నిజామాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ యూనివర్సిటీలో పరిపాలన తీరు పెనం నుంచి పొయ్యిలో పడ్డట్లు అన్న చందంగా మారింది. ఎవరికి వారే యమునా తీరేనన్న వ్యవహారంతో టీయూ మరింత గాడి తప్పుతున్నది. బాధ్యతాయుతమైన హోదాల్లో ఉంటున్న వ్యక్తులే వక్రబుద్ధిని ప్రదర్శిస్తూ విధులకు గైర్హాజరు అవుతూ జీతం బిల్లులను అప్పనంగా మెక్కేస్తున్నారు. విధులకు రాకుండానే, క్లాసులు తీసుకోకుండానే ఠంఛనుగా జీతం మాత్రం తీసుకుంటున్నారు. ఇదేం అంటే… అంతా మా ఇష్టం అన్నట్లుగా కొంతమంది తెగించి చెప్పేస్తున్నారు.
సన్మార్గంలో పనిచేసే వారు సైతం కొద్దిమంది తీరుతో తప్పటడుగులు వేయాల్సి వస్తున్నది. డిచ్పల్లి మెయిన్ క్యాంపస్తోపాటు జంగంపల్లి సౌత్ క్యాంపస్లోనూ ఇదే తంతు వెలుగు చూస్తున్నది. కొద్దిరోజుల క్రితం రిజిస్ట్రార్ యాదగిరి స్వయంగా సౌత్ క్యాంపస్ను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాంగణాన్ని కలియ తిరగడంతోపాటు పలు రికార్డులను తనిఖీ చేశారు.
ఇందులో ఒకరిద్దరు ప్రొఫెసర్లు హాజరు కాకపోవడంతో రిజిస్ట్రారే స్వయంగా సీఎల్(క్యాజువల్ లీవ్) పేరిట రిజిస్ట్రార్లో రిమార్క్స్ రాశారు. సీన్ కట్ చేస్తే సదరు ప్రొఫెసర్ మాత్రం నెల తిరిగే సరికి జీతం కోసం ఎస్టాబ్లిష్మెంట్ డిపార్ట్మెంట్కు క్లెయిమ్స్ పెట్టుకున్నారు. రిజిస్ట్రార్కు ఈ విషయం తెలియడంతో బిల్లును వాపస్ పంపించారు. కానీ సదరు ఆచార్యురాలిపై మాత్రం చర్యలు తీసుకోలేదు. ఏకంగా రిజిస్టార్ రిమార్క్స్ను ఉల్లంఘిస్తూ విధులకు హాజరైనట్లుగా బుకాయించినా వారిపై చర్యలు శూన్యమయ్యాయి.
కొద్దిరోజుల క్రితమే టీయూ పరిపాలన విభాగంలో కీలక వ్యక్తి ఛాంబర్లో కొంతమంది ఆచార్యుల వాదోపవాదాలు బయటికి పొక్కాయి. ప్రొఫెసర్లకు బయోమెట్రిక్ పెట్టడం ఏంటంటూ? నిలదీయడం ఇప్పుడు చర్చకు దారితీస్తున్నది. కలెక్టర్ కన్నా ఎక్కువ జీతాలు తీసుకునే తమ లాంటి వారికి బయోమెట్రిక్ పెట్టడం సబబు కాదంటూ వాదించిన తీరు యూనివర్సిటీలో ఆసక్తిని రేపుతున్నది. సమయానికి విధులకు హాజరైతే బయోమెట్రిక్ ఉన్నా లేకున్నా చర్చే ఉండదు. కానీ సమయపాలన లేకపోవడంతోనే చాలా మంది ప్రొఫెసర్లకు ఇప్పుడు మింగుడుపడడం లేదు.
