాదాపు రూ. 6వేల ఫీజు వసూలు చేసేవారు. పేద, మధ్య తరగతి ప్రజలకు ఈ ఖర్చు తలకు మించిన భారమే. దీనిని దృష్టిలో ఉంచుకొని సర్కారు దవాఖానల్లోనే రాష్ట్ర ప్రభుత్వం.. డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నది. ఉచితంగా డయాలసిస్ చేయడంతోపాటు బాధితులకు అండగా ఉంటూ రూ.2016లు పింఛన్ కూడా ఇస్తున్నది. బోధన్ పట్టణంలోని జిల్లా దవాఖానలో ఉన్న డయాలసిస్ సెంటర్లో ఐదేండ్లుగా ప్రతిరోజూ 15 నుంచి 20 మందికి ఉచితంగా సేవలు అందిస్తున్నారు. డబ్బు, దూర భారం కూడా తగ్గడంతో బాధిత కుటుంబాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.
బోధన్ పట్టణంలోని జిల్లా ప్రభుత్వ దవాఖానలో ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్లో 24 గంటలపాటు సేవలు అందిస్తున్నారు. 2018లో డయాలసిస్ సెంటర్ ప్రారంభించగా ఇప్పటి వరకు 21,949 మందికి సేవలు అందాయి. 2018లో 1009 మందికి, 2019లో 3817 మందికి, 2020లో 4847 మందికి, 2021లో 5316 మందికి, 2022లో 5520 మందికి, 2023 మార్చి నాటికి 1445 మందికి డయాలసిస్ చేశారు.
అనారోగ్యం కారణంగా నాకు 11 ఏండ్లుగా డయాలసిస్ జరుగుతున్నది. బోధన్లో సెంటర్ లేనప్పుడు నిజామాబాద్కు వెళ్లి వై ద్యం చేయించుకునేదాన్ని. ఇప్పుడు దగ్గరలోనే డయాలసిస్ పెట్టడంతో దూరభారం తగ్గింది. వారానికోసారి డయాలసిస్ చేయించుకుంటున్నా. ఉచితంగానే వైద్యం చేస్తున్నారు. ప్రభుత్వం పింఛన్ కూడా ఇస్తున్నది. సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు..
-విజయ, బండారుపల్లి, బోధన్ మండలం
బోధన్లోని జిల్లా ప్రభుత్వ దవాఖానాలో డయాలసిస్ సెంటర్ పర్యవేక్షణకు ఇక్కడే విధులు నిర్వహిస్తున్న ఓ వైద్యుడిని కేటాయించాం. బాధితులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వేగంగా సేవలు అందిస్తున్నాం.. ఆదివారం మినహా మిగితా రోజుల్లో డయాలసిస్ చేస్తున్నాం.
-డాక్టర్ శివశంకర్,
బోధన్ ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్