హైదరాబాద్ నుంచి వచ్చి పోయే వారంతా బయోమెట్రిక్ మూలంగా నెత్తి పట్టుకోవాల్సి వస్తున్నది. కొంతమంది మాత్రం పైసలిచ్చి సౌత్ క్యాంపస్లోని ప్రొఫెసర్ను ఆదర్శంగా తీసుకొని కక్కుర్తి గాళ్లతో చేతులు కలుపుతున్నారు. ఇలా ఒకటి కాదు… రెండు కాదు అనేక డిపార్ట్మెంట్లలో సమయపాలన గాలికి కొట్టుకుపోతున్నప్పటికీ పట్టించుకోవాల్సిన యూనివర్సిటీ పెద్దలు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు తలెత్తుతున్నాయి.
యూనివర్సిటీలో వేలాది మందికి పాఠాలు బోధించి వారి జీవితాల్లో వెలుగు అందించాల్సిన ప్రొఫెసర్లలో కొంతమంది వక్రమార్గాన్ని ఎంచుకోవడంతో నీతి, నిజాయితీగా పనిచేసే వారికి సైతం చెడ్డ పేరు వస్తున్నది. ఎన్నో లక్ష్యాలతో యూనివర్సిటీకి వచ్చే సగటు విద్యార్థికి బాసటగా నిలిచి ఆదర్శంగా నిలవాలని ప్రొఫెసర్లను విద్యార్థులు కోరుతున్నారు. జీతం కోసం కక్కుర్తి పడుతున్న వారిని గుర్తించి నోటీసులు జారీ చేసి తక్షణం చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, విద్యార్థి సంఘాలు టీయూ రిజిస్ట్రార్ను, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
యూనివర్సిటీ ఏర్పాటు నుంచి నాన్ అకడమిక్ విభాగంలో పాతుకుపోయిన కొంతమంది వ్యక్తులు కూడా యూనివర్సిటీ ఆగమాగం కావడానికి కారణభూతులు అవుతున్నారు. సన్మార్గంలో నడిచి ఆదర్శంగా ఉండడం పక్కన పెట్టి వక్రమార్గంలో డబ్బులు సంపాదించడం, పదోన్నతులు పొందడమే ధ్యేయంగా పనిచేస్తున్నారు. ఇందుకోసం రికార్డులను తారుమారు చేయడం, లేదంటే ఫైళ్లను మాయం చేయడం వీరికి పరిపాటిగా మారింది. యూనివర్సిటీ స్థాపన నుంచి పాతుకుపోయిన నాన్ అకడమిక్ సహాయ రిజిస్ట్రార్ ఒకరి సహాయంతో గైర్హాజరైన వారికి జీతాల చెల్లింపులు చకచకా జరుగుతున్నట్లుగా టీయూలో గుసగుసలు వినిపిస్తున్నాయి. పైసలిస్తే సర్వం పనులు చేసి పెట్టిస్తారంటూ బాహాటంగానే చెప్పుకుంటున్నారు.
ఎస్టాబ్లిష్మెంట్ డిపార్ట్మెంట్ను కబంధ హస్తాల్లో పెట్టుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. సౌత్ క్యాంపస్లో ఓ మహిళా ప్రొఫెసర్ నెలలో సగానికి ఎక్కువ రోజులు ఏడాది పొడవునా డుమ్మా కొట్టడం రివాజుగా మారింది. ఏ ఒక్క రోజూ విధులకు సక్రమంగా రాకుండానే జీతం మాత్రం తీసుకుంటుండడం అందరికీ తెలిసిన విషయమే. ఇక డిచ్పల్లి మెయిన్ క్యాంపస్లో మొన్నటికి మొన్న గంజాయి సరఫరా కేసులో అరెస్ట్ అయిన కెమిస్ట్రీ విభాగానికి చెందిన వ్యక్తి సైతం ఇదే తీరును నడిపించినట్లుగా వెలుగు చూసింది. నెలల తరబడి యూనివర్సిటీకి రాకున్నా జీతం మాత్రం జమ అవ్వగా గంజాయి కేసు సందర్భంగానే అక్రమం బట్టబయలైంది. ఇలా అక్రమాన్ని సక్రమంగా మలుచుకుంటున్న ఇంటి దొంగలు చాలా మంది ఉన్నారంటూ విద్యార్థులు నిట్టూరుస్తున్నారు.